Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటగాళ్ల సంఘం రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
ముంబయి : అతి త్వరలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధాన నిర్ణయాల్లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధులు భాగస్వాములు కాబోతున్నారు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఆటగాళ్ల అసోసియేషన్ నుంచి ఇద్దరు ప్రతినిధులు (ఒక మహిళా ప్రతినిధి తప్పనిసరి) బీసీసీఐ అత్యున్నత నిర్ణయాక మండలి అపెక్స్ కౌన్సిల్కు ప్రాతినిథ్యం వహిస్తారు. ' అవును, భారత క్రికెటర్ల సంఘం (ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్) పేరుతో రిజిస్ట్రేషన్ పత్రాలు సిద్ధం చేశాం. ఆ పేరుతో ఇంతకుముందు ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగిందా? లేదా చూడాలి. ఏ పేరుతోనైనా సరే సంఘం రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే, ఆటగాళ్ల సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులను అపెక్స్ కౌన్సిల్కు నామినేట్ చేసుకోవచ్చు' అని పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు వెల్లడించారు. బీసీసీఐ మాదిరిగానే ఆటగాళ్ల సంఘం పని చేస్తుంది. రాష్ట్రాల్లోనూ అనుబంధ సంఘాలు ఏర్పాటు అవుతాయి. రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ప్రతినిధులను రాష్ట్ర కమిటీలు నిర్ణయిస్తాయి. ' ఆటగాళ్ల సంఘం స్వతంత్య్ర సంస్థ. నిధులు వారే స్వయంగా సమకూర్చుకోవాలి. ఆరంభంలో బీసీసీఐ నుంచి కొంత సాయం అందుతుంది. తర్వాత సంఘమే స్వయంగా ఆర్థిక వనరులు సృష్టించుకోవాలి' అని రారు తెలిపారు.