Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుభాంకర్, సాత్విక్ జోడీ ఓటమి
- డెన్మార్క్ ఇంటర్నేషనల్ టోర్నీ
న్యూఢిల్లీ : డెన్మార్క్ ఇంటర్నేషనల్ చాలెంజ్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల పోరాటానికి తెరపడింది. శనివారం అర్థరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సెమీఫైనల్స్లో భారత షట్లర్లు పరాజయం పాలయ్యారు. మెన్స్ సింగిల్స్లో ఐదో సీడ్ సుభాంకర్ దే మూడు గేముల మ్యాచ్లో ఓటమిపాలయ్యాడు. రెండో సీడ్ హాన్స్ క్రిస్టీ చేతిలో 21-17, 13-21, 10-21తో నిరాశపరిచాడు. తొలి గేమ్లో సులువుగా నెగ్గిన సుభాంకర్, తర్వాతి రెండు గేముల్లోనూ తేలిపోయాడు. మెన్స్ డబుల్స్లో సాత్విక్ సాయి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 22-24, 20-22తో పోరాడి ఓడింది. సాత్విక్-చిరాగ్ జంట అద్బుతంగా ఆడింది. మ్యాచ్లో కీలక సందర్బాల్లో ఆధిపత్యం చెలాయించింది. కానీ గేమ్ ముగించటంలో విఫలమైంది. కీలక రెండో గేమ్లో 20-19తో గెలుపు ముంగిట నిలిచినా, మ్యాచ్ పాయింట్ సాధించలేదు. తొలి గేమ్లోనూ టైబ్రేకర్లో భంగపడ్డారు. గత వారం బ్రెజిల్ ఇంటర్నేషనల్ చాలెంజన్ విజేతగా నిలిచిన సాత్విక్, చిరాగ్లు డెన్మార్క్లో నిరాశపరిచారు. సాత్విక్ సాయిరెడ్డి గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. రానున్న టోర్నీల్లో ఈ జోడీ మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు.