Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయంపై సన్రైజర్స్ గురి
నవతెలంగాణ-హైదరాబాద్
ఆరు మ్యాచులు, మూడు విజయాలు, మూడు ఓటమలు. ఇదీ ఐపీఎల్12లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన. కాగితంపై ఐపీఎల్ ట్రోఫీ ఎత్తగల జట్టే అయినా, మైదానంలో హైదరాబాద్ తడబడుతోంది. ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో నాణ్యమైన బ్యాట్స్మెన్ కొరత హైదరాబాద్ను వేధిస్తోంది. ఓపెనర్లు డెవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో విఫలమైతే... సన్రైజర్స్ అష్టకష్టాలు పడుతోంది. ఈ బలహీనతే ఆయుధంగా చేసుకుంటోన్న ప్రత్యర్థులు ఆరంభ ఓవర్లలోనే వార్నర్, బెయిర్స్టోలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇద్దరిలో ఎవరిని వెనక్కి పంపినా, జట్టు వ్యూహంలో భాగంగా మరో బ్యాట్స్మెన్ నెమ్మదించాల్సిందే. దీంతో హైదరాబాద్ భారీ స్కోర్లు నమోదు చేయటంలో విఫలమవుతోంది. సొంతగడ్డపై చివరి మ్యాచ్ను ముంబయి ఇండియన్స్కు నాటకీయ ఫక్కీలో కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్పై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ కానె విలియమ్సన్ నేటి మ్యాచ్లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సారథిగా విఫలమైన భువనేశ్వర్ నేటి మ్యాచ్లో బౌలింగ్పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు. మిడిల్ ఆర్డర్లో యూసుఫ్ పఠాన్ తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. అభిషేక్ శర్మ సన్రైజర్స్ తరఫున అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన కోల్కతపై వరుసగా రెండో విజయం సాధించి ఇక్కడికొస్తుంది. సన్రైజర్స్ను కాదనకుని వెళ్లిన శిఖర్ ధావన్ ఈడెన్ గార్డెన్లో ధనాధన్ ఇన్నింగ్స్ జోరుమీదున్నాడు. యువ మెరుపులు రిషబ్ పంత్, పృథ్వీ షాలతో ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్కు కొత్త రూపు తీసుకొచ్చాడు. స్వల్ప స్కోర్ల మ్యాచ్లో ఢిల్లీపై హైదరాబాద్ కోట్లలో నెగ్గినా.. నేడు ఉప్పల్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్కు వార్నర్, బెయిర్స్టో, రషీద్ ఖాన్ కీలకం కానుండగా.. శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కగిసో రబాడలు ఢిల్లీకి కీలక ఆటగాళ్లు.