Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నేడు న్యూజిలాండ్తో భారత్ ఢ
-కోహ్లిసేనకు బౌల్ట్ ప్రమాదం
-కివీస్కు బుమ్రా ఉపద్రవం
నాటింగ్హామ్ : ప్రపంచకప్ ఫేవరెట్ల జాబితాలో లేదు. సెమీఫైనల్స్ రేసు జాబితాలోనూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ వరుసగా మూడు మ్యాచుల్లో తిరుగులేని విజయాలు. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. 2015 వరల్డ్కప్ రన్నరప్ న్యూజిలాండ్ ప్రస్థానం ఇదీ. ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడకుండా, సమష్టి ప్రదర్శనలపై నిలకడగా విజయాలు సాధించే జట్లలో న్యూజిలాండ్ ముందుంటుంది. తాజాగా ప్రపంచకప్లోనూ కివీస్ అదే చేస్తోంది. హ్యాట్రిక్ విజయాలు సాధించినా, వరల్డ్కప్లో ఆ జట్టుకు అసలు పరీక్ష ఇప్పుడే ఎదురవుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్లపై నెగ్గిన న్యూజిలాండ్కు నేడు పూర్తిగా భిన్నమైన పోరు. టైటిల్ ఫేవరెట్ టీమ్ ఇండియాను ఎదురించటం అంత సులువు. చివరగా 2003 ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడ్డాయి. ఆ మ్యాచ్లో విజయం భారత్నే వరించింది.
రాహుల్పై ఫోకస్ : స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్కు గాయంతో ఇప్పుడు దృష్టంతా కెఎల్ రాహుల్పై పడింది. మూడో ఓపెనర్గా జట్టులోకి వచ్చి, నాల్గో స్థానంలో ఆడుతున్న రాహుల్ నేడు రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాలి. ఓపెనర్గా ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం రాహుల్కు కలిసొచ్చేదే. ఎదురుదాడి చేయటంలో, ఆత్మరక్షణతో ఆడటం రెండూ రాహుల్కు అలవాటే. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోన్న రాహుల్ నేడు కివీస్పై మంచి ఇన్నింగ్స్ నమోదు చేయాలని ఆశిస్తున్నాడు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను కివీస్ వార్మప్లో అలవోకగా అవుట్ చేసింది. ఇప్పుడూ అదే వ్యూహం అమలు చేయటంపై దృష్టి పెట్టనుంది. దీనిపై రోహిత్, విరాట్ కౌంటర్ ఏ విధంగా ఇస్తారో చూడాలి. ఆరంభంలో నెమ్మదిగా పరుగులు చేస్తున్నా.. ఆఖర్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య, ఎం.ఎస్ ధోని రూపంలో బలమైన హిట్టర్లున్నారు. అయితే, ఆరంభ ఓవర్లలో వికెట్లు పడితే ఇది సాధ్యపడక పోవచ్చు. రన్రేట్తో సంబంధం లేకుండా ఆరంభ ఓవర్లలో భారత్ వికెట్లు నిలుపుకోవటం ప్రధానం. నం.4 స్థానంలో దినేశ్ కార్తీక్, విజరు శంకర్లలో ఒకరు ఒకరు ఆడనున్నారు. స్పిన్ ఆల్రౌండర్ కేదార్ జాదవ్ తనదైన ప్రదర్శన కోసం నిరీక్షిస్తున్నాడు. ఈ మ్యాచ్లో జాదవ్కు ఆ అవకాశం వస్తుందేమో చూడాలి. బౌలింగ్ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్లతో పాండ్య పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. కివీస్ మిడిల్ ఆర్డర్ను కట్టడి చేసే బాధ్యత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర యాదవ్లపై ఉంది.
జోరుమీదున్న కివీస్ : హ్యాట్రిక్ విజయాల ఊపుమీదున్న న్యూజిలాండ్ నేడు కఠిన సవాల్ ఎదుర్కొనుంది. వార్మప్లో గెలిచినంత మాత్రాన, భారత్ను కివీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోలేదు. న్యూజిలాండ్ ప్రధాన బలం మిడిల్ ఆర్డర్. మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రోలు భారీ ఆరంభాల్ని ఇస్తుండటం కలిసొస్తుంది. టామ్ లాథమ్, రాస్ టేలర్కు తోడు కానె విలియమ్సన్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తున్నాడు. పేస్, స్పిన్ను సమర్థవంతంగాత ఎదుర్కొనే ఈ త్రయం పరుగులను కట్టడి చేయటం అంత సులువైన పని కాదు. బంతితో ట్రెంట్ బౌల్ట్ అత్యంత ప్రమాదకారి. తను వికెట్లు తీయకపోయినా.. బ్యాట్స్మన్ను ఒత్తిడిలోకి నెట్టగలడు. సహచర సీమర్లకు వికెట్ల వేటలో మార్గం సుగమం చేయటంలో దిట్ట. బౌల్ట్కు కొత్త మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్ తోడయ్యారు. మిచెల్ శాంట్నర్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
పిచ్ రిపోర్టు : ప్రపంచకప్లో ఇక్కడ ఇది నాల్గో మ్యాచ్. భారత్, కివీస్ సమరానికి పూర్తిగా కొత్త పిచ్ సిద్ధం చేశారు. బౌండరీ సైజు చిన్నవి కావటం, పేసర్లకు పిచ్ అనుకూలమైనా పరుగుల వరద పారుతోంది. అందుకే, ఏ జట్టైనా ఇక్కడ ఛేదనకే మొగ్గు చూపుతుంది. వర్ష సూచనలున్న మ్యాచ్లో టాస్ సైతం కీలకం.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తీక్/విజరు శంకర్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, కానె విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, కొలిన్ డీ గ్రాండ్హౌమె, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్.
వరుణుడు వస్తాడా?
2019 ప్రపంచకప్లో 11వ జట్టుగా వరుణుడు రంగ ప్రవేశం చేసినట్టు మ్యాచ్ ఫలితాలను చూస్తే తెలిసిపోతుంది. భారత్ ఆడిన రెండు మ్యాచుల వైపు చూడని వరుణుడు న్యూజిలాండ్తో సమరానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. వాతావరణ శాఖ సైతం నేడు కనీసం 50 శాతం వర్షం ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది. బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా స్టేడియం మేఘావృతమై కనిపించింది. వర్షం ముప్పుతో పిచ్పై కవర్లు అలాగే ఉంచారు. వరుణుడు వచ్చినా.. కనీసం 20 ఓవర్ల సాధ్యమయ్యే అవకాశం ఉంది. భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ప్రసారదారులు, ప్రకటనదారులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఐసీసీకి సింహాభాగం ఆదాయం భారత్ మ్యాచుల ద్వారా వస్తున్నదే. అందుకే భారత్ మ్యాచ్కు వరుణుడు రావొద్దని అభిమానులతో పాటు మార్కెట్, కార్పోరేట్ వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి.