Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షేన్ వాట్సన్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా
- ముంబయి గూటికి ఐపీఎల్ నాల్గో టైటిల్
- ఫైనల్లో చెన్నైకి తప్పని ఓటమి
ముంబయి ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ ట్రోఫీ ఎత్తింది. చెన్నై సూపర్ కింగ్స్పై వరుసగా నాల్గో విజయం నమోదు చేసి, ఐపీఎల్లో నాల్గో టైటిల్ అందుకున్నది. 150 పరుగుల ఛేదనలో ఓపెనర్ షేన్ వాట్సన్ వీరోచిత ఇన్నింగ్స్తో చెలరేగినా.. ఆఖరు బంతి హైడ్రామాలో విజయం ముంబయినే వరించింది. ధోని, రాయుడు, బ్రావో విఫలమయ్యారు. ముంబయి 149/8 పరుగులు చేయగా, ఛేదనలో చెన్నై 148/7 వద్ద ఆగిపోయింది. ఒక్క పరుగు తేడాతో ముంబయి ఐపీఎల్12 విజేతగా అవతరించింది
నవతెలంగాణ-హైదరాబాద్
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు మరోసారి టైటిల్ పోరులో చుక్కెదురు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా, చెన్నై ఏడు పరుగులే చేసింది. ఆఖరి బంతికి ఒక్క పరుగు తీసినా.. సూపర్ ఓవర్కు దారితీసే అవకాశం ఉంది. కానీ లసిత్ మలింగ బంతికి షార్దుల్ ఠాకూర్ (2) ఎల్బీగా అవుటయ్యాడు. దీంతో ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగుతో ఐపీఎల్ 12 టైటిల్ ఎగరేసుకుపోయింది. ఛేదనలో ఓపెనర్ షేన్ వాట్సన్ (80, 59 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ వృథా అయ్యింది. వాట్సన్కు తోడు డుప్లెసిస్ (26, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా.. ధోని (2), రాయుడు (1), రైనా (8) విఫలమయ్యారు. అంతకముందు కీరన్ పొలార్డ్ (41 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డికాక్ (29, 17 బంతుల్లో 4 సిక్స్లు) మెరవటంతో ముంబయి ఇండియన్స్ 149/8 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు దీపక్ చాహర్ (3/26), షార్దుల్ ఠాకూర్ (2/37), ఇమ్రాన్ తాహీర్ (2/23) రాణించారు.
వాట్సన్ వీరోచితం వృథా : సూపర్ కింగ్స్ ఛేదన దూకుడుగా మొదలైంది. ఓపెనర్ డుప్లెసిస్ (26, 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడి చేశాడు. కృనాల్ పాండ్య ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన డుప్లెసిస్..నియంత్రణ కోల్పోయాడు. క్రీజు వదిలి అదే ఓవర్లో స్టంపౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ షేన్ వాట్సన్ జోరు నెమ్మదిగా మొదలైనా, ముంబయిని ముంచెత్తింది. మలింగ ఓవర్లో వాట్సన్ వరుస బౌండరీలతో చెలరేగాడు. బ్యాక్వర్డ్ స్క్వేర్, బ్యాక్వర్డ్ పాయింట్లో ఫోర్లు సహా స్టాండ్స్లోకి ఓ సిక్సర్ సంధించాడు. దీంతో పవర్ ప్లేలో చెన్నై 53 పరుగులు చేసింది. మూడో స్థానంలో వచ్చిన సురేశ్ రైనా (14 బంతుల్లో 8 పరుగులు) మెప్పించలేదు. అసౌకర్యంగా కనిపించిన రైనాను చాహర్ ఎల్బీ చేయగా, తర్వాతి ఓవర్లోనే అంబటి రాయుడు (1) బుమ్రాకు వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ ఎం.ఎస్ ధోని (2) రనౌట్తో చెన్నై ఒత్తిడిలో పడింది. రైనా, రాయుడు, ధోని వికెట్లను చెన్నై స్వల్ప విరామంలో కోల్పోయింది. 14 ఓవర్లలో చెన్నై 85/4తో నిలిచింది. 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన దశల వాట్సన్, బ్రావో క్రీజులో నిలిచారు.
మలింగ ఓవర్లో వాట్సన్ చెలరేగాడు. తొలుత బ్రావో సిక్సర్ కొట్టగా.. వాట్సన్ హ్యాట్రిక్ ఫోర్లతో జోరు కొనసాగించాడు. ఆ ఓవర్లో చెనై 20 పరుగులు సాధించింది. కానీ తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇచ్చాడు. వాట్సన్ ఇచ్చిన క్యాచ్ను చాహర్ వదిలేయటంతో.. రెండోసారి జీవనదానం లభించింది. కృనాల్ పాండ్య వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వాట్సన్ విశ్వరూపం చూపించాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారింది. 19వ ఓవర్లో బుమ్రా 9 పరుగులు ఇవ్వగా.. చివరి ఓవర్లో మరో 9 పరుగులు అవసరమయ్యాయి. నాల్గో బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో వాట్సన్ రనౌట్.. మ్యాచ్ను మలుపు తిప్పింది. షార్దుల్ ఠాకూర్ (2) రెండు పరుగులు చేసినా.. లసిత్ మలింగ చివరి బంతికి ఎల్బీ అవుటయ్యాడు. దీంతో ముంబయి 1 పరుగు తేడాతో గెలుపొందింది.
