Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్పై భారత్ ఘన విజయం
- శతకబాదిన శిఖర్ ధావన్
- మెరిసిన కోహ్లి, రోహిత్, పాండ్య
లండన్ (ఓవల్): ఆస్ట్రేలియాపై అదిరే విజయం. టాప్ బ్యాట్స్మెన్, టాప్ బౌలర్లు కలిసికట్టుగా మెరిసిన వేళ డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది. కంగారూను 36 పరుగుల తేడాతో చిత్తు చేసి 2019 ప్రపంచకప్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శిఖర్ ధావన్ (117, 109 బంతుల్లో 16 ఫోర్లు) మెరుపు సెంచరీకి తోడు విరాట్ కోహ్లి (82, 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), రోహిత్ శర్మ (57, 70 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో కదం తొక్కారు. హార్దిక్ పాండ్య (48, 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. టాప్-4 మెరుపులతో తొలుత భారత్ 352/5 పరుగులు చేసింది. రికార్డు ఛేదనలో స్టీవ్ స్మిత్ (69, 70 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ వార్నర్ (56, 84 బంతుల్లో 5 ఫోర్లు), అలెక్స్ క్యారె (55నాటౌట్, 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు వృథా అయ్యాయి. భారత బౌలర్లు బుమ్రా (3/61), చాహల్ (2/62), భువనేశ్వర్ (3/50) ఆసీస్ ఛేదనను ఛిద్రం చేశారు. ప్రపంచకప్లో ఆస్ట్రేలియాకు ఇది తొలి ఓటమి.
ఛేదనలో చతికిల : భారీ ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు డెవిడ్ వార్నర్ (56), అరోన్ ఫించ్ (36) తొలి వికెట్కు 61 పరుగులు జోడించారు. దూకుడు లేకపోయినా.. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఫామ్లో ఉన్న ఫించ్ అనవసర రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. స్టీవ్ స్మిత్ (69)తో కలిసి వార్నర్ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఐదు ఫోర్లు కొట్టిన వార్నర్ 77 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేల్లో ఇదే వార్నర్కు నెమ్మదైన ఫిఫ్టీ. మరో ఎండ్లో స్మిత్ సైతం వేగంగా పరుగులు తీయటంలో ఇబ్బంది పడ్డాడు. వార్నర్ను మిడ్ వికెట్లో అవుట్ చేయటంతో మొదలైన భారత బౌలర్ల మ్యాజిక్ అలాగే కొనసాగింది. ఉస్మాన్ ఖవాజ (42), మాక్స్వెల్ (28) మెరిసినా సాధించాల్సిన రన్రేట్ భారీగా పెరిగింది. బుమ్రా బౌలింగ్లో మూడు బౌండరీలతో జోరందుకున్న స్మిత్ను తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ బలిగొన్నాడు. అదే ఓవర్లో ప్రమాదకర మార్కస్ స్టోయినిస్ (0)నూ డకౌట్ చేశాడు. వరుస వికెట్లతో భువనేశ్వర్ మ్యాచ్ను భారత్వైపు లాగేశాడు. ఖవాజను బుమ్రా, మాక్స్వెల్ను చాహల్ మూసేయగా 244/6తో ఆసీస్ ఓటమి ఖాయమైంది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారె అర్ధ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓటమి అంతరాన్ని మాత్రమే కుదించగలిగాడు.
