Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నం.4పై పెరుగుతున్న ఆసక్తి
- రేసులో పంత్, రాహుల్,రాయుడు
- నేడు ప్రపంచకప్ జట్టు ఎంపిక
శ్రీనివాస్ దాస్ మంతటి
బ్యాటింగ్ లైనప్లో నం.4 స్థానం బండికి ఇరుసు వంటిది!. టాప్ ఆర్డర్తో కలిసి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయటంలో దూకుడు పెంచడానికి ఎంత కీలకమో, మిడిల్ ఆర్డర్తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టడంలోనూ ఆ స్థానం అంతే కీలకం. బౌలర్లపై దూకుడుగా దండయాత్ర చేయటంలో, సమయస్ఫూర్తితో వికెట్ల మధ్య పరుగు తీయటంలో సిద్ధహస్తుడైన బ్యాట్స్మనే ఆ స్థానానికి పూర్తి న్యాయం చేయగలడు. మూడో వరల్డ్కప్ కోసం లండన్ వెళ్లాల్సిన భారత జట్టులో ఇప్పుడా స్థానం ఎవరిదనే ఆసక్తి పెరుగుతోంది. రాయుడు, రిషబ్, కార్తీక్, రాహుల్ రేసులో నిలిచారు. సోమవారం సెలక్షన్ కమిటీ నం.4 ఎవరిదో చెప్పే ముందు, ఆ స్థానం కోసం పోటీపడుతున్న వారి అవకాశాలను చూద్దాం!.
అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, అజింక్య రహానె, ఎం.ఎస్ ధోని, యువరాజ్ సింగ్, మనీశ్ పాండే, కెఎల్ రాహుల్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లి.. ఇది భారత క్రికెట్ జట్టు జాబితా కాదు. జాబితా 11 మందితో కూడకున్నదే, కానీ ఒక జట్టు కాదు. ఓ జట్టులో ఓ స్థానం కోసం గత రెండేండ్లుగా చేసిన ప్రయోగాలు. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన నాటి నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో నం.4 స్థానం కోసం టీమ్ ఇండియా ఏకంగా 11 మందిని పరీక్షించింది. దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 2011 వరల్డ్కప్ వరకూ భారత్కు ఈ స్థానంలో బలమైన ఆటగాడు. అతడు జట్టుకు దూరమైన తర్వాత ఆ స్థానానికి మరో ఆటగాడు న్యాయం చేయలేదు. చివరకు యువరాజ్ సింగే స్వయంగా మరోసారి అదృష్టం పరీక్షించుకున్నా, సఫలీకృతం కాలేదు. తొలి నాళ్లలోనే కాదు, ఆధునిక క్రికెట్లోనూ ప్రపంచకప్ నెగ్గిన జట్లకు నం.4లో బలమైన ఆటగాడుత ఉన్నాడు. 2011లో భారత్, 2015లో ఆస్ట్రేలియాలు ఈ స్థానంలో తిరుగులేని ఆటగాడితో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాయి. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్కప్ సాధించాలని తపిస్తోన్న టీమ్ ఇండియా అన్ని విభాగాల్లోనూ రాటుదేలినా, బ్యాటింగ్ లైనప్లో సరైన నం.4ను దొరకబట్టలేదు. వరల్డ్కప్కు మరో నెల రోజుల గడువు మాత్రమే ఉన్నది. ప్రపంచకప్ జట్ల ప్రకటనకు ఏప్రిల్ 23 తుది గడువు. డెడ్లైన్కు ముందే, ఏప్రిల్ 15న బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేయనున్నది. 15 మంది ప్రపంచకప్ బృందంలో 13-14 స్థానాలపై స్పష్టత కనిపిస్తోన్నా.. ఒక్క నం.4 విషయంలోనే ఇంకా విపరీతమైన చర్చ నడుస్తూనే ఉన్నది.
సరైనోడు ఎవరు? : మొన్నటి వరకూ తెలుగు తేజం అంబటి రాయుడిదే నం.4 స్థానం అని అనుకున్నాం. చాంపియన్స్ ట్రోఫీకి ముందు అజింక్య రహానె, మనీశ్ పాండేలు ఈ స్థానంపై కన్నేసినా క్రమేపి వారు జట్టుకు భారమై, దూరమయ్యారు. గణాంకాల పరంగా అంబటి రాయుడు ప్రస్తుతం రేసులో ఉన్నవారిలో ముందున్నాడు. నం.4లో 15 మ్యాచులు ఆడిన రాయుడు 42.18 సగటుతో 464 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 43 ఫోర్లు, 11 సిక్సర్లతో దూకుడుగా ఆడగలనని నిరూపించుకున్నాడు. కానీ ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో సిరీస్లలో రాయుడు తేలిపోయాడు. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. నం.4 బ్యాట్స్మన్ వైఫల్యంతోనే మెరుపు ఆరంభాలను భారత్ భారీ స్కోర్లుగా మలచుకోలేదనే విమర్శలు వినిపించాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రాయుడిని బెంచ్కు పరిమితం చేశారు. నం.4 కోసం కోహ్లి మనసులో మరో ఆలోచన ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
రాయుడు తర్వాత నం.4లో మెరుగైన గణాంకాలు కల్గిన బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్. తొమ్మిది మ్యాచుల్లో అతడు 264 పరుగులు చేశాడు. 52.80 సగటుతో రెండు అర్ధ సెంచరీలు కార్తీక్ ఖాతాలో ఉన్నాయి. విలక్షణ షాట్లతో బౌండరీలు దోచేయటంలో కార్తీక్కు మంచి పేరుంది. కానీ న్యూజిలాండ్తో సిరీస్లో ఓ మ్యాచ్ ముగించటంలో కార్తీక్ ఆట తీరు తీవ్ర విమర్శలకు చోటిచ్చింది. ఆస్ట్రేలియాతో స్వదేశీ సిరీస్కు సెలక్టర్లు కార్తీక్ను దూరం పెట్టారు. ప్రపంచకప్ రేసులో అతడు లేడని సెలక్షన్ కమిటీ నేరుగానే సంకేతాలు ఇచ్చింది!.
