Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్
- దక్షిణాఫ్రికాకు తప్పని నాలుగో ఓటమి
- కష్టపడిన బౌలర్లు.. ఆమ్లా, డుసెన్ అర్ధశతకాలు
ఎడ్జ్బాస్టన్: ప్రపంచకప్లో బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికాను ఓడించి టోర్నీలో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్లో కివీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ జట్టును నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కివీస్ ఆటగాళ్లలో సారథి కేన్ విలియమ్సన్(106నాటౌట్, 138 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్) సెంచరీతో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడగా.. గ్రాండ్హౌమ్(60 పరుగులు, 47బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో కివీస్ విజయాన్ని అందుకుంది. సఫారీ బౌలర్లలో మోరిస్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. రబడా, ఎన్గిడి, ఫెహ్లుకోవియా తలో వికెట్ దక్కించుకున్నారు. జట్టుకు విజయాన్ని అందించిన విలియమ్సన్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' లభించింది.
అంతకుముందు టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాజట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు మాత్రమే చేయగల్గింది. టాస్ గెలిచిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సఫారీ జట్టు బ్యాటింగ్కు దిగింది. ముందురోజు వర్షం కురవడంతో ఔట్ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ను గంటన్నర ఆలస్యంగా మొదలుపెట్టారు. అంతేగాక మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. వాతావరణ పరిస్థితులు, బ్యాటింగ్ చేసేందుకు కష్టంగా ఉన్న పిచ్ను కివీస్ చక్కగా వినియోగించుకుంది. సఫారీ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డికాక్(5)ను ట్రెంట్ బౌల్ట్ క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో మరో ఓపెనర్ హషీమ్ ఆమ్లాతో కలిసి సారథి డుప్లెసిస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం డుప్లెసిస్(23)ను ఫెర్గుసన్ పెవిలియన్కు పంపించాడు. ఓ వైపు వికెట్లు పెడుతున్నా మరో వైపు ఆమ్లా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అర్దసెంచరీ పూర్తి చేసిన అనంతరం ఆమ్లా కూడా పెవిలియన్ బాట పట్టాడు. మార్క్రమ్తో కలిసి ఆమ్లా జట్టును ఆదుకొని అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 111 వద్ద సాంట్నర్.. ఆమ్లాను బోల్తా కొట్టించడంతో సఫారీ జట్టు ఒత్తిడిలో పడింది. క్రీజులోకి వచ్చిన డుసెన్ నిలకడగా ఆడాడు. వికెట్ ఇవ్వలేదు. అనవసర షాట్లు ఆడలేదు. మార్క్రమ్తో కలిసి 25 పరుగుల భాగస్వామ్యం అందించాడు. మార్క్రమ్ను ఔట్ చేయడం ద్వారా గ్రాండ్హోమ్ ఈ జోడీని విడదీశాడు. అయితే డేవిడ్ మిల్లర్, డుసెన్ ఏకంగా 72 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 44.5 ఓవర్లలో 210 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్లో బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ 37 బంతుల్లో 36 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 218 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 6వ వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఫెలుక్వాయో ఔటయ్యాడు. 5 బంతులు ఆడిన ఫెల్క్యులియో ఖాతా కూడా తెరవకుండా ఔటయ్యాడు.
కివీస్ కట్టుదిట్టంగా..
దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్కే కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విజయవంతమయ్యారు. బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్హౌమ్, మిచెల్ సాంట్నర్ తలొక వికెట్ పడగొట్టారు. కివీస్ బౌలింగ్లో పరుగులు రాబట్టడానికి సఫారీ బ్యాట్స్మెన్ నానాతంటాలు పడ్డారు. ఇంగ్లండ్ పిచ్లపై నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి అతి తక్కువ స్కోర్ నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే కావడం గమనార్హం.
ఆమ్లా 8000(నాటౌట్)
ఎడ్జ్బాస్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన వన్డేమ్యాచ్లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఆమ్లా వ్యక్తిగత స్కోర్ 24 పరుగుల వద్ద వన్డేల్లో వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 175 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత అందుకోగా, ఆమ్లా 176 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. అంతేగాక దక్షిణాఫ్రికా తరఫున వేగంగా 8000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్మన్గా ఆమ్లా రికార్డు సృష్టించాడు. గతంలో సఫారీజట్టు తరఫున విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ 182 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను అందుకోగా.. ఓవరాల్గా 8000 పరుగుల క్లబ్లో చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో జాక్వస్ కలిస్(11,579), డివిలియర్స్(9577), గిబ్స్(8094)లు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. నిజానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమ్లా ఫామ్లో లేకపోవడంతో ఈ రికార్డు కాస్త ఆలస్యం అయింది.