టాప్ మెరుపుల్ : టాస్ నెగ్గిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు టాప్-4 బ్యాట్స్మెన్ భారీ స్కోరు అందించారు. ఆరంభంలో ఆచితూచి ఆడటం, ఆఖర్లో రెచ్చిపోవటం కలిసొచ్చింది. ప్రమాదకర ఆసీస్ పేసర్లను పవర్ ప్లేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (57), శిఖర్ ధావన్ (117) సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బౌండరీలు బాదాలనే తొందరపాటు ప్రదర్శించలేదు. పవర్ ప్లేలో భారత్ 41/0తో స్థిరమైన ఆరంభం చేసింది. మంచి ఆరంభాల్ని ధావన్, రోహిత్ సద్వినియోగం చేసుకున్నారు. కౌల్టర్నైల్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన ధావన్ దూకుడు మొదలెట్టాడు. రోహిత్ 12వ ఓవర్లో తొలి బౌండరీ సాధించాడు. స్పిన్నర్లు జంపా, మాక్స్వెల్పై వరుసగా మూడు ఫోర్లు సాధించాడు. కౌల్టర్నైల్ బంతిని ఫైన్ లెగ్లో స్టాండ్స్లోకి పంపిన రోహిత్ జోరందుకున్నాడు. ధావన్ ఏడు ఫోర్లతో 53 బంతుల్లో 50 పరుగులు చేయగా.. రోహిత్ మూడు ఫోర్లు, ఓ సిక్సర్తో 61 బంతుల్లో సాధించాడు. వికెట్ల వెనకాల రోహిత్ క్యాచ్ ఇవ్వటంతో భారత్ 127 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కెప్టెన్ విరాట్ కోహ్లి (82)తో శిఖర్ ధావన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మిడిల్ ఓవర్లలో 6.5 రన్రేట్తో పరుగులు చేసిన ఈ జోడీ భారీ స్కోరుకు బాటలు వేసింది. విరాట్ నెమ్మదిగా ఆడగా.. ధావన్ ఎదురుదాడి చేశాడు. ఓవర్ 1-3 బంతుల్లోపే ఓ బౌండరీ సాధించిన ఈ జోడీ.. వికెట్ల నడుమ పరుగుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. జంపాపై వరుస బంతుల్లో బౌండరీలు బాదిన శిఖర్, 13 ఫోర్ల సాయంతో 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. స్టార్క్ వేసిన యార్కర్పై భారీ షాట్కు వెళ్లిన ధావన్, వికెట్ కోల్పోయాడు. అప్పటికి భారత స్కోరు 37 ఓవర్లలో 220/2.
హార్దిక్ పాండ్య నాలుగో స్థానంలో రావటంతో ఆఖరి 15 ఓవర్లలో భారత్ 146 పరుగులు పిండుకున్నది. చివరి 60 బంతుల్లో 116 పరుగులు పిండుకుని, 352 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఎదుర్కొన్న తొలి బంతికే జీవనదానం పొందిన పాండ్య (48) అవకాశాన్ని వదులుకోలేదు. మాక్స్వెల్, జంపాలపై డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్లతో ధనాధన్ మొదలెట్టాడు. కమిన్స్ ఓవర్లోనూ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా సిక్సర్ సంధించాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిసిన పాండ్య ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అర్ధ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోయినా.. ఎం.ఎస్ ధోని (27, 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు కొనసాగించాడు. మూడు ఫోర్లు, సిక్సర్తో చెలరేగాడు. ధోని, కోహ్లి ఆఖరి ఓవర్లో వికెట్ కోల్పోయినా.. కెఎల్ రాహుల్ (11 నాటౌట్) ఓ సిక్సర్, ఫోర్ విన్యాసం భారత్ను 352 పరుగులకు చేర్చింది.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) అలెక్స్ (బి) కౌల్టర్ నైల్ 57, శిఖర్ ధావన్ (సి) లైయాన్ (బి) స్టార్క్ 117, విరాట్ కోహ్లి (సి) కమిన్స్ (బి) స్టోయినిస్ 82, హార్దిక్ పాండ్య (సి) ఫించ్ (బి) కమిన్స్ 48, ఎం.ఎస్ ధోని (సి,బి) స్టోయినిస్ 27, కెఎల్ రాహుల్ నాటౌట్ 11, కేదార్ జాదవ్ నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (50 ఓవర్లలో 5 వికెట్లకు) 352.
వికెట్ల పతనం : 1-127, 2-220, 3-303, 4-338, 5-348.
బౌలింగ్ : పాట్ కమిన్స్ 10-0-55-1, మిచెల్ స్టార్క్ 10-0-74-1, కౌల్టర్ నైల్ 10-1-63-1, గ్లెన్ మాక్స్వెల్ 7-0-45-0, ఆడమ్ జంపా 6-0-50-0, మార్కస్ స్టోయినిస్ 7-0-62-2.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (సి) భువనేశ్వర్ (బి) చాహల్ 56, అరోన్ ఫించ్ రనౌట్ 36, స్టీవ్ స్మిత్ (ఎల్బీ) భువనేశ్వర్ 69, ఉస్మాన్ ఖవాజ (బి) బుమ్రా 42, గ్లెన్ మాక్స్వెల్ (సి) జడేజా (బి) చాహల్ 28, మార్కస్ స్టోయినిస్ (బి) భువనేశ్వర్ 0, అలెక్స్ క్యారె నాటౌట్ 55, కౌల్టర్ నైల్ (సి)కోహ్లి (బి) బుమ్రా 4, పాట్ కమిన్స్ (సి)ధోని (బి) బుమ్రా 8, మిచెల్ స్టార్క్ రనౌట్ 3, జంపా (సి) జడేజా (బి) భువనేశ్వర్ 1, ఎక్స్ట్రాలు : 14, మొత్తం : (50 ఓవర్లలో ఆలౌట్) 316.
