Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్12లో సన్ కథ ముగిసింది
- క్వాలిఫయర్2కు ఢిల్లీ క్యాపిటల్స్
- సన్రైజర్స్పై ఢిల్లీ అదిరే విజయం
- పృథ్వీ షా, రిషబ్ పంత్ సూపర్ షో
నవతెలంగాణ-విశాఖపట్నం:ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫయర్2కు చేరుకున్నది. ఉత్కంఠ మ్యాచ్లో ఒత్తిడికి చిత్తయిన సన్రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో ఓటమితో ఐపీఎల్12 నుంచి నిష్క్రమించింది. 163 పరుగుల ఛేదనలో పృథ్వీ షా (56, 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. డెత్ ఓవర్లలో సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరిగినా రిషబ్ పంత్ (49, 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) ధనాధన్ విధ్వంసంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. పంత్ నిష్క్రమణతో ఆఖర్లో హైడ్రామా నెలకొన్నా.. కీమో పాల్ (5 నాటౌట్) తెగువతో మరో బంతి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 162 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (36, 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించాడు. విజరు శంకర్ (25, 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), మహ్మద్ నబి (20, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
పృథ్వీ మెరుపులు : క్లిష్టమైన ఛేదనలో ఢిల్లీకి మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (17), పృథ్వీ షా (56) తొలి వికెట్కు 66 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువనేశ్వర్పై కవర్స్ దిశగా, ఫైన్ లెగ్ దిశగా ధావన్ బౌండరీలు బాది ధనాధన్ ఆరంభం అందించాడు. ఖలీల్ వేసిన ఓవర్లో పృథ్వీ షా సత్తా చాటాడు. మిడ్ఆన్, కవర్ పాయింట్, స్క్వేర్ దిశగా మూడు ఫోర్లు బాదాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో భువనేశ్వర్పైనా పృథ్వీ పంజా విసిరాడు. ఓపెనర్ల ధనాధన్తో పవర్ ప్లేలో ఢిల్లీ దూసుకెళ్లింది. హుడా బంతి కోసం క్రీజు వదిలి ధావన్ వికెట్ కోల్పోగా... 31 బంతుల్లో అర్ద సెంచరీ సాధించిన పృథ్వీ షా నియంత్రణ కోల్పోయాడు. ఖలీల్ అహ్మద్ ఓకే ఓవర్లో శ్రేయాష్ అయ్యర్ (8), పృథ్వీ షాలను వెనక్కి పంపించాడు. రషీద్ ఖాన్ తన చివరి ఓవర్లో కొలిన్ మన్రో (14), అక్షర్ పటేల్ (0) వికెట్లతో ఢిల్లీపై ఒత్తిడి పెంచాడు.
పంత్ ధనాధన్ : 24 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో ఢిల్లీపై ఒత్తిడి నెలకొన్నది. భువనేశ్వర్ కుమార్ 17వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చాడు. సమీకరణం 18 బంతుల్లో 34 పరుగులకు మారింది. బసిల్ తంపీ వేసిన ఓవర్లో ఊచకోత కోసిన రిషబ్ పంత్ వరుసగా 4, 6, 4, 6 బాదాడు. ఆ ఓవర్లో పంత్ 22 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. భువనేశ్వర్ 19వ ఓవర్లో రూధర్ఫోర్డ్ (9)ను సాగనంపినా.. పంత్ మరో భారీ సిక్సర్ సంధించి మ్యాచ్ను ఢిల్లీ పక్షం చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి పంత్ను అవుట్ చేసిన భువి.. ఉత్కంఠ రేపాడు. చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హైడ్రామా నెలకొన్నది. ఫీల్డింగ్లో అడ్డుపడినందున మిశ్రా (1)ను అవుట్గా ఇచ్చారు. ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ బాదిన కీమో పాల్ (5 నాటౌట్) ఉత్కంఠకు తెరదించాడు.
