Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంచెస్టర్లో న్యూజిలాండ్తో ఢీ
- కోహ్లిసేన ముందు మరో పరీక్ష
2019 ప్రపంచకప్లో భారత్ భలే బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లో అగ్ర జట్లను ఓడించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఓడించి ఊపందుకుంది. మధ్యలో అనిశ్చితి పాకిస్థాన్, చివర్లో ఇంగ్లాండ్ మినహా కోహ్లిసేన ఆధిపత్యాన్ని సవాల్ చేసే మరో జట్టు లేదు. వరుస విజయాలతో టీమ్ ఇండియా జోరుపై వినిపిస్తున్న వ్యాఖ్యలివి.
పాకిస్థాన్, ఇంగ్లాండ్ సంగతి ఏమో గానీ, అంతకంటే ప్రమాదకర ప్రత్యర్థిని కోహ్లిసేన ముందు ఎదుర్కొనుంది. ఫేవరెట్ జాబితాలో లేకపోయినా, కాగితంపై కోహ్లిసేనతో సమవుజ్జీ కాకపోయినా.. న్యూజిలాండ్ కనిపించని కఠిన ప్రత్యర్థి. వరుసగా మూడు విజయాలు సాధించిన కివీస్ను భారత్ మాంచెస్టర్ పోరులో ఎదుర్కొబోతుంది.
నవతెలంగాణ క్రీడా విభాగం: 2016 వరల్డ్ టీ20, ఆరంభ మ్యాచ్. నాగ్పూర్లో ఆతిథ్య భారత్తో న్యూజిలాండ్ తొలి పోరు. పిచ్ పరిస్థితులను చదవటంలో, పిచ్ స్వభావాన్ని పసిగట్టి జట్టును ఎంచుకోవటంలో ధోనికి తిరుగులేదు. నాగ్పూర్ పిచ్పై ధోని ఒక్క స్పిన్నర్నే ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 128/7 పరుగులే చేసింది. ముగ్గురు స్పిన్నర్లను ఎంచుకుని కివీస్ కెప్టెన్ కానె విలియమ్సన్ తప్పు చేశాడా? అనే మాటలు వ్యాఖ్యాల బాక్స్ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. సొంతగడ్డపై స్వల్ప ఛేదనకు భారత్ బరిలోకి దిగింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ శాంట్నర్ (4/11), ఇశ్ సోధి (3/18), నాథన్ మెక్కలమ్ (2/15) 9 వికెట్లతో మ్యాజిక్ చేశారు. వికెట్ రెండు వైపులా స్పిన్ దాడి చేయించిన విలియమ్సన్ భారత్ను 79 పరుగులకే కుప్పకూల్చాడు. 2011 ప్రపంచకప్ తర్వాత సొంతగడ్డపై మరోసారి 2016 వరల్డ్ టీ20 టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ను ఆరంభంలోనే న్యూజిలాండ్ గట్టి దెబ్బకొట్టింది. ఈ విజయం కానె విలియమ్సన్ నాయకత్వ లక్షణాలు, వ్యూహ పటిమతో పాటు న్యూజిలాండ్ సామర్థ్యాన్ని తెలియజేసింది. 2019 ప్రపంచకప్లో మూడో మ్యాచ్లో న్యూజిలాండ్ను ఎదుర్కొబోతున్న కోహ్లిసేన.. నిగూఢ ప్రత్యర్థి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో సైతం భారత్పై అలవోక విజయం సాధించిన న్యూజిలాండ్ను తక్కువ చేస్తే.. ఆ జట్టు ఏం చేస్తుందో అందరి తెలుసు.
టాప్కు బౌల్ట్ ముప్పు : దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచుల్లో భారత టాప్ ఆర్డర్కు వేసిన బంతులు చూస్తే, ఓ విషయం తెలుస్తుంది. వార్మప్ మ్యాచ్లో భారత్ను న్యూజిలాండ్ 179 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు ఓ ప్రణాళిక ప్రకారం కివీస్ బౌలర్లు బంతులేశారు. ముఖ్యంగా స్టార్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ కచ్చితమైన లెంగ్త్తో వేసిన బంతులకు మన బ్యాట్స్మెన్ వికెట్ కోల్పోక తప్పలేదు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్లను బౌల్ట్ తన ఉచ్చులో పడేశాడు. వార్మప్లో బౌల్ట్ వ్యూహం కాపీ కొట్టేసిన సఫారీ, కంగారూ సీమర్లు అదే రీతిలో బౌలింగ్ చేశారు. టాప్ ఆర్డర్పై ఫీల్డింగ్ మొహరింపులు సైతం వార్మప్లో కివీస్ ఉంచినట్టే ఉండటం గమనించే ఉంటారు. బౌల్ట్ దెబ్బకు తర్వాతి మ్యాచుల్లో ఆ బలహీనతలను మన బ్యాట్స్మెన్ అధిగమించటంలో సఫలమయ్యారు. కానీ ట్రెంట్బౌల్ట్ షార్ట్ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొవటం ఇప్పటికీ పెద్ద సవాలే. భారత్పై బౌల్ట్కు మంచి రికార్డుంది. 12 మ్యాచుల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్లో ట్రెంట్ బౌల్ట్ పూర్వ వైభవంతో వికెట్ల వేట సాగిస్తున్నాడు. బౌల్ట్కు ఇప్పుడు ఫెర్గుసన్ తోడయ్యాడు. నీషమ్, సోధిలు సైతం ప్రభావశీల బౌలర్లు. స్పిన్ను బాగా ఆడే భారత్పై న్యూజిలాండ్ ఎప్పటికిప్పుడు స్పిన్ అస్త్రం ప్రయోగించి సక్సెస్ సాధించటం ఆశ్చర్యకర విషయం.
ప్రపంచకప్లో వారిదే పైచేయి : భారత్, న్యూజిలాండ్ చివరి ద్వైపాక్షిక వన్డే సిరీస్ను టీమ్ ఇండియా 4-1తో నెగ్గింది. కానీ వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఏం చేసిందో అందరం చూశాం. ఐసీసీ ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్ ఏడు సార్లు తలపడ్డాయి. నాలుగుసార్లు న్యూజిలాండ్ నెగ్గగా, మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 1975, 1979 ప్రపంచకప్ల్లో న్యూజిలాండ్ పైచేయి సాధించగా.. తర్వాతి రెండు ప్రపంచకప్ మ్యాచుల్లో భారత్ గెలుపొందింది. 1992, 1999 ప్రపంచకప్ల్లో న్యూజిలాండ్ను విజయం వరించింది. చివరగా 2003 ప్రపంచకప్లో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్లతో గెలుపొందింది. గురువారం మ్యాచ్ వేదిక మాంచెస్టర్లో భారత్, న్యూజిలాండ్లు 1975 వరల్డ్కప్లో పోటీపడ్డాయి. ఆ మ్యాచ్లో కివీస్ 4 వికెట్ల తేడాతో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ వరల్డ్కప్ వార్ కాస్త ఆసక్తికరంగా ఉంది!. వరుసగా రెండు మ్యాచుల్లో విజయాలు, వరుసగా రెండు మ్యాచుల్లో ఓటములు గణాంకాల్లో కనిపిస్తున్నాయి. 2003లో భారత్ నెగ్గింది,2019లో టీమ్ ఇండియానే విజయం సాధిస్తుందేమో చూద్దాం.
మాంచెస్టర్కు వర్ష సూచన : భారత్, న్యూజిలాండ్ మాంచెస్టర్ వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ ప్రపంచకప్లో మాంచెస్టర్ వేదికగా ఇదే తొలి మ్యాచ్. ఇక్కడ కొన్ని రోజులుగా నిలకడగా వర్షం కురుస్తుంది. మ్యాచ్కు ముందు, మ్యాచ్ రోజు సైతం వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం కారణంగా పిచ్పై కవర్లు కప్పి ఉంచారు. మ్యాచ్ రోజు సైతం మేఘావృత వాతావరణం ఉండనుంది. ఇది న్యూజిలాండ్కు మరింత అనుకూలం. ఇటువంటి పరిస్థితుల్లోనే కివీస్ వార్మప్లో భారత్ను ఓడించింది. వర్ష సూచనను కివీస్ శిబిరం ఆహ్వానిస్తున్నట్టే కనిపిస్తుంది. భారత పేస్ దళం సైతం కివీస్ను పిండి చేయగలదు. పచ్చిక పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఎప్పటికీ ప్రమాదకర జట్టే. మ్యాచ్ రోజు నిలకడగా వర్షం కురిస్తే మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం లేకపోలేదు.