Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్కప్ స్టాండ్బై ఆటగాళ్లుగా ఎంపిక
ముంబయి : ప్రపంచకప్ ఫేవరెట్లలో ముందున్న టీమ్ ఇండియా వరల్డ్కప్ జట్టు ఎంపిక ఎంత ఉత్కంఠకు గురి చేసిందో, అంతే వివాదానికి దారితీస్తోంది!. నం.4 రేసులో రాయుడు ముందున్నాడని కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించిన రెండు నెలల్లోనే అతడు జట్టులో చోటు కోల్పోయాడు. భవిష్యత్ స్టార్గా ఎదుగుతున్న పంత్ను కాదని, రెండు వరల్డ్కప్ల తర్వాత దినేశ్ కార్తీక్ను ఎంపిక చేశారు. 2007 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన కార్తీక్.. 2011, 2015 ప్రపంచకప్ రేసులో సైతం లేడనే సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ను పక్కనపెట్టడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అంబటి రాయుడుని విస్మరించటంపై గౌతం గంభీర్ విమర్శలు చేశాడు. విమర్శల వేడిని తగ్గించేందుకు బీసీసీఐ బుధవారం ఉపశమన నిర్ణయం తీసుకున్నది. రిషబ్ పంత్, అంబటి రాయుడులను స్టాండ్బై ఆటగాళ్లకు ఎంపిక చేసింది. ప్రపంచకప్లోని 15 మంది బృందంలో ఎవరు గాయపడినా, స్టాండ్ బై ఆటగాళ్లను నేరుగా ప్రపంచకప్కు పంపిస్తారు. బౌలింగ్ బృందానికి స్టాండ్ బైగా నవదీప్ షైని ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
రాయుడిపై చర్యల్లేవ్ : సెలక్షన్ కమిటీ చైర్మన్పై పరోక్షంగా విమర్శలు చేసిన అంబటి రాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. నం.4 స్థానానికి విజరు శంకర్ను ఎంపిక చేయడానికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ (త్రీ డైమెన్సనల్ ప్లేయర్) అని ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనికి అంబటి రాయుడు కౌంటర్ వేస్తూ..' ప్రపంచకప్ చూసేందుకు ఇప్పుడే 3డీ అద్దాలు కొనుగోలు చేశాను' అని పంచ్ విసిరాడు. ఇది నేరుగా విమర్శించటం కాకపోయినా, ప్రసాద్ వ్యాఖ్యలపై కౌంటర్ వేసినట్టు స్పష్టమవుతోంది. రాయుడు ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లైక్లు, రీ ట్వీట్ల సంఖ్య లక్షకు చేరువైంది. ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాని సమయంలో ఆటగాళ్లలో నెలకొనే భావోద్వేగాలు అర్ధం చేసుకోగలం. గీత దాటనంత వరకూ ఎటువంటి చర్యలు తీసుకోమని బోర్డు అధికారి అన్నాడు.