Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమ్ ఇండియా 112 ఆలౌట్
- తొలి టెస్ట్లో భారత్ అనూహ్య ఓటమి
- గెలుపు ముంగిట పుట్టి ముంచిన బ్యాట్స్మెన్
- వణికించిన స్పిన్నర్ రంగన హెరాత్
- 63 పరుగుల తేడాతో శ్రీలంక అద్బుత విజయం
అనూహ్యమే జరిగింది. విజయ తీరాన కుర్రాళ్లు కాడి వదిలేశారు. గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్లో కోహ్లిసేన బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవిచూసింది. లంక స్పిన్నర్ రంగన హెరాత్ బంతులకు వణికిపోయిన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ కనీస పోరాట స్పూర్తి కనబర్చకుండా గాలెలో చేతులెత్తేశారు. చండిమాల్, హెరాత్ కళ్లుచెదిరే ప్రదర్శనతో ఆతిథ్య శ్రీలంక సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. దూకుడు మంత్రమే మా విజయతంత్రమన్న కోహ్లిసేన..చివరాఖరికి ఆ దూకుడు కరువయ్యే పరాజయం పాలవ్వటం విశేషం.
గాలె (శ్రీలంక): గాలె టెస్ట్లో అద్బుతమే చోటుచేసుకుంది. రెండున్నర రోజులు మ్యాచ్పై తిరుగులేని పట్టు సాధించిన టీమ్ ఇండియా అనూహ్యంగా ఓటమి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడింది. ఓ దశలో ఇన్నింగ్స్ విజయంపై కన్నేసిన కోహ్లిసేన..బ్యాటింగ్ ఆర్డర్ సమిష్టి వైఫల్యం పుణ్యమా అని 63 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (21-6-48-7) టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ను తిప్పేయటంతో 176 పరుగుల స్వల్ప ఛేదనలో కోహ్లిసేన 112 పరుగులకే కుప్పకూలింది. భారీ అజేయ శతకంతో ఇన్నింగ్స్ ఓటమి కోరల్లోంచి శ్రీలంకను పోరాడేస్థితిలో నిలిపిన దినేశ్ చండిమాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. గాలె టెస్ట్లో విజయం సాధించిన శ్రీలంక మూడు టెస్ట్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆరంభంలోనే : నాల్గో రోజు 153 పరుగుల కోసం బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఒకరకంగా రెండో వికెట్ భాగస్వామ్యమే అత్యుత్తమం అని చెప్పాలేమో!. ఓపెనర్ శిఖర్ ధావన్ (28), నైట్ వాచ్మెన్ ఇషాంత్ శర్మ (10) రెండో వికెట్కు 18 పరుగులు జోడించారు. టాప్ ఆర్డర్లో మరే ఇద్దరు బ్యాట్స్మెన్ ఇంత కంటే మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పలేదు. నాల్గో రోజు ఇషాంత్ వికెట్తో వేట ఆరంభించిన లంక స్పిన్నర్ రంగన హెరాత్ తర్వాత ఎక్కడా తగ్గలేదు. దూకుడుగా ఆడి ప్రత్యర్థిని హడలెత్తిస్తారనుకున్న రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లి (3), వృద్దిమాన్ సాహా (2)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. టెయిలెండర్ ఇషాంత్ శర్మ చూపిన సహనాన్ని కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్రదర్శించలేకపోయారు. ఇషాంత్ పెవిలియన్కు చేర్చిన కొద్దిసేపటికే రోహిత్ శర్మను సైతం ఊరించే బంతితో బోల్తాకొట్టించిన హెరాత్ శ్రీలంకకు బ్రేక్ ఇచ్చాడు. దీంతో అప్పటిదాకా ఆధిపత్యంలో ఉన్న భారత్ ఒక్కసారిగా రక్షణాత్మక ధోరణలోకి వెళ్లింది. ఆఫ్ స్పిన్నర్ తారిండు కౌశల్ అద్బుత బంతితో కెప్టెన్ విరాట్ కోహ్లిని ఔట్ చేయటంతో శ్రీలంక అప్పుడే గెలుపు సంబరాలు చేసుకున్నంత పనిచేసింది. కౌశల్ బంతి కోహ్లి ఎడ్జ్ తీసుకోవటంతో సిల్వ డైవ్ చేస్తూ చక్కగా ఒడిసిపట్టాడు. దీంతో భారత్ డ్రింక్స్ సమయానికి 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అజింక్య ఆడినా : బ్యాటింగ్ ఆర్డర్లో అజింక్య రహానే (36, 76 బంతుల్లో 4 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేసినా విజయం సాధించడానికి అతడి ఇన్నింగ్స్ సరిపోలేదు. కీలక ఆటగాళ్లు డ్రెస్సింగ్రూమ్కు చేరుకున్నాక క్రీజులోకి వచ్చిన రహానే టెయిలెండర్లతో కలిసి లంక స్పిన్ ద్వయాన్ని ప్రతిఘటించే ప్రయత్నమైతే చేశాడు. కానీ గాలె పిచ్ స్పిన్కు అనకూలిస్తుడంటంతో రహానే సైతం అద్బుతమేమీ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో రాణించిన వృద్దిమాన్ సాహా (2) తొందరపడి స్టంప్ ఔట్ అయ్యాడు. ఆఖరికి రహానే సైతం కౌశల్ బౌలింగ్లో నిష్క్రమించటంతో భారత్ ఓటమి ఖరారయ్యింది.
