Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాకిస్థాన్ మెగా మ్యాచ్ నేడే
- హాట్ ఫేవరెట్ టీమ్ ఇండియా
- బోణీ విజయంపై పాక్ గురి
క్రికెట్ ప్రపంచం చూపు మాంచెస్టర్ వైపు. అక్కడేమీ ప్రపంచకప్ ఫైనల్స్ జరుగటం లేదు. ఈ దశాబ్దపు క్రికెట్ పోటీ నిర్వహించటం లేదు. అయినా, రెండు దేశాల ప్రజలు.. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. తొలి బంతి నుంచే మ్యాచ్లో పడిపోవాలని తపన పడుతున్నారు. నేడు భారత్, పాకిస్థాన్ వరల్డ్కప్ మ్యాచ్.
ప్రపంచకప్లో పాక్పై ఆరు విజయాలతో భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అనిశ్చితి పాకిస్థాన్ ఎప్పుడెలా రాణిస్తుందో ఎవరూ చెప్పలేరు. నేడు మాంచెస్టర్లో భారత్ ఏడో విజయమా? పాకిస్థాన్ బోణీ సంబురమా? క్రికెట్ పోరు తేల్చనుంది.
మాంచెస్టర్: పొరుగు దేశాలు ప్రపంచకప్ పోటీకి సిద్ధమయ్యాయి. టైటిల్ ఫేవరెట్ భారత్, సర్ప్రైజ్ ఫేవరెట్ పాకిస్థాన్ ప్రపంచకప్ చరిత్రలో ఏడోసారి ముఖాముఖి సమరానికి సై అంటున్నాయి. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్ మెడలు వంచిన పాకిస్థాన్, గత మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియానూ ఓడించినంత పని చేసింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. హ్యాట్రిక్ మ్యాచ్ను వర్షం కారణంగా ఆడలేకపోయింది. అచ్చొచ్చిన ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయంతోనే వరల్డ్కప్లో హ్యాట్రిక్ కొట్టాలని కోహ్లిసేన భావిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జశ్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య భారత్కు కీలకం. ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్, మొహమ్మద్ ఆమీర్, మహ్మద్ హఫీజ్లు పాకిస్థాన్కు కీలకం. 2019 ప్రపంచకప్లోనే అత్యంత ఆదరణ కలిగిన మ్యాచ్లో ఇరు జట్ల స్థితిగతులు ఏంటో చూద్దాం.
టాప్ ఆర్డర్ :
భారత్ : ఐసీసీ టోర్నీల హీరో శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోవటం భారత్కు తీరని లోటు. కెఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో ఎదురుదాడి చేయటం, కఠిన పరిస్థితుల్లో యాంకర్ రోల్ పోషించటం రాహుల్కు తెలుసు. హిట్మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. చిన్న బౌండరీల మైదానం కావటంతో రాహుల్కు ఇది మంచి అవకాశం. రోహిత్ శర్మ పాక్పై 92, 52, 111 స్కోర్లు చేశాడు. ఆసియా కప్లో పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మహ్మద్ ఆమీర్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మూడో బంతికే ఎల్బీగా అవుట్ చేసినా.. రోహిత్ తర్వాత కాలంలో పుంజుకున్నాడు. ప్రపంచకప్లో వరుసగా 122, 57 పరుగులు చేసిన రోహిత్ ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లి పరుగుల యంత్రం. పాక్పైనా అతడి పరుగుల దాహం కొనసాగనుంది. మహ్మద్ ఆమీర్పై దూకుడుగా ఆడాలనే వ్యూహం కంటే.. అంతిమంగా పైచేయి సాధించాలనే వ్యూహంతో కోహ్లి ఆడనున్నాడు. రోహిత్, రాహుల్, విరాట్లతో భారత్ టాప్-3 పటిష్టంగా ఉంది. ఆరంభంలో ఏ ఇద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పినా భారీ స్కోరు ఖాయం.
పాకిస్థాన్ : ఫకర్ జమాన్.. చాంపియన్స్ ట్రోఫీ 2017ను భారత్కు దూరం చేసిన బ్యాట్స్మన్. ఆ తర్వాతి కాలంలో ఫకర్ అదే జోరు కొనసాగించాడు. ఫకర్ జమాన్ రాణించిన మ్యాచుల్లో పాక్ గెలుపు శాతం ఎక్కువ. ఇమామ్ ఉల్ హాక్ అంత ప్రమాదకర బ్యాట్స్మన్ కాదు. కానీ వికెట్లు పడినప్పుడు కీలక భాగస్వామ్యాలు నిర్మించటంలో దిట్ట. ఓ ఎండ్లో ఫకర్ రెచ్చిపోతే, మరో ఎండ్లో అద్భుతమైన యాంకర్ రోల్ పోషిస్తాడు. నిలకడగా పరుగులు సాధించే బాబర్ ఆజామ్ టాప్ ఆర్డర్లో కీలక బ్యాట్స్మన్. పేస్, స్పిన్ను అలవోకగా ఎదుర్కొగలడు. కచ్చితమైన లెంగ్త్తో బంతులు, సరైన ప్రదేశాల్లో ఫీల్డర్లను మొహరిస్తేనే బాబర్ దొరుకుతాడు. వికెట్ వదులుకునేందుకు ఇష్టపడని బాబర్ పాకిస్థాన్కు ఇప్పుడు ఓ విరాట్ కోహ్లి వంటి వాడు!. ఫకర్ జమాన్ ప్రపంచకప్లో మెరుగైన స్కోర్లు చేయలేదు. కానీ అతడి షాట్ల ఎంపికలో మార్పు చేసుకుంటే, ప్రమాదకర ఆటగాడు.
మిడిల్ ఆర్డర్ :
భారత్ : కెఎల్ రాహుల్ నం.4లో ఉండగా మిడిల్ ఆర్డర్ మెరుగ్గా కనిపించింది. ఇప్పుడు ఆ స్థానంలో విజరు శంకర్/ దినేశ్ కార్తీక్ ఆడనున్నారు. ప్రాక్టీస్ సెషన్లో శంకర్ ప్రాధాన్యత దృష్ట్యా అతడు నేడు పాకిస్థాన్పై ప్రపంచకప్ అరంగ్రేటం చేసే అవకాశం కనిపిస్తోంది. విజరు శంకర్ నాణ్యమైన ఆటగాడే, కానీ మెగా మ్యాచుల్లో నిరూపించుకోలేదు. సుదీర్ఘ భాగస్వామ్యాలు నిర్మించటంలో అనుభవం లేదు. ప్రపంచకప్ ప్రేరణ అతడి అత్యుత్తమ ఆటను బయటకు తీసే అవకాశం లేకపోలేదు. ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యలు బిగ్ హిట్టర్లు. 1-4 బ్యాట్స్మన్ 35 ఓవర్ల ఆట చూసుకుని.. మిగతా 15 ఓవర్లు వీరికి వదిలేస్తే ఆ మజా వేరు. ధోని, జాదవ్, పాండ్య తొలి బంతి నుంచే బౌండరీ లైన్పై దాడి చేయగల సమర్థులు. భారీ ఛేదనలోనూ వీరి విధ్వంసం నిలువరించటం ప్రత్యర్థికి కఠిన సవాల్.
పాకిస్థాన్ : పాకిస్థాన్కు నం.4 స్థానంలో మహ్మద్ హఫీజ్ రూపంలో విలువైన ఆటగాడు ఉన్నాడు. దూకుడు ఆడటంతో పాటు, ప్రశాంతంగా బౌలర్లను ఎదుర్కొవటం తెలుసు. టాప్ ఆర్డర్ విఫలమైతే పాక్కు ఇతడే కీలకమవుతాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. ఆసీస్తో మ్యాచ్లోనూ టెయిలెండర్లు రెచ్చిపోతుండగా, తను యాంకర్ రోల్కు పరిమితం అయ్యాడు. వికెట్ల పతనాన్ని నిలువరించటంలో సర్ఫరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. భారీ ఛేదనల్లో సర్ఫరాజ్పె పాక్ నమ్మకం ఉంచలేదు. హరీశ్ షోయల్, షోయబ్ మాలిక్లకు భారత్పై మంచి రికార్డుంది. బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వస్తున్న మాలిక్, నేడు ప్రమోషన్ లభించే అవకాశం కొట్టిపారేయలేం.
పేస్ విభాగం :
భారత్ : జశ్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ పేస్ ద్వయం భారత బౌలింగ్ను బలోపేతం చేసింది. గతంలో ప్రపంచకప్కు బయల్దేరినప్పుడు భారత బలహీనతగా పేస్ విభాగాన్ని చూపేవారు. ఇప్పుడు భారత్ ప్రధాన బలం పేస్ విభాగం. అందుకు కారణం బుమ్రా, భువి మెరుపులే. పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో ఈ జోడీ కండ్లుచెదిరే బంతులు వేస్తుంది. నకుల్ బాల్స్తో భువి విరుచుకుపడగా, బుమ్రా అంచనాలకు అందడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వికెట్లు పడగొట్టని బుమ్రా.. నేడు పాక్పై ప్రతాపం చూపించేందుకు ఎదురు చూస్తున్నాడు. తెలివిగా బోల్తా కొట్టించే భువనేశ్వర్ కుమార్, బ్యాట్తోనూ విలువైన ఆటగాడు. హార్దిక్ పాండ్య బంతితోనూ పూర్తి సేవలు అందిస్తున్నాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేసి.. కెప్టెన్ పని తేలిక చేస్తున్నాడు. పాండ్య ఓవర్లతో.. బుమ్రా, భువిలను డెత్ ఓవర్ల కోసం కోహ్లి నిలుపుకుంటున్నాడు.
పాకిస్థాన్ : హఠాత్తుగా ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన మొహమ్మద్ ఆమీర్, వహబ్ రియాజ్ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నారు. పునరాగమనంలో ఆమీర్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. భారత్పై మ్యాచ్లో రెట్టించిన ఉత్సాహంతో బంతులేసే ఆమీర్ ప్రధానంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపై తన అస్త్రాలు ప్రయోగించనున్నాడు. సీనియర్ సీమర్ రియాజ్ బౌన్సర్లతో ఎంతటి బ్యాట్స్మెన్నైనా ఇబ్బందికి గురి చేయగలడు. రియాజ్ ఇప్పుడు బ్యాట్తో పించ్ హిట్టర్ స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఆసీస్పై మ్యాచ్లో పాక్లో గెలుపు ఆశలు రేకెత్తించాడు. షాహీన్ ఆఫ్రిదీ స్లో మీడియంతో వికెట్ల వేటలో ముందుంటున్నాడు. ఆమీర్ను వదిలేసే బ్యాట్స్మెన్.. ఇతడిపై పరుగులు సాధించాలనే తపనతో వికెట్ కోల్పోతున్నారు.
స్పిన్ విభాగం :
భారత్ : చాంపియన్స్ ట్రోఫీ అనంతరం మణికట్టు స్పిన్నర్లను పరిమిత ఓవర్ల క్రికెట్లోకి తీసుకొచ్చిన భారత్, ప్రపంచకప్కూ అదే వ్యూహంతో వచ్చింది. చైనామన్ కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్ జోడీ మిడిల్ ఓవర్లలో గొప్ప ప్రభావం చూపుతున్నారు. ఓ ఎండ్లో ఒకరు ఒత్తిడి పెంచుతుండగా, మరో ఎండ్లో ఒకరు వికెట్లపై గురి పెడుతున్నారు. వికెట్ కీపర్ ధోని చిట్కాలతో వీరి పని మరింత మెరుగవుతుంది. విలక్షణ బౌలింగ్ శైలితో కేదార్ జాదవ్ ఎప్పుడూ ఎక్స్ ఫ్యాక్టరే. విలక్షణ బౌలింగ్ శైలికి ఇబ్బంది పడే తత్వం పాక్ బ్యాటింగ్ లైనప్లో కనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్లో కేదార్ జాదవ్ ముందుగా బంతి అందుకునే అవకాశం ఉంది.
పాకిస్థాన్ : షాదాబ్ ఖాన్ రూపంలో పాకిస్థాన్కు ప్రతిభావంతుడైన స్పిన్నర్ ఉన్నాడు. కెఎల్ రాహుల్ను కట్టడి చేసేందుకు షాదాబ్ను పవర్ ప్లేలోనే ప్రయోగించేందుకు పాక్ సిద్ధపడుతోంది. పిన్న వయసులోనే మూడు ఫార్మాట్లలో అరంగ్రేటం చేసిన షాదాబ్.. 20 ఏండ్లకే తొలి ప్రపంచకప్ ఆడుతున్నాడు. షాదాబ్ ఖాన్ లెగ్ బ్రేక్ పాక్ కీలకం. షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఫీల్డింగ్ :
భారత్ : ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కోహ్లిసేన, ఫీల్డింగ్లో నూతన ప్రమాణాలు నెలకొల్పింది. గతంలో ఫీల్డింగ్ భారత బలహీనతగా ఉండేది. జట్టులో అందరూ కుర్రాళ్లు కావటం, ప్రామాణిక ఫిట్నెస్ కల్గి ఉండటం పరుగుల పొదుపుకు దోహదం చేస్తుంది. బౌలర్లు గాయాల భయం లేకుండా డైవ్స్తో ఆకట్టుకుంటున్నారు. స్లిప్ క్యాచింగ్, బౌండరీ లైన్ క్యాచింగ్లోనూ కోహ్లిసేన మెరుగ్గా ఉంది. కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లిలు మైదానంలో చిరుతల్లా కదులుతారు. ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ రనౌట్ భారత ఫీల్డింగ్ ప్రమాణాలకు నిదర్శనం.
పాకిస్థాన్ : ప్రపంచకప్లో అత్యంత చెత్త ఫీల్డింగ్ జట్ల పోటీలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో పాక్ ఫీల్డర్లు లెక్క లేనన్ని తప్పిదాలు చేశారు. డెవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ క్యాచులు వదిలేశారు. బద్దకమైన కదలికలతో రనౌట్ అవకాశాలను చేజార్చుకున్నారు. ఒత్తిడితో కూడిన మ్యాచ్లో పాక్ ఫీల్డింగ్ మెరుగుపడకపోతే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
పిచ్ రిపోర్టు : ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ ఫ్లాట్గా కనిపిస్తోంది. పిచ్పై ఎటువంటి పచ్చిక లేదు. పచ్చిక లేకపోవటంతో ఇది భారీ స్కోర్ల వికెట్. రెండో ఇన్నింగ్స్కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. 1996 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో మాంచెస్టర్లోనే పాకిస్థాన్పై భారత్ గెలుపొందింది. భారత్, పాక్లు మాంచెస్టర్లో ఆడనుండటం ఇది రెండోసారి మాత్రమే.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, విజరు శంకర్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ : ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, హరీశ్ సోహైల్, షోయబ్ మాలిక్, షాదాబ్ ఖాన్, వహబ్ రియాజ్, మొహమ్మద్ ఆమీర్, షాహీన్ అఫ్రిది.
పరుగులు తక్కువ.. ఒత్తిడి ఎక్కువ
భారత్, పాకిస్థాన్ వన్డేల్లో భారీ స్కోర్లను చూశాం. కానీ ప్రపంచకప్లో ఈ రెండు జట్లు తలపడితే పరుగుల వరద తక్కువ, విపరీత ఒత్తిడి ఎక్కువ. గత ఆరు వరల్డ్కప్ మ్యాచుల్లో కేవలం ఒక్క ఇన్నింగ్స్లోనే 300 పరుగులు నమోదయ్యాయి. 12 ఇన్నింగ్స్ల్లో కలిపి రెండు సెంచరీలు మాత్రమే సాధించారు. 2015 గ్రూప్ దశ మ్యాచ్లో భారత్ 300/7 పరుగులు చేసింది. ఇదే భారత్, పాక్ ప్రపంచకప్ పోటీల్లో అత్యధిక స్కోరు. పాక్ తరఫున సయిద్ అన్వర్ (101), భారత్ తరఫున విరాట్ కోహ్లి (107) శతకాలు సాధించారు. 2003 ప్రపంచకప్లో వసీం అక్రమ్, వకార్ యూనీస్, షోయబ్ అక్తర్ పేస్ త్రయంపై సచిన్ టెండూల్కర్ (98) ఇన్నింగ్స్ దాయాదుల వరల్డ్కప్ చరిత్రలో టాప్ ఇన్నింగ్స్. నేడు మాంచెస్టర్లో పరుగుల పిచ్ లభించినా.. 280-320 స్కోరు నమోదయ్యే అవకాశమే ఉంది. ఓవరాల్గా ఐదు మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ 78.25 సగటుతో 313 పరుగులు చేసి బ్యాట్స్మెన్ జాబితాలో ముందున్నాడు. రెండు మ్యాచుల్లో 8 వికెట్లతో వెంకటేశ్ ప్రసాద్ బౌలర్ల జాబితాలో ముందున్నాడు. బెంగళూర్ క్వార్టర్ఫైనల్లో ప్రసాద్ 5/27 ప్రదర్శన పాక్పై ప్రపంచకప్లో భారత్కు అత్యుత్తమం.
400000 : 2019 భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఐసీసీకి 4 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అతిపెద్ద స్టేడియం మెల్బోర్న్ ( ఒక లక్ష సీట్లు) సామర్థ్యం కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.
73000 : భారత్, పాకిస్థాన్ వరల్డ్కప్ మ్యాచ్ కనీస టికెట్ ధర రూ. 73 వేలు. గరిష్ట ధర రూ. 12-15 లక్షల్లో ఉంది. ఈ ప్రపంచకప్లో ఫైనల్స్ కంటే ఈ మ్యాచ్ టికెట్ ధరలే అధికం.
11 మంది బాధ్యత పంచుకుంటారు. వాతావరణం ఎవరి చేతుల్లో లేదు. ఓవర్లు కుదించిన మ్యాచ్కు సైతం మానసికంగా సిద్ధమై ఉంటాం. క్రికెట్ మ్యాచ్ ఓ నిర్దిష్ట సమయంలో మొదలై, ముగుస్తుంది. గెలుపైనా, ఓటమైనా ఇదేమీ జీవితకాల పోరు కాదు. నేడు మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఇక్కడితోనే ఏమీ ముగియదు. టోర్నీ ఇంకా ఎంతో ఉంది. ఏ ఆటగాడు అధిక ఒత్తిడి తీసుకోడు. టీఆర్పీల కోసం మేమేమీ మాట్లాడను. అభిమానులకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. ఇది ప్రొఫెషనల్ గేమ్. విపరీత భావోద్వేగాలకు గురి కావద్దు'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్