యువ ఆటగాడు, బ్యాటింగ్ లైనప్కు వైవిధ్యత తీసుకురాగల బ్యాట్స్మన్గా రిషబ్ పంత్ నం.4కు బలమైన పోటీదారుగా దూసుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో పంత్కు నాల్గో స్థానంలో ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్ పంత్ 16 పరుగులే చేసినా, జట్టు మేనేజ్మెంట్ యువ విధ్వంసకారుడిపై నమ్మకంగా కనిపిస్తోంది. పంత్తో కుడి ఎడమల కాంబినేషన్ కుదరటంతో పాటు, టెస్టుల్లో అతడి ఆట తీరులో చూపించిన పరిణితి ఇక్కడ పనికొస్తుందనే భావన కనిపిస్తోంది. ధనాధన్ బౌండరీలతో విరుచుకుపడటమే పంత్ శైలిగా భావించిన వారికి, సంప్రదాయ టెస్టు ఇన్నింగ్స్లతో సమాధానం ఇచ్చాడు. వికెట్ కీపర్గానూ ధోనికి రిజర్వ్ ఆటగాడు కాగలడు. ప్రస్తుతం నం.4 పొజిషన్కు రిషబ్ పంత్ గట్టి పోటీదారుడే. లండన్ రేసులో అందరి కంటే ముందున్నాడు.
చివరగా అయినా, కచ్చితంగా ఆలోచన చేయాల్సిన పేరు కెఎల్ రాహుల్. ధనాధన్ ఐపీఎల్లో ఎదురుదాడితో వరుస బౌండరీలు కొట్టగల సామర్థ్యం ఉండి కూడా, సంప్రదాయ ఇన్నింగ్స్లతో రాహుల్ మెప్పిస్తున్నాడు. అందుకు కారణం, ప్రపంచకప్ సెలక్షన్లో నం.4కు తనను పరిగణనలోకి తీసుకోవాలని రాహుల్ పరోక్ష సంకేతంగా భావించాలి!. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో మెరిసిన రాహుల్.. ఇప్పుడు ఐపీఎల్లోనూ మెరుస్తున్నాడు. అయితే రాహుల్ను నం.4 బ్యాట్స్మన్గా కాకుండా, మూడో ఓపెనర్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నం.4లో రాహుల్ ఆడిన నాలుగు మ్యాచుల్లో విఫలమయ్యాడు. 26 పరుగులే చేసి, నిరాశపరిచాడు. ఆల్రౌండర్ విజరు శంకర్ సైతం నం.4 రేసులో ఉన్నాడని చెబుతున్నా, అతడిని రెండో ఆల్రౌండర్ కోటాలో ఎంపిక చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. రవీంద్ర జడేజాను కాదని సెలక్టర్లు శంకర్ను తీసుకునేందుకు ఆస్కారం ఎక్కువ.
పేస్ విభాగంలో లెఫ్టార్మ్ సీమర్ లేకుండానే ప్రపంచకప్ జట్టు ఉండనున్నది. లెఫ్టార్మ్ సీమర్లు ఎవ్వరూ వరల్డ్కప్ స్థాయి ప్రదర్శన చేయలేదు. బుమ్రా, భువనేశ్వర్, మహ్మద్ షమిలకు తోడు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్లు బౌలింగ్ విభాగంలో ఉండనున్నారు. బ్యాటింగ్ లైనప్లో విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేదార్ జాదవ్, ఎం.ఎస్ ధోని ఖాయం కాగా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, విజరు శంకర్లు సైతం చోటు లాంఛనం చేసుకున్నారు!.
పేస్ విభాగంలో ముగ్గురు పేసర్లకు మరో ముగ్గురిని రిజర్వ్ పేసర్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా గాయపడినా, ఎటువంటి సమయం నష్టపోకుండా రిజర్వ్ పేసర్లను నేరుగా జట్టులోకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రిజర్వ్ పేసర్లు ప్రపంచకప్ జట్టుతో పాటే లండన్ వెళ్లనున్నారని బీసీసీఐ వర్గాల సమాచారం!.
పృథ్వీ అవకాశమెంత?
నం.4 రేసులో ఉన్న వారే కాకుండా, అరంగేట్రం సైతం చేయని పృథ్వీ షా సైతం కనిపిస్తున్నాడు. 19 ఏండ్ల పృథ్వీ షా టెస్టుల్లో అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. గతంలో భారత్-ఏ జట్టు తరఫున ఇంగ్లాండ్లో గొప్పగా రాణించాడు. అన్నింటికి మించి, నం.4లో ఆడగల పరిణితి అతడి సొంతం. సంప్రదాయ క్రికెటింగ్ షాట్లతో విరుచుకుపడే పృథ్వీ షా అనుభవం తక్కువే కానీ, అతడు అంతర్జాతీయ క్రికెట్లో భయం లేని ఆటను అలవాటు చేసుకున్నాడు. ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అపారమైన ప్రతిభ, తిరుగులేని టెక్నిక్కు తోడు భిన్న షాట్ల మేళవింపుతో కూడిన బ్యాటింగ్ శైలి పృథ్వీ షాను నేరుగా ప్రపంచకప్ను ఎంపిక చేస్తే ఆశ్చర్యం ఏమీ లేదు!.