Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జోరు
45 మ్యాచుల ప్రపంచకప్లో 24 మ్యాచులు ముగిశాయి. మెగా టోర్నీ ప్రథమార్థం ముగిసింది. గ్రూప్ దశలో టాప్-4లో నిలిచే జట్లపై అప్పుడే ఓ స్పష్టత ఏర్పడింది. విండీస్పై బంపర్ విజయంతో బంగ్లాదేశ్ సెమీస్ రేసులో ఉన్నానని దూసుకొచ్చింది. గ్రూప్ దశ చివర్లో అగ్ర జట్ల ముఖాముఖి ఫలితాలు టాప్-4 స్థానాలను నిర్ణయించనున్నాయి.
నవతెలంగాణ క్రీడా విభాగం
2019 ప్రపంచకప్లో ఆశ్చర్యకర ఫలితాలకు అభిమానులు సిద్ధమయ్యారు. కానీ ఇంగ్లాండ్ వేసవిలో అటువంటి పరిస్థితి కనిపించటం లేదు. అంచనాల మేరకు టాప్-4 రేసులో ముందున్న జట్లే సెమీఫైనల్స్కు దూసుకెళ్తున్నాయి. దిగ్గజ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ లేకపోయినా దక్షిణాఫ్రికా సెమీస్ రేసులో ఫేవరెట్గా నిలిచింది. కానీ ప్రథమార్థం ముగింపు ఆ జట్టు సెమీస్ ఆశలకూ తెరదించింది!. నిలకడగా విజయాలు సాధించిన న్యూజిలాండ్ టాప్-4లో చోటు పదిలం చేసుకునే పనిలో నిమగమైంది. టైటిల్ ఫేవరెట్లు ఇంగ్లాండ్, భారత్ సహజంగానే పాయింట్ల పట్టికలో ముందంజలో కొనసాగుతున్నాయి. ప్రపంచకప్లో సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఈ దశలో సెమీఫైనల్స్ రేసులో ఏ జట్టు అవకాశాలు ఏమిటో చూద్దాం.
భారత్ : ఒకే సవాల్ :
గ్రూప్ దశ ఆరంభంలోనే కోహ్లిసేన అగ్రజట్లను ఢీ కొట్టింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్లతో కీలక మ్యాచులు ఆడేసింది. ఓ మ్యాచ్ రద్దు కాగా, మూడు విజయాలు నమోదు చేసింది. గ్రూప్ మ్యాచుల్లో కోహ్లిసేనకు ఒకే ఒక సవాల్ ఎదురుచూస్తోంది. మరో ఫేవరెట్, ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్తో జూన్ 30న ఆడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లిసేన పైచేయి సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఖాయం చేసుకుంటుంది. జూన్ 22న అఫ్గనిస్థాన్, 27న వెస్టిండీస్, జులై 2న బంగ్లాదేశ్, జులై 6న శ్రీలంక మ్యాచులు కోహ్లిసేన సామర్థ్యానికి ఎంతమాత్రం పరీక్ష కాలేవు. నాలుగు మ్యాచుల్లో 7 పాయింట్లు సాధించిన కోహ్లిసేన.. ఇప్పుడు టాప్-4లో ఏ స్థానంలో నిలుస్తుందా? అనేది తేలాలి. సెమీఫైనల్స్కు కోహ్లిసేన అప్పుడే పూల బాట వేసుకుంది.
ఇంగ్లాండ్ : ముందు ముగ్గురున్నారు :
ఆతిథ్య జట్టు, టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్ ఘనమైన బోణీతో వేటను ఆరంభించింది. పాకిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమితో ఇంగ్లాండ్ శిబిరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. వరుస విజయాలతో ఇంగ్లాండ్ 8 పాయింట్లు సాధించింది. ఇంగ్లాండ్ గ్రూప్లో కఠిన ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్లను ఎదుర్కొవాల్సి ఉంది. టాప్-4లో నిలిచే మరో మూడు జట్లతో ఇంగ్లాండ్ ఇంకా పోటీపడలేదు. ఈ మూడు మ్యాచులు ఇంగ్లాండ్కు కఠిన సవాల్. ఎంత ఫేవరెట్ అయినా, అగ్రజట్ల పోరులో ఫలితం ఎటైనా ఉండవచ్చు. చివరి నాలుగు మ్యాచుల్లో శ్రీలంకతో మ్యాచ్ మాత్రమే ఇంగ్లాండ్ తేలిగ్గా తీసుకోగలదు. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచుల్లో ఫలితాలు అనూహ్యంగా ఎదురైతే.. టాప్-4 స్థానం ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది.
ఆస్ట్రేలియా : అన్నీ కీలక మ్యాచులే :
డిఫెండింగ్ చాంపియన్ ఐదు మ్యాచులు ఆడేసింది. ఒక ఓటమి, నాలుగు విజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. గ్రూప్ దశలో ఆసీస్ మరో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. వరుసగా బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్లతో ఆస్ట్రేలియా తలపడనుంది. చివరి గ్రూప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఎదురు కానుంది. బంగ్లాదేశ్ కొత్తగా కనిపిస్తోంది. వెస్టిండీస్పై రికార్డు ఛేదనను ఊదేసింది. దీంతో ఆస్ట్రేలియాకు మిగిలిన నాలుగు మ్యాచులు కీలకమే. సెమీస్ రేసులో ఆశలు కోల్పోయిన దక్షిణాఫ్రికా వెళ్తూ వెళ్తూ ఇతరుల అవకాశాలను దెబ్బకొట్టేందుకు చూస్తుంది. ఆ కోణంలో ఆస్ట్రేలియాకే పెను ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సమతూకంతో కనిపిస్తున్నాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ ఫలితం ఆసీస్ భవితవ్యాన్ని తేల్చనుంది.
