Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శతకబాదిన రోహిత్ శర్మ
- విరాట్, రాహుల్ మెరుపులు
- కుల్దీప్, విజయ్, పాండ్య మ్యాజిక్
- పాక్పై భారత్ ఏకపక్ష విజయం
మాంచెస్టర్ : ప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత్ ఏడుపించింది!. ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఆ జట్టుపై ఏడోసారి ఏకపక్ష విజయం నమోదు చేసింది. వరల్డ్కప్కు వన్నె తీసుకొచ్చిన భారత్, పాకిస్థాన్ దాయాదీ మ్యాచ్లో మరోసారి మూడు రంగుల జెండా రెపరెపలాడింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (140, 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (77, 65 బంతుల్లో 7 ఫోర్లు), కెఎల్ రాహుల్ (57, 78 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. భారత టాప్-3 బ్యాట్స్మెన్ సూపర్ ప్రదర్శనతో తొలుత కోహ్లిసేన 336/5 పరుగుల భారీ స్కోరు చేసింది. చైనామన్ కుల్దీప్ యాదవ్ (2/32), సీమర్లు విజయ్ శంకర్ (2/22), హార్దిక్ పాండ్య (2/44) వికెట్ల మ్యాజిక్తో పాకిస్థాన్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 40 ఓవర్లకు 302 పరుగులకు కుదించిన ఛేదనలో పాకిస్థాన్ 212/6 పరుగులకే పరిమితం అయ్యింది. పాకిస్థాన్పై 1992 ప్రపంచకప్లో మొదలైన భారత్ ఆధిపత్యం 2019 వరకూ కొనసాగుతూనే ఉంది. 1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్ ముఖాముఖిలో పాకిస్థాన్పై భారత్ ఏకపక్ష విజయాలు సాధించింది. 2019 ప్రపంచకప్లో కోహ్లిసేనకు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది.