Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన హరీశ్ సోహైల్
- రాణించిన మహ్మద్ ఆమీర్
లార్డ్స్ : భారత్ చేతిలో దారుణ ఓటమి పీడకల నుంచి పాకిస్థాన్ తేరుకుంది. లార్డ్స్లో దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో భారీ విజయంతో సెమీఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఒత్తిడిలో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ ప్రపంచకప్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. 309 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. నిర్ణీత ఓవర్లలో 258/9 పరుగులే చేసింది. డికాక్ (47), డుప్లెసిస్ (63), వాన్డర్ డుసెన్ (36), ఫెలుక్వయో (46 నాటౌట్), డెవిడ్ మిల్లర్ (31) రాణించినా.. జట్టు అవసరాల మేరకు పరుగులు సాధించలేదు. పాక్ బౌలర్లు మహ్మద్ ఆమీర్ (2/49), రియాజ్ (3/46), షాదాబ్ ఖాన్ (3/50) రాణించారు. హరీశ్ సోహైల్ (89, 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ప్రదర్శనతో తొలుత పాకిస్థాన్ 308/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హాక్ (44), ఫకర్ జమాన్ (44) తొలి వికెట్కు 81 పరుగులతో శుభారంభం అందించారు. స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజామ్ (69, 80 బంతుల్లో 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో రాణించాడు. ఇమద్ వసీం (23)తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పిన హరీశ్, సఫారీ బౌలర్లపై దండెత్తాడు. షోయబ్ మాలిక్ స్థానంలో జట్టులోకి వచ్చిన హరీశ్ సోహైల్ తన విలువెంటో చాటిచెప్పే ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి (3/64), ఇమ్రాన్ తాహీర్ (2/42) రాణించారు.