ఆరంభం అదిరినా.. : టాస్ నెగ్గిన ఢిల్లీ ఛేదనకు మొగ్గుచూపింది. స్పిన్ ఫ్రెండ్లీ విశాఖ పిచ్పై సన్రైజర్స్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (36, 19 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) పవర్ప్లేలో పవర్ఫుల్ షాట్లతో విజృంభించాడు. పేసర్లపై విరుచుకుపడ్డ గప్టిల్ నాలుగు సిక్సర్లు బాదాడు. మరో ఓపెనర్ సాహా (8) విఫలమైనా.. పవర్ప్లేలో హైదరాబాద్ 54/1తో మెరుగైన స్కోరు సాధించింది. కానీ స్పిన్నర్లను బరిలోకి దించిన ఢిల్లీ... మిడిల్ ఓవర్లలో హైదరాబాద్ను కట్టడి చేసింది. పవర్ ప్లే తర్వాతి 9 ఓవర్లలో హైదరాబాద్ 50 పరుగులే చేసింది. మనీశ్ పాండే 36 బంతుల్లో 30 పరుగులు చేయగా, కెప్టెన్ విలియమ్సన్ 27 బంతుల్లో 28 పరుగులు చేశాడు. విలియమ్సన్, మనీశ్ నెమ్మదైన భాగస్వామ్యం హైదరాబాద్ భారీ స్కోరు ఆశలను ఆవిరి చేసింది. ఆఖరి ఓవర్లలో మహ్మద నబి (20, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), విజరు శంకర్ (25, 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్తో మెరిశారు. చివరి రెండు ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ లయ కోల్పోయింది. 161 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్ (3/32), ఇషాంత్ శర్మ (2/34) రాణించారు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (1/16) పొదుపుగా బంతులేసి బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచాడు.
స్కోరు వివరాలు :
సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : వృద్దిమాన్ సాహా (సి) అయ్యర్ (బి) ఇషాంత్ 8, మార్టిన్ గప్టిల్ (సి) కీమో పాల్ (బి) మిశ్రా 36, మనీశ్ పాండే (సి) రూథర్ఫోర్డ్ (బి) కీమో పాల్ 30, కానె విలియమ్సన్ (బి) ఇషాంత్ 28, విజరు శంకర్ (సి) అక్షర్ పటేల్ (బి) బౌల్ట్ 25, మహ్మద్ నబి (సి) అక్షర్ పటేల్ (బి) కీమో పాల్ 20, దీపక్ హుడా రనౌట్ 4, రషీద్ ఖాన్ (సి) పంత్ (బి) కీమో పాల్ 0, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 0, బసిల్ తంపీ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162.
వికెట్ల పతనం : 1-31, 2-56, 3-90, 4-111, 5-147, 6-160, 7-161, 8-161.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 3-0-37-1, ఇషాంత్ శర్మ 4-0-34-2, అక్షర్ పటేల్ 4-0-30-0, అమిత్ మిశ్రా 4-0-16-1, కీమో పాల్ 4-0-32-3, రూథర్ఫోర్డ్ 1-0-11-0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి) విజరు (బి) ఖలీల్ అహ్మద్ 56, శిఖర్ ధావన్ (స్టంప్డ్) సాహా (బి) దీపక్ హుడా 17, శ్రేయాష్ అయ్యర్ (సి) సాహా (బి) ఖలీల్ అహ్మద్ 8, రిషబ్ పంత్ (సి) నబి (బి) భువనేశ్వర్ 49 , కొలిన్ మన్రో (ఎల్బీ) రషీద్ ఖాన్ 14, అక్షర్ పటేల్ (సి) సాహా (బి) రషీద్ ఖాన్ 0, రూథర్ఫోర్డ్ (సి) నబి (బి) భువనేశ్వర్ 9, కీమో పాల్ నాటౌట్ 5, అమిత్ మిశ్రా (ఓబిఎస్) 1, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 165.
వికెట్ల పతనం : 1-66, 2-84, 3-87, 4-111, 5-111, 6-151, 7-158, 8-161.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-42-2, మహ్మద్ నబి 4-0-29-0, ఖలీల్ అహ్మద్ 2.5-0-24-2, రషీద్ ఖాన్ 4-1-15-2, బసిల్ తంపీ 4-0-41-0, దీపక్ హుడా 1-0-13-1.