Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటన్లో జరిగే టోర్నీలు ప్రతిష్టాత్మకం. బ్రిటన్ ఆటగాళ్లు సాధించే విజయాలు చరిత్ర. బ్రిటన్ స్టేడియాలు ప్రతి ఆటగాడు ఆడాలనే కోరుకునే వేదికలు. ఇదీ బ్రిటన్ మీడియా ఇన్నేండ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకున్న తీరు. క్రికెట్ మైదానాల నిర్వహణలో ఇంగ్లాండ్ ఎంతో వెనుకబాటులో ఉందని తాజా ప్రపంచకప్ నిరూపించింది. స్టేడియాల రూపకల్పనలోనే పది వేదికలకు మరో దానితో పోలిక ఉండదు. గంట పాటు వర్షం కురిసినా.. అవుట్ ఫీల్డ్ ప్రమాదకరంగా తయారవుతుంది. ఇవే లోపాలు భారత్లో జరిగితే ఇంగ్లీష్ మీడియా దీనిపై పతాక శీర్షికలు పెడుతుందనటంలో సందేహం లేదు.భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ సమయానికి వర్షం లేదు. రాత్రి కురిసిన వర్షంతో అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిచిపోయింది. దీంతో టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత వరుణుడు ప్రవేశించటం, విరామం ఇవ్వటం ఈ సమయంలో మైదానం మరింత ప్రమాదకరంగా తయారవటం జరిగిపోయాయి. వర్షం నీటిని నాటింగ్హామ్ మైదాన సిబ్బంది సూపర్ సోపర్స్తో కాకుండా, సాధారణ పద్దతిలో తోడుతుండటం అందరం చూశాం. అవసరమైన స్థాయిలో మైదాన సిబ్బంది లేకపోవటం సైతం దెబ్బకొట్టింది. స్టేడియాల డ్రైనేజి నిర్వహణలో శ్రీలంక అన్ని దేశాల కంటే ముందుంది. తరచుగా వర్షం కురిసే లంకలో.. ఇటీవల కాలంలో రద్దయిన మ్యాచులే లేవు. కనీసం 100 మంది సిబ్బంది అవుట్ ఫీల్డ్ను సిద్ధం చేయటం చూస్తుంటాం. అత్యంత వేగంగా మైదానాన్ని సిద్ధం చేయటంలో శ్రీలంకకు ఎవ్వరూ సాటిలేరు. ఇక అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థతో బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం క్రికెట్ స్టేడియాల నిర్వహణలో కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. సమారు రూ. 4.5 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ సబ్ ఎయిర్ డ్రైనేజి వ్యవస్థను ఇక్కడ నెలకొల్పారు. కేవలం నిమిషం వ్యవధిలో పది వేల లీటర్ల నీటిని తోడేస్తారు. వర్షం ముగిసిన నిమిషం లోపలే మైదానం ఆటకు సిద్ధంగా ఉంటుంది. అన్నింటిలో ప్రామాణికం మేమే అని చెప్పుకునే ఇంగ్లాండ్.. స్టేడియాల నిర్వహణలోనూ ప్రామాణికంగా నిలుస్తుంది. కానీ ఈ రికార్డు అత్యంత చెత్త నిర్వహణలో కావటం గమనార్హం.