న్యూజిలాండ్ : ఎంత సులువో అంత కష్టం :
న్యూజిలాండ్ ఆరంభ మ్యాచుల్లో చిన్న జట్లను ఎదుర్కొంది. అగ్ర జట్టు భారత్తో మ్యాచ్ కాస్త వర్షంతో రద్దు అయ్యింది. దీంతో కివీస్కు ప్రపంచకప్లో సిసలైన పరీక్ష ఎదురు కాలేదు. అన్నింటా పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ టాప్-4లో ఫేవరెట్. కానీ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో కివీస్ ఆడాల్సి ఉంది. వీటిలో శ్రీలంక మ్యాచ్ను మినహాయిస్తే మిగతా నాలుగు మ్యాచుల్లో ఫలితాన్ని ఊహించలేం. నాలుగు మ్యాచుల్లో ఏడు పాయింట్లు సాధించిన న్యూజిలాండ్కు సెమీస్ బెర్త్ను ఖరారు చేసేది.. సఫారీ, పాక్, ఆసీస్, ఇంగ్లాండ్ మ్యాచులే. అగ్ర జట్ల మధ్య ముఖాముఖి ఫలితాలు టాప్-4లో ఎవరి స్థానం ఎక్కడ అనేది కూడా తేల్చనుంది.
బంగ్లాదేశ్ : స్ఫూర్తిదాయక పోరాటం :
2017 చాంపియన్స్ ట్రోఫీ చాంపియన్ పాకిస్థాన్, ఫేవరెట్ల జాబితాలోని దక్షిణాఫ్రికా, ఎవరినైనా ఓడించగల వెస్టిండీస్లతో సాధ్యమవని పని బంగ్లాదేశ్ చేసి చూపిస్తోంది. ఆరంభంలోనే బలమైన దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన బంగ్లాదేశ్.. తాజాగా వెస్టిండీస్నూ చిత్తుగా ఓడించింది. ఐదు మ్యాచుల్లో రెండు విజయాలతో బంగ్లాదేశ్ 5 పాయింట్లు సాధించింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆస్ట్రేలియా, భారత్లను మినహాయిస్తే.. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్లపై బంగ్లాదేశ్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా, భారత్లపై సత్తా చాటితే బంగ్లాదేశ్ సెమీఫైనల్స్కు చేరటం కష్టమేమీ కాదు. కానీ అదంత తేలికైన విషయం కాదు. అగ్ర జట్ల పోరులో ఏ జట్టు వరుస మ్యాచులు కోల్పోయినా.. అది బంగ్లాదేశ్కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే సెమీఫైనల్స్ రేసులో బంగ్లాదేశ్ తన పేరు నమోదు చేసుకుంది.
ఐదు జట్ల ఆశ నిరాశలు :
పాయింట్ల పట్టికలో దిగువ భాగంలో ఉన్న జట్లు అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక. అఫ్గనిస్థాన్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడింది. వరుసగా చివరి ఐదు మ్యాచుల్లో నెగ్గినా.. సెమీస్కు చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా ఐదు మ్యాచుల్లో మూడు పాయింట్లు సాధించింది. చివరి నాలుగు మ్యాచుల్లో వరుసగా న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో తలపడాలి. ఏ ఒక్క మ్యాచ్లో ఓడినా సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ ఐదు మ్యాచుల్లో ఒకటి గెలిచింది. ఓ మ్యాచ్ రద్దు కావటంతో మరో పాయింట్ సాధించింది. చివరి నాలుగు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్లను ఎదుర్కొవాలి. అఫ్గాన్, బంగ్లాలపై నెగ్గినా.. సఫారీ, కివీస్లపై ఏ ఒక్క మ్యాచ్లో ఓడినా సెమీస్ ఆశలు గల్లంతు. కచ్చితంగా సెమీఫైనల్స్కు చేరగల జట్లలో చాలా మంది వెస్టిండీస్ను చేర్చారు. కానీ ఐదు మ్యాచుల్లో విండీస్ బోణీ విజయానికే పరిమితమైంది. న్యూజిలాండ్, భారత్, శ్రీలంక, అఫ్గనిస్థాన్లపై వరుస విజయాలు సాధిస్తే తప్ప కరీబియన్లకు సెమీస్ అవకాశం లేదు. శ్రీలంక ఐదు మ్యాచుల్లో నాలుగు పాయింట్లు సాధించింది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ రూపంలో ఆ జట్టు వరుసగా అగ్రజట్లతో ఆడాల్సి ఉంది. ప్రస్తుత స్థితిలో శ్రీలంక వీటిలో ఏ ఒక్క మ్యాచ్లోనే నెగ్గే అవకాశం లేదు. సెమీఫైనల్స్ అవకాశాలను లంకేయులు ఎప్పుడో వదులుకున్నారు!.