Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ టైటిల్
బ్యాట్స్మన్ మ్యాచులను గెలిపిస్తారు. బౌలర్లు ట్రోఫీలను అందిస్తారు. ఇది మరోసారి నిరూపితమైంది. అత్యుత్తమ బౌలింగ్ బృందం ముంబయి ఇండియన్సే ఐపీఎల్12 విజేతగా నిలిచింది. చెన్నైపై పరుగు విజయంతో రికార్డు నాల్గో టైటిల్ సాధించిన ముంబయి ఇండియన్స్ ఉప్పల్ స్టేడియంలో ఓ ప్రత్యేక రికార్డు సృష్టించుకున్నది. అదే ఒక్క పరుగు విజయం!
నవతెలంగాణ క్రీడా విభాగం
ఐపీఎల్12 టైటిల్ పోరు. ఐపీఎల్ దిగ్గజాలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ నాల్గో టైటిల్ రేసులో నిల్చున్నాయి. ముంబయి ఇండియన్స్ తన ఇన్నింగ్స్లో పవర్ ప్లేలో మినహా.. ఎక్కడా ముందంజ వేయలేదు. ధనాధన్ హిట్టర్లున్న ముంబయి ఇండియన్స్ను సూపర్ కింగ్స్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. ఛేదనలోనూ చెన్నై దూకుడు ప్రత్యేకం. ఆరంభంలో డుప్లెసిస్, ముగింపులో వాట్సన్ విధ్వంసమే సృష్టించారు. కానీ ఆఖరి క్షణాల్లో మ్యాచ్ను ముంబయి సొంతం చేసుకున్నది. ఉప్పల్ స్టేడియంలో కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది!.
2017 ఫైనల్స్ను గుర్తుకొచ్చేలా..! : ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమైన దశలో చెన్నై విజయంపై ఎవరికీ అనుమానం లేదు. ముంబయి ఇండియన్స్ సైతం మానసికంగా ఓటమికి సిద్ధపడింది. కానీ షేన్ వాట్సన్ రనౌట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ముంబయిని మానసికంగా దృడపరిచేలా చేసింది. షార్దుల్ ఠాకూర్కు లెగ్ సైడ్ బంతి విసిరిన మలింగ.. ఐదో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. చివరి బంతి ఎలా సంధించాలని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మలింగ ఓ నిర్ణయానికి వచ్చేశాడు. స్క్వేర్ లెగ్లో పరుగులు తీసిన ఠాకూర్కు మళ్లీ అదే విధమైన షాట్ ఆడేందుకు అనువుగా ఉండేలా బంతి వేశాడు. ఇదే సమయంలో వికెట్ పడగొట్టే అవకాశాన్ని వదులుకోలేదు. అంతకముందు మలింగ నుంచి మెరుపు బంతిని ఎదుర్కొన్న ఠాకూర్కు స్లో బంతి సంధించాలని మలింగ, రోహిత్ అనుకున్నారు.
మలింగ చివరి బంతి వేయడానికి ముందు.. మ్యాచ్ టై అని సూపర్ ఓవర్కు దారితీస్తుందా? లేక చెన్నై గెలుస్తుందా? ముంబయి మ్యాజిక్ చేయగలదా? అనే చర్చ. కానీ కొందరిలో మాత్రం 2017 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుర్తుకొచ్చింది. హైదరాబాద్లో జరిగిన ఆ ఫైనల్లో ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగుతో బయట పడింది. పుణె సూపర్జెయింట్స్ ఆశలను ఆవిరి చేసి.. రోహిత్ సేన రెండేండ్ల కిందట ఐపీఎల్లో మూడోసారి విజేతగా నిలిచింది. అప్పుడు తొలుత ముంబయి ఇండియన్స్ 129/8 పరుగులు చేయగా.. ఛేదనలో పుణె 128/6 పరుగుల వద్ద ఆగిపోయింది. అర్ధ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (51) ఆఖరి ఓవర్ మూడో బంతికి అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ ముంబయి వైపు మళ్లింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. పుణె రెండు పరుగులు తీసింది. మూడో పరుగు ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యాడు. అంతే, ఒక్క పరుగు తేడాతో ముంబయి అద్భుత విజయం నమోదు చేసింది. ఆ మ్యాచ్ మెరుపులు గుర్తుచేసుకున్న కొందరు.. ముంబయి మళ్లీ మ్యాజిక్ చేయగలదని ఊహించారు!. చివరకు అదే నిజమైంది. ఒక్క పరుగు చేసినా, టైటిల్పై ఆశలు నిలుపుకునే దశలో ఉన్న చెన్నై షార్దుల్ ఠాకూర్ ఎల్బీ అవుట్తో రికార్డు ఐదో సారి రన్నరప్తో సరిపెట్టుకున్నది. తాజా మ్యాచ్లో ఛేదనలో అర్ధ సెంచరీ హీరో షేన్ వాట్సన్ (80) చివరి ఓవర్లో అవుటయ్యాడు. ఈ ఘట్టాన్ని ముంబయి అనుకూలంగా మలచుకున్నది. 2017లో చివరి ఓవర్ మిచెల్ జాన్సన్ (ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరం) వేయగా.. తాజాగా లసిత్ మలింగ (ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం) బాధ్యత తీసుకున్నాడు. 2017 ముంబయి చేతిలో ఓడిన పుణె జట్టులో ఎం.ఎస్ ధోని (కెప్టెన్ కాదు) ఉండటం, తాజా ఫైనల్లో ఓడిన చెన్నైకి మహి సారథి కావటం యాదృచ్చికం. ఐదు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన రోహిత్ శర్మ (నాలుగు ముంబయి, ఒకటి డెక్కన్ చార్జర్స్) వంద శాతం టైటిల్ పోరు విజయాలు సాధించగా.. తొమ్మిది ఫైనల్స్ ఆడిన ధోని ఐదు సార్లు పరాజిత శిబిరంలో భాగమయ్యాడు. ముంబయి ఇండియన్స్ సాధించిన నాలుగు ఐపీఎల్ విజయాల్లో రెండు ట్రోఫీలు ఉప్పల్ స్టేడియంలోనే దక్కాయి. ఆ రెండు టైటిల్ విజయాలూ ఒక్క పరుగుతోనే ముంబయి సొంతం కావటం విశేషం.
ఏడాది విరామంతో.. : ముంబయి ఇండియన్స్ సక్సెస్ ఫార్ములా సైతం గమ్మత్తుగా కనిపిస్తోంది. ఆ జట్టు తొలిసారి 2013లో ఐపీఎల్ విజేతగా అవతరించింది. తర్వాత 2015, 2017, 2019లలో టైటిల్ ముద్దాడింది. గత ఏడు ఐపీఎల్ సీజన్లలో ముంబయి ఇండియన్స్ నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 2013 టైటిల్ విజయం నుంచి ఏడాది విరామంలో ప్రతిసారి ముంబయి ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది.