Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రైల్బ్లేజర్స్పై భారీ విజయం
- మెరిసిన వ్యాట్, సఫాలీ వర్మ
- ఐపీఎల్ మహిళల టీ20 చాలెంజ్
జైపూర్ : సూపర్నోవాస్పై సూపర్ విక్టరీ సాధించిన ట్రైల్ బ్లేజర్స్.. వెలాసిటి దూకుడు తట్టుకోలేదు. అన్ని విభాగాల్లో ట్రైల్ బ్లేజర్స్ను చిత్తు చేసిన మిథాలీరాజ్ సారథ్యంలోని వెలాసిటీ మహిళల టీ20 చాలెంజ్ను విజయంతో మొదలెట్టింది. స్మృతి మంధాన జట్టు నిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన వెలాసిటి.. నెట్రన్రేట్ అండతో తర్వాతి మ్యాచ్లో ఓడినా ఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నది!. మహిళల టీ20 చాలెంజ్లో చివరి లీగ్ మ్యాచ్లో వెలాసిటి, సూపర్నోవాస్ నేడు తలపడనున్నాయి. వెలాలిసీ బ్యాటర్ డానిలీ వ్యాట్ (ఇంగ్లాండ్) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నది.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ట్రైల్ బ్లేజర్స్కు మరోసారి భారీ స్కోరు సాధించేలా కనిపించింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (26, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతీ మంధాన (10, 10 బంతుల్లో 2 ఫోర్లు) బౌండరీలతో పరుగుల ఖాతా తెరిచారు. శిఖా పాండే సంధించిన సీమ్ సవాల్ను వరుస బౌండరీలతో మంధాన బదులివ్వగా.. తర్వాతి ఓవర్లో మంధానను వికెట్ల వెనకాల అవుట్ చేసిన శిఖా పైచేయి సాధించింది. మంధాన నిష్క్రమణ తర్వాత హర్లీ డియోల్ (43, 40 బంతుల్లో 5 ఫోర్లు) రాణించింది. బేట్స్తో కలిసి 35 పరుగులు జోడించింది. కానీ తర్వాతి వరుస బ్యాటర్లు తేలిపోయారు. సారా టేలర్ (5), దీప్తి శర్మ (16), ఫల్మలి (2), హేమలత (1), సెల్మన్ (8) టీ20 తరహా బ్యాటింగ్ చేయలేదు. దీంతో నిర్ణీత ఓవర్లలో ట్రైల్ బ్లేజర్స్ 112/6 పరుగులే చేసింది.
ఛేదనలో వెలాసిటికి ఎదురులేకుండా పోయింది. ఓపెనర్ హాలె మాథ్యూస్ (5) నిరాశపరిచినా.. సఫాలీ వర్మ (34, 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డానిలీ వ్యాట్ (46, 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) రెచ్చిపోయారు. వ్యాట్, వర్మ జోరుతో వెలాసిటి ఛేదనలో ఎక్కడా ఇబ్బంది పడలేదు. కానీ విజయానికి మరో రెండు పరుగుల దూరంలో ఉండగా.. సున్నా పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా 18 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (17, 22 బంతుల్లో 1 ఫోర్) రాణించింది. మిథాలీరాజ్, శిఖా పాండే (0), ఖేర్ (0) సహా ఓపెనర్ హాలెలను దీప్తి శర్మ వెనక్కి పంపించింది.