Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు జట్లతో మహిళల ఐపీఎల్
- హైదరాబాద్కు ఐపీఎల్12 ఫైనల్స్!
- టీఎన్సీఏకు వారం రోజుల గడువు
- బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఏప్రిల్ 15. భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు!. 2011 తర్వాత భారత్కు మరో ప్రపంచకప్ తీసుకొచ్చేందుకు బ్రిటన్కు పయనమయ్యే జట్టును బీసీసీఐ ఆ రోజే ఎంపిక చేయనున్నది. 15 మంది జట్టులో 12 మంది ఎంపిక లాంఛనమే కానీ, మిగతా మూడు స్థానాలపై ఉత్కంఠ ఏప్రిల్ 15న వీడనున్నది.
2019 వన్డే వరల్డ్కప్కు భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 15న ఎంపిక చేయనున్నారు. ముంబయిలో సమావేశం కానున్న ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ భేటికి కెప్టెన్ విరాట్ కోహ్లి హాజరు కానున్నారు. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలో సమావేశమైన పాలకుల కమిటీ వెల్లడించింది. వరల్డ్కప్ జట్టు ప్రకటన సహా పలు కీలక అంశాలపై సీఓఏ సమావేశం ఓ నిర్ణయానికి వచ్చింది. ఐపీఎల్ 12 ప్లే ఆఫ్స్, ఫైనల్స్ వేదిక, మహిళల ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచులు, దేశవాళీ టోర్నీల ప్రధాన స్పాన్సర్ టెండర్లపై సీఓఏ కీలక నిర్ణయాలు తీసుకున్నది.
ఆ ముగ్గురు ఎవరు? : ప్రపంచకప్ జట్టుపై చాలా స్పష్టతతో ఉన్నాం. ఫిబ్రవరి నాటికి కుదించిన 20 మంది జాబితాలో 15 మంది ఎవరో తేల్చుకున్నాం. చివరి నిమిషంలో ఒక్క స్థానం మినహా మిగతా స్థానాలపై అనిశ్చితి లేదు. ఐపీఎల్ ప్రదర్శనను మా జాబితాలోని ఆటగాళ్ల, స్టాండ్బై ఆటగాళ్ల ప్రదర్శన బేరీజు వేసుకోవడానికి మాత్రమే పరిశీలిస్తున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉండదు అని ఇటీవల సెలక్షన్ కమిటీ చైర్మెన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. కెప్టెన్ కోహ్లి సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. ఐపీఎల్లో ఒకరిద్దరు మెరుగ్గా రాణించలేదని కారణంతో, ప్రపంచకప్ జట్టులో స్థానంపై ప్రభావం ఉండదని విరాట్ పేర్కొన్నాడు. ముందుగా చెప్పినట్టు, ప్రపంచకప్ జట్టు ఎంపిక అలాగే ఉంటుందా? లేదా చివరి నిమిషంలో కొత్త ముఖాలు తెరపైకి వస్తాయా? అనేది చూడాలి. ప్రస్తుతానికి భారత జట్టు 15 మందిలో 12 మందిపై ఓ స్పష్టత ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ మూడు స్థానాలపై ఇంకా పీటముడి కొనసాగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో నం.4, రెండో ఆల్రౌండర్, నాల్గో సీమర్ స్థానాలపై ఏప్రిల్ 15న సెలక్షన్ కమిటీ తేల్చాల్సి ఉన్నది. యువరాజ్ సింగ్ జట్టుకు దూరమయ్యాక నాల్గో స్థానంలో భారత్ 11 మందిని పరీక్షించింది. న్యూజిలాండ్ సిరీస్కు ముందు వరకూ అంబటి రాయుడు నం.4లో ఖాయమని అనిపించాడు. కానీ అతడి తాజా ఫామ్లో నం.4 కథ మళ్లీ మొదటికొచ్చింది. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, విజయ్ శంకర్ సహా కెఎల్ రాహుల్లు ఆ స్థానం కోసం పోటీపడుతున్నారు. హార్దిక్ పాండ్య తర్వాత రెండో ఆల్రౌండర్గా ఇన్నాండ్లూ రవీంద్ర జడేజా జట్టులో కొనసాగుతూ వచ్చాడు. భీకర ఫామ్తో విజరు శంకర్ ఇప్పుడా స్థానానికి ప్రధాన పోటీదారుడయ్యాడు. పేసర్ల విభాగంలో జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్లకు తోడు పాండ్య పేస్ విభాగంలో ఉండనున్నాడు. సెలక్షన్ కమిటీ నాల్గో సీమర్ లేదా లెఫ్టార్మ్ సీమర్ కావాలని అనుకుంటే ఏం చేస్తుందనేది ఆసక్తికరం. ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్లకు తోడు నవదీప్ షైని తాజాగా రేసులోకి వచ్చాడు. ఏప్రిల్ 15న వాంఖడేలో ముంబయి ఇండియన్స్తో బెంగళూర్ తలపడనున్నది. ఆ మ్యాచ్ కోసం ముంబయి రానున్న కోహ్లి.. అంతకుముందే సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నాడు.
హైదరాబాద్లో ఐపీఎల్ ఫైనల్ : పాలకుల కమిటీ సమావేశంలో తీసుకున్న మరో కీలక నిర్ణయం ఐపీఎల్ 12 టైటిల్ పోరు వేదిక. రూల్స్ ప్రకారం గత ఏడాది విజేత చెన్నై సొంతగడ్డ ఫైనల్ ఆతిథ్య హక్కులు కల్గి ఉంటుంది. కానీ చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ నుంచి చెపాక్ మూడు స్టాండ్లకు అనుమతి లేదు. ఈ మూడు స్టాండ్ల సీటింగ్ సామర్థ్యం 12 వేలు. టైటిల్ పోరులో ఇలా మూడు స్టాండ్లు ఖాళీగా ఉండటం సమంజసం కాదని బీసీసీఐ భావించింది. ఐపీఎల్11 రన్నరప్ సన్రైజర్స్ సొంత నగరం హైదరాబాద్కు ఫైనల్స్ ఆతిథ్య హక్కులు దక్కే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పోరేషన్తో అనుమతుల కోసం తమిళనాడు క్రికెట్ సంఘానికి బీసీసీఐ వారం రోజుల గడువు విధించింది. ఆ లోగా అనుమతులు లభించకపోతే ప్లే ఆఫ్స్ మ్యాచులు బెంగళూర్, ఫైనల్స్ హైదరాబాద్కు తరలిస్తామని వెల్లడించింది. ఇదిలా ఉండగా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం రెండు వారాల్లో ఆటగాళ్ల అసోసియేషన్ ఏర్పాటు చేయటం, టోర్నమెంట్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం కొత్త టెండర్లు ఆహ్వానించాలని సీఓఏ నిర్ణయించింది.