Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా ప్రశ్నలపై సఫారీ కోచ్
సౌతాంప్టన్ : ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది. సెమీఫైనల్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సమయంలోనే దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పునరాగమన అభిలాషను దక్షిణాఫ్రికా సెలక్టర్లు తోసిపుచ్చారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దక్షిణాఫ్రికా చీఫ్ కోచ్ గిబ్సన్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏబీపై వరుస ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ' ప్రపంచకప్లో డివిలియర్స్ ఆడాలని బలంగా కోరుకునే వారు చాలా మందే ఉన్నారు. బహుశా డివిలియర్స్ సైతం అంత బలమైన కోరిక ఉండదేమో!. నిజంగా ఏబీ ప్రపంచకప్లో ఆడాలని అనుకుంటే, ఇక్కడ ఉండేవాడే. వరుస ఓటములతో ఇప్పుడు ఏబీ ఏమీ చేయలేడు. ఇక్కడున్న మేమే ఏమైనా చేయాలి' అని గిబ్సన్ వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికా ప్రపంచకప్ జట్టును ప్రకటించడానికి ఒక రోజు ముందు కెప్టెన్ డుప్లెసిస్, కోచ్ గిబ్సన్లతో డివిలియర్స్ ప్రపంచకప్లో ఆడాలనే కోరిక బయటపెట్టాడు. ఇదే విషయాన్ని సెలక్షన్ కమిటీ వద్ద ప్రస్తావించగా.. ' ఏడాది క్రితం ఏబీ వీడ్కోలు వద్దని వేడుకున్నాం. అతడు గొప్ప క్రికెటర్, కాదనలేం. ఈ సమయంలో ఆ స్థానంలో కొంత మంది ఆటగాళ్లను తయారు చేసుకున్నాం. వారికి ఆశలు కల్పించాం. ఇప్పుడు ఏబీ కోసం జట్టు విలువలను పణంగా పట్టలేమని' సెలక్షన్ కమిటీ చైర్మన్ జరిగిన ఘటనపై ప్రకటన చేశాడు. ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన నేపథ్యంలో సూపర్ స్టార్ డివిలియర్స్ జట్టులో ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని అభిమానులు అనుకుంటున్నారు. ఇది సఫారీ జట్టును, సెలక్టర్లను మరింత ఒత్తిడిలోకి నెడుతోంది.