Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి విజ్డెన్ 'లీడింగ్ క్రికెటర్' అవార్డు
- మహిళల క్రికెట్లో మంధానకు పురస్కారం
న్యూఢిల్లీ : క్రికెట్ సూపర్ స్టార్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనత దక్కించుకున్నాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లి సారథ్యంలో ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్ గదలో టీమ్ ఇండియా హ్యాట్రిక్ కొట్టగా.. వ్యక్తిగత పురస్కారాల్లో కింగ్ కోహ్లి తీన్మార్ వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక విజ్డెన్ పురస్కారాల్లో వరుసగా మూడో ఏడాది ' లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్' అవార్డు విరాట్ కోహ్లిని వరించింది. ఈ మేరకు విజ్డెన్ బుధవారం ప్రకటించింది. 2018లో మూడు ఫార్మాట్లలో 68.37 సగటుతో 2,735 పరుగులు చేసిన విరాట్, 11 శతకాలు బాదాడు. ఐసీసీ పురస్కారాల్లోన అగ్రతాంబూలం దక్కించుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ సహా టెస్టు, వన్డే క్రికెటర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 59కిపైగా సగటుతో 593 పరుగులు చేసిన కోహ్లి ఇంగ్లీష్ విమర్శకుల నోటికి తాళం వేశాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటలో కోహ్లి కేవలం 134 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. ' పరాజిత జట్టు వైపు నిలిచినా, విరాట్ కోహ్లి బ్యాట్తో గొప్పగా రాణించాడు. 2014 టూర్ వైఫల్యానికి ముగింపు పలికాడు. ఇంగ్లాండ్లో కోహ్లి టెస్టు బ్యాటింగ్ అమోఘం. వన్డే క్రికెట్లో కోహ్లి ఫామ్ నూతన శిఖరాలను చేరుకున్నది' అని విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ బూత్ పేర్కొన్నాడు. భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతీ మంధాన సైతం విజ్డెన్ పురస్కారాల్లో మెరిసింది. లీడింగ్ క్రికెటర్ ఇన్ ఉమెన్ గేమ్ అవార్డుకు అందుకున్నది. అఫ్గనిస్థాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ వరుసగా రెండో ఏడాది లీడింగ్ టీ20 క్రికెటర్గా నిలిచాడు.