పోరాడిన పొలార్డ్! : టాస్ నెగ్గిన ముంబయి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (29, 17 బంతుల్లో 4 సిక్స్లు), రోహిత్ శర్మ (15, 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్ ఆరంభాన్ని అందించారు. దీపక్ చాహర్ ఓవర్లో స్టాండ్స్లోకి, బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా, డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా డికాక్ మూడు సిక్సర్లు కొట్టాడు. ఆ ఓవర్లో 20 పరుగులు పిండుకున్న డికాక్.. ముంబయికి పవర్ప్లేలో పవర్ఫుల్ స్కోరు అందించాడు. అలవోకగా బౌండరీలు సాధిస్తున్న ఓపెనర్లు.. ముంబయి భారీ స్కోరుకు రంగం సిద్ధం చేసినట్టే అనిపించింది. కానీ సీమర్ షార్దుల్ ఠాకూర్ (2/37) మ్యాచ్ గమనాన్ని మార్చాడు. జోరుమీదున్న డికాక్ను వికెట్ల వెనకాల అవుట్ చేసిన ఠాకూర్.. చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో దీపక్ చాహర్ మెయిడిన్ ఓవర్ వికెట్తో రోహిత్ శర్మనూ అదే రీతిలో సాగనంపాడు. ఓపెనర్ల నిష్క్రమణతో ముంబయి జోరు తగ్గింది. తర్వాతి ఓవర్లలో ఆ జట్టు దూకుడుగా పరుగులు చేయలేదు. క్వాలిఫయర్1లో మెరిసిన సూర్యకుమార్ యాదవ్ (15), ఇషాన్ కిషన్ (23, 26 బంతుల్లో 3 ఫోర్లు) మూడో వికెట్కు 37 పరుగులు జోడించారు. ఈ జోడీ ప్రమాదకరం కాకముందే, తాహీర్ వెనక్కి పంపించాడు. కృనాల్ పాండ్య (7)ను ఠాకూర్ రిటర్న్ క్యాచ్తో సాగనంపాడు. 101/4తో ముంబయి కష్టాల్లో పడింది. చివరి ఐదు ఓవర్లు మిగిలి ఉండగా ధనాధన్ హీరోలు హార్దిక్ పాండ్య (16, 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), కీరన్ పొలార్డ్ (41 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) క్రీజులో నిలిచారు. దీంతో ముంబయి అలవోకగా 170 పరుగులు సాధిస్తుందని అనిపించింది. పాండ్య ఇచ్చిన అలవోక క్యాచ్ను రైనా వదిలేయగా.. ఆ వెంటనే హార్దిక్ వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. కానీ హార్దిక్ను ఎల్బీగా అవుట్ చేసిన చాహర్.. ముంబయి భారీ స్కోరు ఆశలకు గండి కొట్టాడు. మరో ఎండ్లో పొలార్డ్ మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో కదం తొక్కినా.. ముంబయి 149 పరుగులే చేయగల్గింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టగా.. షార్దుల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్లు చెరో రెండు వికెట్లు కూల్చారు.
స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : క్వింటన్ డికాక్ (సి) ధోని (బి) ఠాకూర్ 29, రోహిత్ శర్మ (సి) ధోని (బి) చాహర్ 15, సూర్యకుమార్ యాదవ్ (బి) తాహీర్ 15, ఇషాన్ కిషన్ (సి) రైనా (బి) తాహీర్ 23, కృనాల్ పాండ్య (సి,బి) ఠాకూర్ 7, కీరన్ పొలార్డ్ నాటౌట్ 41, హార్దిక్ పాండ్య (ఎల్బీ) చాహర్ 16, రాహుల్ చాహర్ (సి) డుప్లెసిస్ (బి) చాహర్ 0, మెక్లనగెన్ రనౌట్ 0, బుమ్రా నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 03, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149.
వికెట్ల పతనం : 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-1-26-3, షార్దుల్ ఠాకూర్ 4-0-37-2, హర్బజన్ సింగ్ 4-0-27-0, డ్వేన్ బ్రావో 3-0-24-0, ఇమ్రాన్ తాహీర్ 3-0-23-2, రవీంద్ర జడేజా 2-0-12-0.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ : డుప్లెసిస్ (స్టంప్డ్) డికాక్ (బి) కృనాల్ పాండ్య 26, షేన్ వాట్సన్ రనౌట్ 80, సురేశ్ రైనా (ఎల్బీ) చాహర్ 8, అంబటి రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 1, ఎం.ఎస్ ధోని (రనౌట్) 2 , డ్వేన్ బ్రావో (సి) డికాక్ (బి) బుమ్రా 15, రవీంద్ర జడేజా నాటౌట్ 5, షార్దుల్ ఠాకూర్ (ఎల్బీ) మలింగ 2, ఎక్స్ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 148.
వికెట్ల పతనం : 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148.
బౌలింగ్ : మిచెల్ మెక్లనగెన్ 4-0-24-0, కృనాల్ పాండ్య 3-0-39-1, లసిత్ మలింగ 4-0-49-1, జశ్ప్రీత్ బుమ్రా 4-0-14-2, రాహుల్ చాహర్ 4-0-14-1, హార్దిక్ పాండ్య 1-0-3-0.