Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు
- ఇరు జట్లకు చెరో పాయింటు
- ఐసీసీ 2019 ప్రపంచకప్
బ్రిస్టోల్ (ఇంగ్లాండ్): ఐసీసీ 2019 వన్డే వరల్డ్కప్లో ఎన్ని జట్లు ఆడుతున్నాయి? ప్రపంచకప్లో పది జట్లు ఆడుతున్నాయని క్రికెట్ అభిమానులు చెప్పటం సహజం. కానీ ప్రపంచకప్ మ్యాచులను చూస్తున్నవారు చెప్పే సమాధానం 11. నిజమే, అర్హత సాధించి వరల్డ్కప్ వార్కు సిద్ధమైన పది జట్లకు ఇంగ్లాండ్ వేసవిలో వరుణుడు తోడయ్యాడు. నేనూ వరల్డ్కప్ పోటీ ఉన్నానంటూ ముచ్చటగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తొలుత పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్లో పైచేయి సాధించిన వరుణుడు.. వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గేశాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో పాటు తాజాగా బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచుల్లోనూ విజయాలు సొంతం చేసుకున్నాడు. ఓ ప్రపంచకప్లో వర్షం కారణంగా మూడు మ్యాచులు పూర్తిగా రద్దు కావటం ఇదే ప్రథమం. వరుణుడి జోరు ఇక్కడితో ఆగట లేదు. రానున్న మ్యాచులకూ వర్ష ప్రమాదం భారీగా పొంచి ఉంది. గురువారం భారత్, న్యూజిలాండ్ మాంచెస్టర్ సమరంలో సైతం వరుణుడు విజయంపై కన్నేసినట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
టాస్ పడకుండానే : టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు కావటం ఇది రెండోసారి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బ్రిస్టోల్ మైదానం అవుట్ ఫీల్డ్ బాగా దెబ్బతింది. భారీ వర్షం కారణంగా మూడు సార్లు అంపైర్లు ఇన్స్పెక్షన్ను వాయిదా వేశారు. వర్ష బీభత్సంతో బంగ్లాదేశ్ జట్టు మధ్యాహ్నామే స్టేడియాన్ని వీడగా... శ్రీలంక జట్టు కాసేపు మైదానంలో ఉండి తిరుగు పయనమైంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యపడుతుందని ఆశించిన అభిమానులకూ నిరాశే మిగిలింది. ఆట నిర్వహణ సాధ్యం కాదని తేలిపోవటంతో అంపైర్లు బంగ్లాదేశ్, శ్రీలంకలకు చెరో పాయింటు ఇస్తూ మ్యాచ్ను రద్దు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచులు రద్దు కావటంతో శ్రీలంకకు రెండు పాయింట్లు దక్కాయి. ఇది ఓ విజయంతో సమానం.