Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత క్రికెట్ బోర్డు ఆలోచన
ముంబయి : 2019 ప్రపంచకప్పై అన్ని జట్లు దృష్టి సారించగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత ముందుచూపుతో వ్యవహరిస్తోంది!. వరల్డ్కప్ వార్ ముగిసిన వెంటనే ఆరంభమయ్యే ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ కోసం ఐదు రోజుల ఆట స్పెషలిస్ట్లను సిద్ధం చేసే పనిలో పడింది. జులై-ఆగస్టులో ఆరంభం కానున్న టెస్టు చాంపియన్షిప్స్లో భారత్ తొలుత వెస్టిండీస్తో తలపడాల్సి ఉంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ పిచ్లపై ఎర్ర డ్యూక్ బంతులు వాడుతారు. విండీస్ పిచ్లపై మెరుగైన సన్నద్ధత కోసం భారత టెస్టు స్పెషలిస్ట్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ సహా రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మలను కౌంటీ క్రికెట్ ఆడించేందుకు రంగం సిద్ధం చేసింది. పుజారా ఇప్పటికే యార్క్షైర్తో మూడేండ్ల ఒప్పందం కల్గి ఉండగా, రహానె త్వరలోనే హాంప్షైర్తో ఒప్పందం కుదుర్చుకోనున్నాడు. టెస్టు ఆటగాళ్లకు మ్యాచ్ సన్నద్ధత కోసం నిరుడు ఇంగ్లాండ్ పర్యటన సందర్భంలోనే కౌంటీ క్రికెట్ క్లబ్ సీఈవోలతో పాలకుల కమిటీ భేటి అయినట్టు సమాచారం. భారత టెస్టు ఆటగాళ్లతో కౌంటీలో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకునేలా సీఓఏ సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు సమ్మతి తెలుపగా.. సభ్యులు ఎదుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ రవిలు అంగీకారం తెలపాల్సి ఉంది. విండీస్ టూర్కు ముందు టెస్టు స్పెషలిస్ట్లకు కనీసం 3-4 ఫస్ట్ క్లాస్ మ్యాచుల ప్రాక్టీస్ ఉండేలా బీసీసీఐ జాగ్రత్తలు వహిస్తోంది.