Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరాట్కు బలమైన సేన
- కార్తీక్, రాహుల్లకు చోటు
- రాయుడు, రిషబ్లకు మొండిచేయి
- 2019 ప్రపంచకప్ జట్టు ప్రకటన
భారత క్రికెట్ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ కోహ్లి సారథ్యంలో అనితర సాధ్య విజయాలెన్నో సాధించింది. టెస్టు చాంపియన్షిప్ గదను మూడేండ్లుగా తన వద్దే ఉంచేసుకుని, ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది.
టీ20 ఫార్మాట్ విజయాలతో ఓ సారథిని, ఓ జట్టును కొలవలేం!. కానీ వన్డే విజయాలు ఎల్లప్పుడూ జట్టు బలాన్ని చాటుతుంది. 50 ఓవర్ల ఆటలో నిలకడగా రాణిస్తోన్న టీమ్ ఇండియా మహా యజ్ఞానికి సిద్ధమైంది. వన్డేల్లో విశ్వ విజేతగా నిలవాలని రంగం సిద్ధం చేసుకున్నది.
సేనాని యోధుడు అయినంత మాత్రాన, విజయం సిద్ధించదు. సేన కూడా పోరాట పటిమలో రాటుదేలాలి. వరల్డ్కప్ వేటకు బయల్దేరుతున్న భారత్కు బలమైన నాయకుడు విరాట్ కోహ్లి నాయకత్వం వహిస్తున్నాడు. సవాళ్లతో కూడిన వరల్డ్కప్ వేటలో కోహ్లికి బలమైన సైన్యమే లభించింది!.
ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పరుగుల మోత మోగించగల బ్యాటింగ్ లైనప్, ఎటువంటి పిచ్ ఎదురైనా వికెట్ల వేటలో దూసుకెళ్లగలిగే బౌలింగ్ బృందానికి తోడు కఠిన పరిస్థితుల్లో జట్టుకు సమతూకం తీసుకురాగల ఆల్రౌండర్లతో కూడిన వేటగాళ్ల దళాన్ని భారత్ సోమవారం ప్రకటించింది. కప్పు నెగ్గటమే ఇక మిగిలింది!.
నవతెలంగాణ-ముంబయి
విషయం ఏమిటి?
ఎప్పుడెప్పుుడా అని ఎదురుచూస్తోన్న 2019 వన్డే ప్రపంచకప్కు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. దిగ్గజాల వీడ్కోలు తర్వాత టాప్ ఆర్డర్లో, లోయర్ ఆర్డర్లో సహా బౌలింగ్ విభాగంలో భారత్ నాణ్యమైన వారసులను ఎంచుకున్నది. కానీ మిడిల్ ఆర్డర్లోనే కొన్ని సమస్యలు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడే బృందాన్నే ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లి హాజరయ్యాడు.
టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే
ప్రపంచకప్ బృందంలో భారత్ బలమైన ఆయుధం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే. కెప్టెన్ విరాట్ కోహ్లితో కూడిన టాప్ ఆర్డర్ గత రెండేండ్లలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భారత్కు సింహభాగం పరుగులు సాధించగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్. ధావన్-రోహిత్, ధావన్-కోహ్లి, రోహిత్-కోహ్లి జోడీలు రెండేండ్లుగా మ్యాజిక్ చేస్తున్నాయి. టాప్-3లో ఏ ఇద్దరి భాగస్వామ్యం కుదిరినా ఛేదనలోనైనా, లక్ష్యాన్ని నిర్దేశించటంలోనైనా భారత్కు ఎదురుండదు.
మిడిల్ సంగతీ ఏటీ
2015 ప్రపంచకప్ ఆడిన మిడిల్ ఆర్డర్లో ఇప్పుడు దిగ్గజ బ్యాట్స్మన్ మహేంద్రసింగ్ ధోని ఒక్కడే ఉన్నాడు. అలాగని, మిడిల్ ఆర్డర్లో మిగతా వారికి అనుభవం లేదని కాదు. కేదార్ జాదవ్, విజరు శంకర్లు తమను తాము నిరూపించుకున్న ఆటగాళ్లు. కొత్త రక్తం ఎప్పుడూ నూతన జవసత్వాలను ఇస్తుంది. ప్రపంచకప్లో భారత్కు ఇది ఉపయోగపడనున్నది. టాప్ ఆర్డర్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించటంలో ధోని దిట్ట. ముగింపులో ఒత్తిడికి లోనవకుండా పని పూర్తి చేయటంలో జాదవ్ మ్యాజిక్ మార్క్ చూపిస్తూనే ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో కీలక నం.4 స్థానం కోసం రిషబ్ పంత్, అంబటి రాయుడు పోటీలో నిలిచినా.. విజరు శంకర్ చాన్స్ కొట్టేశాడు. బలమైన షాట్లతో విరుచుకుపడటమే కాదు బాధ్యతాయుత ఇన్నింగ్స్లు నిర్మించటం తెలిసిన విజరు ఇంగ్లాండ్లో ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు!.
పేస్ పస ఉందా
భారత క్రికెట్లో వచ్చిన అత్యద్భుత మార్పు పేస్ విభాగం బలోపేతం కావటం. ప్రపంచ శ్రేణి స్పిన్నర్లను అందించటంలో భారత క్రికెట్ రాటుదేలింది. యార్కర్ల హీరో జశ్ప్రీత్ బుమ్రా, స్వింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమిలతో కూడిన పేస్ విభాగం ప్రపంచకప్ అత్యుత్తమ బృందాల్లో ఒకటి. విదేశీ పిచ్లపై మంచినీళ్ల ప్రాయంలా వికెట్లు కూల్చిన ఈ త్రయం.. ఇప్పుడు వరల్డ్కప్లో భారత్ను అతి పెద్ద బలం కానున్నది. ఇంగ్లీష్ వేసవిలో పచ్చిక పిచ్లు ఎదురైతే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పాటు భారత పేసర్లు సైతం వికెట్ల వేటలో ముందుంటారు. ముగ్గురు సీమర్లకు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, విజరు శంకర్ పార్ట్ టైమ్ పేస్ జత కానుంది.
మాయ చేయగలరా
భారత్ అంటే స్పిన్, స్పిన్ అంటే భారత్. ఆ ముద్ర ఇప్పటికీ పోలేదనే చెప్పాలి. వేలితో బంతిని తిప్పే స్పిన్నర్ల స్థానంలో మణికట్టుతో మాయ చేయగల స్పిన్నర్లు వచ్చారు. అదొక్కటే తేడా. ప్రత్యర్థిని మాయ చేయటంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్లు రెండేండ్లుగా భారత్కు ఎన్నో విజయాలు అందించారు. మిడిల్ ఓవర్లలో కాసిన్ని పరుగులు చేయాలనే ప్రత్యర్థులకు ఆలోచనకు కుల్దీప్, చాహల్ జోడీ చెక్ పెడుతోంది. వరల్డ్కప్లోనూ అదే మ్యాజిక్ ఫార్ములా కొనసాగనుంది. ఇంగ్లీష్ పిచ్లు పొడిబారి కనిపిస్తే, రంగంలోకి దిగేందుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు.
సమతూకం ప్రధానం
కొన్ని మ్యాచులు, సిరీస్లు సాధించేందుకు మంచి జట్టు ఉంటే చాలు. కానీ ప్రపంచకప్ను నెగ్గాలంటే మంచి జట్టుతో పాటు సమతూకం ప్రధానం. నాణ్యమైన ఆల్రౌండర్లతోనే అది సాధ్యం. ప్రపంచకప్కు భారత్ నలుగురు ఆల్రౌండర్లను ఎంపిక చేసింది. పేస్ బౌలింగ్ వేయగల హార్దిక్ పాండ్య, విజరు శంకర్లు బ్యాటింగ్కు అదనంగా బంతిని అందుకోనున్నారు. జడేజా, కేదార్ జాదవ్ మెరుపు షాట్లతో పాటు మాయజాలంతో వికెట్లు కూల్చగలనని నిరూపించుకున్నారు. ఏ కూర్పులైనా భారత తుది జట్టులో కనీసం ముగ్గురు ఆల్రౌండర్లు ఉండనున్నారు. ఇది జట్టుకు సమతూకం తీసుకురావటమే కాదు, ప్రపంచకప్ విజయావకాశాలను గణనీయంగా పెంచుతుంది.
భారత ప్రపంచకప్ సైన్యం
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విజరు శంకర్, ఎం.ఎస్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వెంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జశ్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి.