Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో వెలాసిటీ వ్యూహంపై ఆసక్తికర చర్చ
జైపూర్ : సూపర్నోవాస్తో లీగ్ మ్యాచ్లో వెలాసిటీ లక్ష్యం 143 పరుగులు. స్టార్ బ్యాటర్ డానిలీ వ్యాట్ (43) మెరుపులతో ఇన్నింగ్స్ తొలి 69 బంతుల్లోనే వెలాసిటీ 77/3 పరుగులతో జోరుమీదున్నది. విజయానికి 51 బంతుల్లో మరో 66 పరుగులు చేయాల్సిన దశలో వెలాసిటీ ఎంచుకున్న వ్యూహం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఆ సమయంలో క్రీజులో నిలిచిన కెప్టెన్ మిథాలీ రాజ్ (40 నాటౌట్, 42 బంతుల్లో 3 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (30 నాటౌట్, 29 బంతుల్లో 3 ఫోర్లు) ఫైనల్లోకి చేరేందుకు చేయాల్సిన పరుగులపైనే దృష్టి సారించారు. వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్ అప్పటికే ఒక్కో విజయం సాధించాయి. ఈ మ్యాచ్లో వెలాసిటీ నెగ్గితే ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీలు నేరుగా ఫైనల్లోకి చేరుకుంటాయి. రెండు ఓటములతో సూపర్ నోవాస్ నిష్క్రమిస్తుంది. కానీ మెరుగైన నెట్ రన్రేట్తో ఫైనల్లోకి చేరే దారిని మిథాలీ ఎంచుకున్నది. ఛేదనలో చివరి 51 బంతుల్లో 53 పరుగులు చేసిన వెలాసిటీ 130/3తో నిలిచింది. నెట్ రన్రేట్ మార్క్ 117 పరుగులకు చేరుకునే సమయానికి గెలుపు సమీకరణం ఐదు బంతుల్లో 25 పరుగులకు మారింది. ఆ దశలో సూపర్నోవాస్ అలవోక విజయం సాధించింది. ఇద్దరు కీలక బ్యాటర్లు క్రీజులో నిలిచినా, ఛేదన దిశగా సాగకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఐసీసీ అధికారిక టీ20 మ్యాచ్ గుర్తింపుతో జరుగుతున్న మహిళల ఐపీఎల్ టీ20 చాలెంజ్.. మహిళల ఐపీఎల్కు ముందు సన్నాహకం. ఉచితంగా ప్రవేశం కల్పించినా, జైపూర్ సవారు మాన్సింగ్ స్టేడియంలో ఒకట్రెండు స్లాండ్లు మినహా స్టేడియం ఖాళీగా దర్శనమిస్తోంది. ఇలాంటి పేలవ ప్రదర్శనలతో మహిళల ఐపీఎల్కు మరింత సమయం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. అంతిమంగా ఇది అమ్మాయిల క్రికెట్పై ప్రతికూల ప్రభావం చూపేందుకు ఆస్కారం ఎక్కువ. ఐపీఎల్ మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్లో నేడు వెలాసిటీ, సూపర్నోవాస్ తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు స్టార్స్పోర్ట్స్లో ప్రసారం అవుతుంది.