Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసాల జారీకి ప్రభుత్వం హామీ
న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన అథ్లెట్లు అందరికీ ప్రాతినిథ్య వహించే అవకాశం కల్పిస్తామని భారత ప్రభుత్వం మంగళవారం హామీ ఇచ్చింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరెందర్ బత్రాకు లిఖిత పూర్వక హామీ ఇస్తూ లేఖ రాసింది. ' భారత్లో క్రీడల అభివృద్ది పట్ల, అంతర్జాతీయ క్రీడా పోటీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుంది. వసుదైక కుటుంబ భావనతో అంతర్జాతీయ క్రీడా పోటీలకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ ఒలింపిక్ సంఘాల అథ్లెట్లకు భారత్లో ప్రవేశం కల్పిస్తామని' కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి రాధేశ్యామ్ జులానియా లేఖలో తెలిపింది. గత డిసెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్కు ఇద్దరు పాకిస్థాన్ షూటర్లకు భారత్ వీసాలు జారీ చేయలేదు. దీంతో ఆ ఈవెంట్లో ఒలింపిక్ బెర్త్ల కోటా తగ్గించిన ఒలింపిక్స్ కౌన్సిల్, ప్రభుత్వ హామీ లేనిదే భవిష్యత్లో భారత్లో టోర్నీలు నిర్వహించమని చెప్పింది. తాజాగా భారత ప్రభుత్వ హామీతో పాకిస్థాన్ అథ్లెట్లు సైతం ఇక్కడి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.