Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్మప్లో కోహ్లిసేనకు షాక్
- 6 వికెట్ల తేడాతో కివీస్ గెలుపు
చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్, టర్న్కు అనుకూలత, హిట్టింగ్కు స్వర్గధామం.. ఇదీ ప్రపంచకప్లో టీమ్ ఇండియా ఊహించుకున్న పిచ్ పరిస్థితులు. కానీ వార్మప్లోనే కోహ్లిసేనకు గట్టి షాక్ తగిలింది. పచ్చిక పిచ్పై అరివీర భయంకర టాప్ ఆర్డర్ సహా మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. లోయర్ ఆర్డర్ మెరుపులతో గౌరవప్రద స్కోరు చేసినా.. ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ప్రపంచకప్లో పచ్చిక పిచ్ ఎదురైతే ఏం చేయాలి? ఇది భారత్కు మంచి అనుభవం!.
లండన్ : వరల్డ్ నం.2 ర్యాంక్. ఆతిథ్య ఇంగ్లాండ్తో పాటు హాట్ ఫేవరెట్ ప్రాధాన్యత. ప్రపంచకప్లో టీమ్ ఇండియాపై అభిమానులు, విశ్లేషకులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. పచ్చిక పిచ్ ఎదురైతే మన సీమర్లూ నిప్పులు చెరుగుతారు, ఆందోళన అక్కర్లేదని వాదించిన వారు ఇప్పుడు పునరాలోచన చేయాల్సిందే!. పచ్చిక పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లి వణికిపోయింది. 39.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. టాప్-4 అందరూ విఫలమయ్యారు. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (54, 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు), హార్దిక్ పాండ్య (30, 37 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. స్వల్ప ఛేదనలో కెప్టెన్ కానె విలియమ్సన్ (67, 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రాస్ టేలర్ (71, 75 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. 37.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ లాంఛనం ముగించింది. 6 వికెట్ల తేడాతో వరల్డ్ కప్ ఫేవరెట్పై ఘన విజయం సాధించింది.
పచ్చికపై బోల్తా : పచ్చిక పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఊహించని రీతిలో స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (2), శిఖర్ ధావన్ (2)లు ట్రెంట్ బౌల్ట్ పేస్కు పడిపోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (18) గ్రాండ్హౌమె బంతికి బౌల్డయ్యాడు. నాలుగో స్థానంలో ఆడిన కెఎల్ రాహుల్ (6) బౌల్ట్ బంతికి వికెట్ కోల్పోయాడు. 39/4 తో టాప్ ఆర్డర్ను కోల్పోయిన భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. తొలి పది ఓవర్లలోనే కీలక బ్యాట్స్మెన్ను అవుట్ చేసిన న్యూజిలాండ్ పట్టు సాధించింది. కఠిన పరిస్థితుల్లో ఆల్రౌండర్లు ఆదుకున్నారు. హార్దిక్ పాండ్య (30), రవీంద్ర జడేజా (54) విలువైన పరుగులు జోడించారు. టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ (19) ఫర్వాలేదనిపించాడు. నీషమ్ (3/26), ట్రెంట్ బౌల్ట్ (4/33) నిప్పులు చెరిగారు. పూర్తి ఓవర్లు ఆడకుండానే భారత్ కుప్పకూలింది.
కానె, రాస్ జోరు : స్వల్ప ఛేదనలో కొలిన్ మన్రో (4) బుమ్రా యార్కర్కు బలయ్యాడు. మార్టిన్ గప్టిల్ (22) సైతం త్వరగా వికెట్ కోల్పోయినా.. న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది. కెప్టెన్ కానె విలియమ్సన్ (67), రాస్ టేలర్ (71)లు మూడో వికెట్కు 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేశారు. కోహ్లి బౌలింగ్ ప్రయోగాలు ఫలించలేదు. విలియమ్సన్, టేలర్లు సులువుగా అర్ధ సెంచరీలు కొట్టేశారు. ఈ జోడీ మెరుపులతో 37.1 ఓవర్లోనే న్యూజిలాండ్ గెలుపొందింది.
సంక్షిప్త స్కోర్లు : భారత్ ఇన్నింగ్స్ : 179/10 (రవీంద్ర జడేజా 54, హార్దిక్ పాండ్య 30, ట్రెంట్ బౌల్ట్ 4/33, నీషమ్ 3/26), న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 180/4 ( రాస్ టేలర్ 71, విలియమ్సన్ 67, జడేజా 1/27, బుమ్రా 1/2)