Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాంచెస్టర్లో భారత్, పాక్ క్రికెట్ పోరే
- ఇండో పాక్ యుద్ధం కాదు
- శ్రీనివాస్ దాస్ మంతటి
ప్రపంచకప్లో పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే ఊహకందని మద్దతు. 2011 ప్రపంచకప్ విజయానికి ముందే భారత అభిమానులు వీధుల్లోకి వచ్చారు. మొహాలీలో పాకిస్థాన్పై విజయాన్ని గొప్ప పండుగగా గడిపారు. కానీ 2003 ప్రపంచకప్ సెమీఫైనల్స్ విజయం తర్వాత ఇటువంటి దృశ్యాలేమీ భారత్లో కనిపించలేదు. ఈ అభిమానం భారత క్రికెట్ జట్టు విజయం కోసమా? పాకిస్థాన్పై విపరీత యుద్ధోన్మాదమా? ఈ సమయంలో మీడియా సైతం తన వంతు పాత్ర పోషిస్తోంది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తత, భావోద్వేగాలు పెంచేందుకు అవసరానికి మించి ఇంధనం అందిస్తోంది. అది ఏ స్థాయిలో ఉందంటే, ప్రపంచకప్లో పాకిస్థాన్పై నెగ్గటం తప్ప భారత్కు మరో ఆప్షన్ లేదు. ఇది పూర్తిగా క్రికెట్. ఇక్కడ ఎవరైనా విజయం సాధించవచ్చు. నైపుణ్యంతో ఎవరు మెరుగ్గా ఆడతారో, వ్యూహలు ఎవరు మెరుగ్గా అమలు చేస్తారో, ఒత్తిడిని ఎవరు అధిగమిస్తారో వారినే విజయం వరిస్తుంది.
19వ దశకం తొలినాళ్లలో భారతదేశం బ్రిటీష్ పాలనలో ఉండగా, క్రికెట్ ఇక్కడ పాపులర్ క్రీడగా మారింది. అప్పట్లో ఓ వార్షిక టోర్నీ జరిగేది. హిందువులు, ముస్లింలు, పారసీలు, బ్రిటీష్ జట్లు టోర్నీలో పాల్గొనేవి. ఆరంభంలో ఈ మ్యాచులు క్రీడా స్ఫూర్తితోనే జరిగేవి. ఎప్పుడైతే స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకున్నదో.. క్రికెట్ మ్యాచుల్లో రంగులు కనిపించటం మొదలైంది. క్రికెట్లో బ్రిటీష్ జట్టు ప్రతి ఓటమిని పరాయి పాలకులపై జాతి విజయంగా చూసేవారు. దేశ ప్రజలు ఉనికి కోసం ఉద్యమం చేస్తున్న తరుణంలో సహజంగానే భావోద్వేగాలు ఉబికి వచ్చేవి. క్రికెట్ను ఆస్వాదించారు కాబట్టి ఆటను సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ వారితోనే వదిలేయలేదు. అందుకు ఆటపై పెంచుకున్న ఇష్టమే కారణం.
స్వాతంత్య్రానంతరం రెండు దేశాల్లో ఇదే పోకడ కొనసాగింది. క్రికెట్ సెంటిమెంట్లో మార్పు రాలేదు. ఆధిపత్యం చూపించుకునేందుకు ఆట ఆయుధంగా మారింది. ఇన్నేండ్లలో రెండు దేశాల సంబంధాలు రుచికరంగా లేవు. యుద్దాలు చేసుకున్నాం, ఇంకా ఎన్నో సమస్యలపై పోరాడుకుంటున్నాం. రెండు దేశాల నడుమ సాంస్కృతిక సంబంధాలు, ప్రజల స్నేహబంధాలతో వైరం కాస్త తగ్గుతూ వస్తోంది. ప్రధానంగా రాజకీయ వైరమే ఇప్పుడు మిగిలింది!. ఈ క్రమంలో భారత్ ఓ బాధ్యతాయుత దేశంగా ఎదిగింది. దురదృష్టశావత్తూ, ఓ క్రికెట్ మ్యాచ్ భావోద్వేగాలు భారతీయులను మరో 100 ఏండ్లు వెనక్కి తీసుకెళ్తుందా? అనుమానం కలుగుతోంది.
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ప్రాధాన్యతను అర్ధం చేసుకోగలం. ప్రతిసారీ పాకిస్థాన్పై నెగ్గాలనే కోరుకుంటున్నాం. కానీ ప్రతి మ్యాచ్లో ఇది సాధ్యం కాదనే వాస్తవాన్ని ఎందుకు అంగీకరించటం లేదు. వంద కోట్ల ప్రజల అభిలాషను మోస్తున్న జట్టు, ఆశలను వమ్ము చేయకూడదని కోరుకోవటంలో తప్పు లేదు. ఆటగాళ్లు సైతం మానవ మాత్రులే. ఒకవేళ పాకిస్థాన్తో మ్యాచ్ ఓడిపోతే? ఆటగాళ్ల దిష్టి బొమ్మలు దహనం చేస్తారా? ఆటగాళ్ల ఇండ్లపై దాడులు చేస్తారా? ఆటగాళ్ల కుటుంబాలు క్షేమంగా ఉండగలవా? కేవలం ఓ క్రికెట్ మ్యాచ్లో ఓడితే, దేశమంత అట్టుడికిపోవాలా?. ఆటగాళ్లను అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో, తిరిగి అభిమానులను సైతం క్రికెటర్లు ప్రేమిస్తారు. కానీ ప్రతిసారీ అంచనాలను అందుకోలేకపోవచ్చు. 2003 ప్రపంచకప్ ఓటమి తర్వాత స్వదేశంలో రేగిన చేదు ఘటనలు ఇంకా మరిచిపోలేము. తొలిసారి క్రికెటర్ల ఇండ్లు, కుటుంబాలు క్షేమం కాదనే భావన ఆటగాళ్లలో కలిగించిన సంఘటన అది.
పాకిస్థాన్తో ఆడిన ప్రతిసారీ అభిమానుల ప్రవర్తనలో విపరీతం కనిపిస్తోంది. నిజంగానే పాకిస్థాన్ను ప్రజలు ఇంతగా ద్వేషిస్తే ఆ జట్టుతో క్రికెట్ సంబంధాలు తెంచుకోవటమే మేలు. ఓ దేశంపై ఆధిపత్యం నిరూపించుకునేందుకు క్రికెట్ మ్యాచ్లో విజయం ఎప్పటికీ గీటురాయి కాకూడదు. పాకిస్థాన్తో మ్యాచ్ను సైతం మరో క్రికెట్ పోరుగానే చూద్దాం. భారత ఆటగాళ్ల ప్రదర్శనను ఆస్వాదిద్దాం. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మాదిరిగానే పాక్తోనూ భారత్ మరో మ్యాచ్లో ఆడుతోంది. విజయం సాధిస్తే, అదే తరహాలో సంతోషిద్దాం. బాధ్యతాయుత అభిమానులుగా ప్రవర్తిద్దాం. భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్రదర్శనలను ఆస్వాదిద్దాం.