లాంఛనం లంచ్కు ముందే : రంగన హెరాత్ అసలు సిసలు విజృంభణ డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొదలైంది. వరస పెట్టి భారత ఆటగాళ్లను పెవిలియన్కుచేర్చిన రంగన.. ఎక్కడా చిన్న అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ను కౌశల్ ఒడుపుగా రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. ఇక తర్వాతి వరస ఆటగాళ్లు వృద్దిమాన్ సాహా (2), హర్బజన్ సింగ్ (1), అశ్విన్ (3), అజింక్య రహానే (36)లను రంగన వెన్వెంటనే పెవిలియన్కు చేర్చాడు. అమిత్ మిశ్రాను కౌశల్ ఔట్ చేయటంతో శ్రీలంక లాంఛనం ముగించేసింది.
పోరాఆడితే కదా..
ఛేదించాల్సిన టార్గెట్ 176 పరుగులు. నాల్గో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కొంచెం కష్టమే ఐనా నాల్గో రోజు పరుగులు చేయటం పెద్ద కష్టమైన పనికాదు. ఓవర్నైట్ స్కోరుతో కలిపి శనివారం చేయాల్సిన స్కోరు 153 మాత్రమే. చేతిలో ఉన్నది తొమ్మిది వికెట్లు. గాలె పిచ్ స్పిన్కు అనుకూలిస్తున్నా స్వీప్, రివర్స్ స్వీప్ను ఆశ్రయిస్తే పరుగుల వరద పారించవచ్చని చండిమాల్ ఇన్నింగ్సే నిదర్శనం. సాధించాల్సిన పరుగులు స్వల్పమే కాబట్టి సహజంగానే దూకుడును ఒంటబట్టించుకున్న కోహ్లిసేన అదేరీతిన పరుగులు చేస్తుందని భావిస్తారు ఎవరైనా. కానీ ఆచరణలో కోహ్లిసేన దూకుడు సంగతి అటుంచి కనీసం డిఫెన్స్ కూడా ఆడలేకపోయింది. లంక స్పిన్ ద్వయాన్ని ప్రతిఘటించే ప్రయత్నమే భారత ఇన్నింగ్స్లో కనిపించదు. ఒక్క సెషన్తో మ్యాచ్ గమనాన్ని మార్చేస్తాడన్న రోహిత్, ఆడితే అగ్రెస్సివ్గానేనన్న కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. కనీసం టెయిలెండర్ ఇషాంత్ శర్మ ఎదుర్కొన్నన్ని బంతుల్నీ కూడా వీరు ఆడలేకపోయారు. గెలుపు లాంఛనం అనుకున్న మ్యాచ్లో కనీస పోరాటపటిమ లేని బ్యాటింగ్ ఆర్డర్ పుణ్యమా అని బౌలర్ల అద్బుత ప్రదర్శన మరుగునపడింది. గాలె మ్యాచ్ ఫలితం కోహ్లి మనసు మార్చకపోయినా..భవిష్యత్లో ఇది ఒక పాఠంగా పనికొస్తుందనటంలో సందేహం లేదు. టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారాను బెంచ్కు పరిమితం చేసి కోహ్లి రాబట్టిందేమీ లేదు, మ్యాచ్ను కోల్పోవటం తప్పితే..!
మమ్మల్నీ తప్ప ఎవరినీ నిందించడానికి లేదు. మొదటి ఐదు వికెట్లు పడగొట్టాక దొరికిన ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆసెషన్లోనే మ్యాచ్ను ముగించాల్సింది. ఒక్క సెషన్ గేమ్ను మలుపు తిప్పింది. అదే టెస్ట్ క్రికెట్. చండిమాల్, హెరాత్ అద్బుతంగా ఆడారు. ఒత్తిడిలో ఉన్న మా బ్యాట్స్మెన్ను హెరాత్ ఔట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు.
- ఓటమి అనంతరం
విరాట్ కోహ్లి