Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని వాగ్వాదం
- విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం
- దిగజారిన అంపైరింగ్ ప్రమాణాలు!
ఈ ఏడాది ఐపీఎల్ వివాదాలకు నిలయంగా నిలుస్తోంది!. 2013లో ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ భారత క్రికెట్లో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. అప్పుడు అభిమానులు ఆటలో నిజాయితీపై సందేహం లెవనెత్తారు. తాజా సీజన్లో ప్రతి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టే సాగుతోంది. కీలక సమయాల్లో అంపైరింగ్ నిర్ణయాలు మ్యాచ్ ఫలితాల్ని శాసిస్తున్నాయి. అంపైరింగ్ తప్పిదాలు ఆటపై ఉత్సుకతను నీరుగార్చటం ఆందోళన చెందాల్సిన అంశం.
శ్రీనివాస్ దాస్ మంతటి
ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్. చివరి బంతికి బెంగళూర్ ఏడు పరుగులు చేయాలి. యార్కర్ల హీరో లసిత్ మలింగ చేతిలో బంతి. చివరి బంతికి బెంగళూర్ ఒక్క పరుగే చేసింది. ముంబయి ఐదు పరుగులతో గెలుపొందింది. కానీ కొద్దిసేపటికే పెద్ద తెరపై మలింగ గీత దాటేసి బంతి వేస్తున్నట్టు ప్రత్యక్షమైంది. ఆ స్థాయి నో బాల్ను గుర్తించకపోవటం తీవ్రమైన అంపైరింగ్ తప్పిదం. ఒకవేళ ఆ బంతిని నో బాల్పై ప్రకటించి ఉంటే, బెంగళూర్ చివరి బంతికి ఐదు పరుగులే చేయాలి. స్ట్రయిక్ ఏబీ డివిలియర్స్కు రావటంతో.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని చెప్పవచ్చు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్. ముంబయి ఇన్నింగ్స్ తొలి ఓవర్. కెప్టెన్ అశ్విన్ ఆరు బంతులు విసిరాడు. ఇక ఓవర్ అయిపోయింది, తర్వాతి బౌలర్ ఎవరో అని అభిమానులు చూస్తున్నారు. కానీ అశ్విన్ మళ్లీ లెంగ్త్ తీసుకుని, బంతి సంధించాడు. ఆ ఓవర్లో అది ఏడో బాల్. ఆ బంతిని ముంబయి బ్యాట్స్మన్ డికాక్ బౌండరీకి తరలించాడు. అశ్విన్ వేసిన తొలి బంతిని బ్యాట్స్మెన్ ఎదుర్కొన్నా, అతడు సిద్దంగా లేడన్న అంపైర్తో అశ్విన్ ఏకీభించాడు. మరో బంతి సంధించాడు. అయితే, ఈ విషయం వారి మధ్యనే ఉండిపోయింది. మైదానంలో తెరపై దాన్ని ఏడో బంతిగానే చూపించారు. మ్యాచ్ అనంతరం ముంబయి ఇండియన్స్ ట్విట్టర్లో దీనిపై స్పష్టత ఇచ్చింది. తొలి బంతి డెడ్ బాల్గా ప్రకటించారని పేర్కొన్నది.
తాజాగా, చెన్నై సూపర్ కింగ్స్తో రాజస్థాన్ రాయల్స్ పోరు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నాటకీయంగా సాగిన ఫైనల్ ఓవర్ అని చెప్పవచ్చు. దూకుడుమీదున్న ధోని అవుటవగా, చెన్నై మూడు బంతుల్లో 8 పరుగులు చేయాలి. స్ట్రయిక్ టెయిలెండర్ మిచెల్ శాంట్నర్. రాయల్స్ బౌలర్ బెన్ స్టోక్స్ వేసిన బంతిని ప్రధాన అంపైర్ హైట్ నో బాల్గా సిగల్ ఇచ్చాడు. కానీ వెంటనే లెగ్ అంపైర్ దాన్ని తిరస్కరించాడు. అంపైర్లు ఇద్దరూ చెరో నిర్ణయం తీసుకోగా, గందరగోళ వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో చెన్నై కెప్టెన్ ధోని మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదనకు దిగాల్సి వచ్చింది.
ఈ మూడు సంఘటనలు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే చోటు చేసుకున్నాయి. ముంబయి ఇండియన్స్తో మ్యాచ్ అనంతరం బెంగళూర్ కెప్టెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ' ఇది క్లబ్ క్రికెట్ కాదు. ఐపీఎల్ స్థాయి క్రికెట్. అంపైర్లు కండ్లు తెరిచి చూడాలి' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిఫరీ వద్ద సైతం కోహ్లి ఆవేశంగా మాట్లాడాడు. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా ఫర్వాలేదు కానీ, ఇటువంటి అంపైరింగ్ను విమర్శించకుండా ఉండను అని ఆవేశంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇక అశ్విన్ ఏడు బంతుల ఓవర్ విషయంలో ఐపీఎల్, బీసీసీఐ నుంచి ఎటువంటి వివరణ లేదు. ముంబయి ఇండియన్స్ దానిపై వివరణ ఇచ్చింది. ఇక అన్నింటికి మించి, చెన్నైతో రాజస్థాన్ ఆఖరి ఓవర్ హైడ్రామా అంపైరింగ్ ప్రమాణాలపై సందేహాలు లేవనెత్తుతోంది.
ధోని చేసినది తప్పా? : అంతకముందు బంతికే అవుటైన ధోని డగౌట్కు చేరుకున్నాడు. ధోని వికెట్తో రాయల్స్ విజయావకాశాలు మెరుగయ్యాయి. కానీ నడుము కంటే ఎత్తులో స్టోక్స్ బంతి విసరటంతో అంపైర్ హైట్ నో బాల్ ప్రకటించాడు. అప్పటికే జడేజా అంపైర్లతో వాదనకు దిగాడు. గందరగోళ పరిస్థితిలో మైదానంలోకి అడుగుపెట్టిన ధోని ప్రధాన అంపైర్ ఉల్మాస్ గాంధెతో ఆవేశంగా మాట్లాడాడు. మరో అంపైర్ బ్రూస్ ఆక్సెన్ఫోర్డ్ ధోనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా, మహి అసంతృప్తిగానే కనిపించాడు. ఆ బంతిని చివరకు నో బాల్గా ఇవ్వలేదు. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా, శాంట్నర్ సిక్సర్ కొట్టి చెన్నైని గెలిపించాడు.
ఆటగాళ్ల క్రమశిక్షణ నిబంధనల ప్రకారం ధోని చేసింద తప్పు. అంపైర్ల నిర్ణయాన్ని నిరసించటం, వారితో వాదనకు దిగటం కఠిన చర్యలకు సిద్దపడటమే. కానీ, ఓ మ్యాచ్లో ఇద్దరు అంపైర్లు చెరో మాటపై ఉండటం క్రికెట్ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. నిజానికి ఆ బంతి నో బాలే. మరీ సందేహంగా ఉంటే, మూడో అంపైర్ సహాయం తీసుకోవాల్సింది. కానీ అంపైర్లు ఆ పని చేయలేదు. తొలుత నో బాల్ అని, తర్వాత కాదని భిన్న నిర్ణయాలు తీసుకుని గందరగోళ పరిస్థితికి చోటిచ్చారు. ఈ సమయంలో చెన్నై కెప్టెన్గా ధోని స్వయంగా రంగంలోకి దిగాడు. అంపైర్లు ప్రమాణిక నిర్ణయాలు తీసుకుని ఉంటే, అసలు ధోని మైదానంలోకి రావాల్సిన అవసరమే లేదు. కెప్టెన్గా ఐపీఎల్లో 100వ విజయం ఖాతాలో వేసుకున్న ధోనితో పాటు ఈ మ్యాచ్ అందరికీ గుర్తుండిపోతుంది.
నాసికరం అంపైరింగ్పై బీసీసీఐకి ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్లాయి. భారత్లో ఐసీసీ ఎలైట్ స్థాయి అంపైర్లు లేరు. ఎస్. రవి ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానల్లో ఉన్నాడు. కానీ అతడే ముంబయి, బెంగళూర్ మ్యాచ్లో నో బాల్ను గుర్తించలేదు. గతంలో అంపైరింగ్ తప్పిదాలు ఎక్కువగా ఎల్బీడబ్లూ అవుట్ల విషయంలో కనిపించేది. కానీ డీఆర్ఎస్ రాకతో బ్యాట్స్మన్ సమీక్ష కోరుతున్నాడు. బౌలర్లు అదే అస్త్రాని వాడుతున్నారు. దీంతో ఎల్బీ అవుట్లపై వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు వరుసగా నో బాల్ నిర్ణయాలపై వివాదం రేగుతోంది. ఈ రెండు సంఘటనల్లో పూర్తిగా అంపైర్ల తప్పిదమే కనిపిస్తోంది. అంపైరింగ్ ప్రమాణాలు మెరుగుపడకుంటే, భవిష్యత్లో నో బాల్ కోసం సైతం డీఆర్ఎస్ను ఆశ్రయించే పరిస్థితి లేకపోలేదు.