వికెట్ల పతనం : 1-61, 2-133, 3-202, 4-238, 5-238, 6-244, 7-283, 8-300, 9-313, 10-316.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 10-0-50-3, జశ్ప్రీత్ బుమ్రా 10-1-61-3, హార్దిక్ పాండ్య 10-0-68-0, కుల్దీప్ యాదవ్ 9-0-55-0, యుజ్వెంద్ర చాహల్ 10-0-62-2, కేదార్ జాదవ్ 1-0-14-0.
మ్యాచ్ ముచ్చట్లు
27 ఐసీసీ ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టు భారత్. ఓవల్లో శిఖర్ ధావన్ సెంచరీతో భారత్ శతకాల సంఖ్య 27కు చేరింది. 26 సెంచరీలతో ఆస్ట్రేలియా, 23 శతకాలతో శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వ్యక్తిగతంగా సచిన్ టెండూల్కర్ ఆరు సెంచరీలతో ముందుండగా.. ఐదు సెంచరీలతో సంగక్కర, రికీ పాంటింగ్ తర్వాత స్థానంలో ఉన్నారు. ప్రపంచకప్లో ధావన్కు ఇది మూడో సెంచరీ.
1 ఓ జట్టుపై వేగవంతంగా 2000 పరుగులు చేసిన బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాపై 37 ఇన్నింగ్స్ల్లోనే రోహిత్ 2000 మార్క్ దాటేశాడు. సచిన్ టెండూల్కర్ (3077), దెష్మండ్ హేన్స్ (2262), వివ్ రిచర్డ్స్ (2187) తర్వాత కంగారూ రెండువైల పైచిలుకు పరుగులు చేసిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు.
2 ఓ ప్రపంచకప్ మ్యాచ్లో బారత టాప్-3 బ్యాట్స్మెన్ 50 ప్లస్ పరుగులు చేయటం ఇది రెండోసారి. 2011 నాగ్పూర్ వరల్డ్కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ (73), సచిన్ (111), గంభీర్ (69) ఈ ఘనత సాధించారు. ఆసీస్పై తాజా మ్యాచ్లో రోహిత్ శర్మ (57), శిఖర్ ధావన్ (117), విరాట్ కోహ్లి (82) ఫిఫ్టీ ప్లస్ కొట్టారు.
127 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై భారత తొలి వికెట్ అత్యధిక భాగస్వామ్యం 127 పరుగులు. 2015 సిడ్నీ వరల్డ్కప్ సెమీఫైనల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ నెలకొల్పిన 79 పరుగుల రికార్డును ఓవల్లో ఆ ఇద్దరే తిరగరాశారు.
16 ఐసీసీ టోర్నీ వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. 21 శతక భాగస్వామ్యాలతో సచిన్, గంగూలీ జోడీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 16 సార్లు 100 ప్లస్ భాగస్వామ్యాలతో గిల్క్రిస్ట్, హెడేన్ జోడీ సరసన ధావన్, రోహిత్ నిలిచారు.
ఎం.ఎస్ ధోని ఆస్ట్రేలియాతో మ్యాచ్లో బలిదాన్ గ్లోవ్స్ లేకుండా బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికాపై మ్యాచ్లో సైనికాధికారులు ధరించే బలిదాన్ లోగోను కీపింగ్ గ్లోవ్స్ ధరించటంపై ఐసీసీ హెచ్చరించింది. హెచ్చరించినా, లోగో కొనసాగిస్తే వరుసగా 25, 50, 75 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తుంది.
ఇన్నింగ్స్ 9వ ఓవర్లో శిఖర్ ధావన్ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. పాట్ కమిన్స్ సంధించిన బౌన్సర్ను ఎదుర్కొనే క్రమంలో బంతి ధావన్ బొటనవేలికి తగిలింది. బాధతో విలవిల్లాడిన ధావన్ ఫిజియో సాయంతో బ్యాటింగ్ కొనసాగించాడు. అప్పటికి ధావన్ స్కోరు 26 పరుగులు.