Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి సుధీర్మన్ కప్
- భారత్కు కఠిన డ్రా
నాన్నింగ్ (చైనా) : ఒలింపిక్స్, ఆసియా చాంపియన్షిప్స్, వరల్డ్ టూర్ ఫైనల్స్, థామస్ అండ్ ఉబెర్ కప్ సహా కామన్వెల్త్ వంటి మెగా ఈ వెంట్లలో పతకాలు సాధించింది భారత బ్యాడ్మింటన్ బృందం. కానీ 30 ఏండ్ల సుధీర్మన్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా ఏనాడూ క్వార్టర్ఫైనల్స్ దశ దాటలేదు. మరోసారి స్టార్ సింగిల్స్ షట్లర్లపై అతిగా ఆధారపడుతోన్న టీమ్ ఇండియా, సుధీర్మన్ కప్లో పతకంపై కన్నేసింది. ఆదివారం నుంచి ఆరంభం కానున్న సుధీర్మన్ కప్లో భారత్కు కఠిన డ్రా ఎదురైంది. దిగ్గజ చైనా, మలేషియాలతో గ్రూప్-డిలో భారత్ పోటీ పడుతుంది. గ్రూప్ దశలో ఒక్క విజయం క్వార్టర్ఫైనల్స్ బెర్త్ ఖాయం చేస్తున్నా, కనీసం సెమీఫైనల్స్కు చేరితే పతకం అందుతుంది. మలేషియాతో మంగళవారం తలపడనున్న భారత్ బుధవారం చైనాను ఢీ కొట్టనుంది. మలేషియాపై సింగిల్స్ ప్లేయర్స్ పి.వి సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ కీలకం కానున్నారు. ఆ జట్టు సూపర్స్టార్ లీ చోంగ్ వీ లేకపోవటం భారత్కు ఊరట. చైనా తరఫున స్టార్స్ షి యుకి, చెన్ లాంగ్, చెన్ యుఫెరు, హీ బింగ్జియావ్ బరిలో నిలిచారు. చైనాపై సింగిల్స్, డబుల్స్లోనూ నెగ్గటం అంత సులువు కాదు. మలేషియాపై విజయంతో క్వార్టర్ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ' డ్రా చాలా కఠినంగా ఉంది. మలేషియాపై సింగిల్స్ పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ డబుల్స్లో మేం కష్టపడాలి. ఈ సారి టోర్నీలో పతకం కోసం మా షట్లర్లు ఎంతో కఠిన సాధన చేశారు' అని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు.