Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింధు, శ్రీకాంత్ ఆశలు
- బరిలో సైనా సైతం
- సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్ : డిసెంబర్లో జరిగిన డబ్ల్యూబీఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో నెగ్గిన పి.వి సింధు తనకు టైటిల్ పోరు ఫోబియా లేదని, తనూ గోల్డెన్ గర్లేనని నిరూపించింది. సిల్వర్ సింధు ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత నుంచి సింధు ఏ ఒక్క టోర్నీలోనూ మెరువలేదు. ఈ ఏడాది మూడు నెలలు గడిచినా ఒక్క టైటిల్ నెగ్గలేదు. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్స్ రెండో రౌండ్లో, మలేషియా ఓపెన్లో క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. ఈ రెండు సార్లూ కొరియా అమ్మాయి సంగ్ జీ హ్యూన్ చేతిలో భంగపడింది. ఇండియా ఓపెన్లో సెమీస్కు చేరుకున్నా, చైనా షట్లర్ హీ బింగ్జియావ్ ముందు తలొంచింది. నూతన షెడ్యూల్లో పొరపాట్లు సరిచేసుకునే సమయం కూడా ఎక్కువ లేదు. అయినా, సింధు ఈ ఏడాది తొలి టైటిల్ కోసం మరింత దూకుడుగా సింగపూర్ ఓపెన్కు సిద్దమైంది. మంగళవారం నుంచి ఆరంభం కానున్న సింగపూర్ ఓపెన్లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్తో పాటు టైటిల్ రేసులో నిలిచింది. తొలి రౌండ్లో ఇండోనేషియా షట్లర్తో సింధు తలపడనున్నది. ఇండోనేషియా ఓపెన్ విజేతగా నిలిచిన సైనా అనారోగ్య సమస్యలతో స్విస్, ఇండియా ఓపెన్కు దూరమైంది. మలేషియాలో తొలి రౌండ్లోనే ఓడినా, సింగపూర్లో పుంజుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. వర్థమాన డెన్మార్క్ షట్లర్ లైన్ హామార్క్తో సైనా తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరు, సమీర్ వర్మలు పోటీలో ఉన్నారు. డబుల్స్లో ప్రణవ్ జెర్రీ, సిక్కి రెడ్డి జంట, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ సహా మను అత్రి, సుమీత్ రెడ్డిలు పోటీపడుతున్నారు.