Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ బలహీనతను బయటపెట్టిన అఫ్గాన్
- ధోని, జాదవ్లపై విమర్శల వెల్లువ
సౌతాంప్టన్లో అఫ్గనిస్థాన్తో వరల్డ్కప్ మ్యాచ్. ఎం.ఎస్ ధోని మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానుల్లో విపరీత స్పందన. అభిమాన క్రికెటర్ రాకతో స్టేడియం మహి నామస్మరణతో మార్మోగింది. 75 నిమిషాల అనంతరం, ధోని మైదానం వీడుతున్నాడు. అదే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన. కానీ ఈసారి అభిమానులు గేలి చేశారు. ఎందుకు?
నవతెలంగాణ క్రీడా విభాగం
ప్రపంచకప్ ఫేవరెట్ భారత్ అజేయ రికార్డుతో అఫ్గనిస్థాన్ మ్యాచ్కు సిద్ధమైంది. కోహ్లిసేన ముందు అఫ్గాన్ ఓటమి ఖాయమని అభిమానులే కాదు విశ్లేషకులు ఓ నిశ్చయానికి వచ్చారు. ఎంత తేడాతో విజయం సాధిస్తారో అని మ్యాచ్ చూడటం మొదలెట్టారు. కానీ మైదానంలో పరిస్థితి పూర్తి భిన్నం. 11 పరుగులతో భారత్ గెలిచినా.. అఫ్గనిస్థాన్ క్రికెట్ జట్టు భారత అభిమానుల హృదయాలనూ స్మృశించింది. పటిష్టమైన టీమ్ ఇండియాను ఆఖరు ఓవర్ వరకూ వణికించిన అఫ్గాన్కు సోషల్ మీడియాలో ప్రశంసల కొదవ లేదు. 2015 ప్రపంచకప్ తర్వాత ప్రపంచంలో అత్యంత పటిష్టమైన టాప్-3 కలిగిన జట్టు భారత్. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు జట్టు పరుగుల్లో 75 శాతం కొట్టేస్తున్నారు. తాజా ప్రపంచకప్లోనూ అదే కొనసాగించారు. తిరుగులేని టాప్-3, ఎదురులేని పేస్ విభాగం, మాయ చేయగల స్పిన్ దళంతో భారత జట్టులో లోపం కనిపెట్టడం కష్టమే. కానీ ఒక్క మిడిల్ ఆర్డర్ కోహ్లిసేనను టైటిల్ ఫేవరెట్గా అందరూ ఒప్పుకునేందుకు వెనుకడుగు వేసేలా చేసింది. అఫ్గనిస్థాన్తో మ్యాచ్లోనూ దాదాపు ఓటమి చవిచూసిన సన్నివేశంలోకి తీసుకెళ్లింది.
ధోని పరుగులు చేయడా? : అఫ్గనిస్థాన్తో మ్యాచ్లో ఎం.ఎస్ ధోని ఇన్నింగ్స్ 27వ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఎండ్లో ఆడుతున్నాడు. అఫ్గనిస్థాన్ స్పిన్నర్లపై నేరుగా షాట్లు ఆడుతున్న కోహ్లి అలవోకగా స్ట్రయిక్ రొటేట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ధోని నుంచి ఆశించినది ఒక్కటే. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కోహ్లికి యాంకర్ పాత్ర పోషించటం. కానీ ధోని ఆ పని చేయలేదు. నిరుడు ఇంగ్లాండ్పై 322 పరుగుల ఛేదనలోనూ ధోని ఇలాగే విసిగించాడు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ 23 ఓవర్లలో 183 పరుగులు చేయాల్సి ఉంది. 20 ఓవర్ల తర్వాత ధోని నిష్మ్రమించాడు. ఈ సమయంలో భారత్ చేసిన పరుగులు మరో 75. 57 బంతుల్లో 37 పరుగులు చేసిన ధోని, భారత ఓటమికి మూల కారకుడయ్యాడు. సౌతాంప్టన్లో అఫ్గాన్పై కథ ఇందుకు భిన్నం కాదు. కాకపోతే, ఇక్కడ బుమ్రా, షమి మెరుపులతో భారత్ విజయం సాధించింది.
ఇతర బ్యాట్స్మెన్ పూర్తిగా ఇబ్బంది పడుతున్న తరుణంలో.. సౌకర్యవంతంగా పరుగులు చేస్తున్న కోహ్లికి సహకారం అందించటం ఎంతో కీలకం. మరో 24 ఓవర్ల ఆట మిగిలి ఉన్న దశలో భారీ స్కోరుకు ఇది బాటల వేస్తుంది. ధోనికి ఫ్లాట్, షార్ట్ బంతులు విసిరిన రషీద్ ఖాన్ పరుగులు చేయనీయలేదు. ధోని షాట్లు నేరుగా కవర్స్ ఫీల్డర్కు చేరుతున్నాయి. క్రీజు వదిలి ముందుకొచ్చి స్క్వేర్లో పరుగులు సాధించాలని ప్రయత్నించినా కుదరలేదు. ధోని క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ స్కోరు అంచనా 294. విరాట్ కోహ్లి అవుటైన సమయానికి భారత్ స్కోరు అంచనా 273 పరుగులు. లోయర్ ఆర్డర్ను నడిపిస్తూ ధోని మెరుగైన స్కోరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ధోని విఫలమయ్యాడు. ధోని, జాదవ్ ఐదో వికెట్కు 84 బంతుల్లో 57 పరుగులు జోడించారు. ధోని 36 బంతుల్లో 24.. జాదవ్ 48 బంతుల్లో 31 పరుగులు చేశాడు. భారత్ భారీ స్కోరు ఆశలకు ఇక్కడే గండి పడింది.
గత కొన్నేండ్లలో ఎం.ఎస్ ధోని బ్యాటింగ్ శైలి పరిశీలిస్తే ఓ విషయం అవగతం అవుతుంది. ముందుగా బ్యాటింగ్ రాగానే, పిచ్ పరిస్థితి అంచనా వేయటం. ఎటువంటి రిస్క్ లేకుండా పరుగులు సాధించటం. చివరి ఓవర్ల వరకూ ఎదురుచూసి, విధ్వంసక విన్యాసంతో మెరవటం. చాలా సందర్బాల్లో ధోని ఫార్ములా సక్సెస్ అయ్యింది. సహచరులూ అతడు చెప్పినట్టే నడుచుకున్నారు. కానీ, సౌతాంప్టన్లో ముగింపు మరోలా రాసి ఉంది. కోహ్లి అవుటైన తర్వాత ఆరు ఓవర్లలో ధోని, జాదవ్ బౌండరీ కొట్టలేదు. 40-45 ఓవర్లలో మధ్యలో ఏకంగా నాలుగు ఓవర్లలో రెండేసి పరుగులే చేయగలిగారు. ఈ దశలో ధోని స్టంపౌట్ అభిమానుల్లో ఆనందం తీసుకురావటం ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే, కనీసం ఆఖరి ఓవర్లలోనైనా హార్దిక్ పాండ్య వీరోచిత బ్యాటింగ్ చూడగల్గుతామనే అభిమానుల అభిలాషను ఎవరు కాదంటారు?
లోపం ఎక్కడీ : 2015 ప్రపంచకప్ తర్వాత భారత్ అత్యల్ప రన్రేట్ ఇన్నింగ్స్ సౌతాంప్టన్లో వచ్చింది. 25 ఓవర్ల తర్వాత భారత రన్రేట్ 4.6 . టాప్ ఆర్డర్ అరుదుగా విఫలమైన చోట, మిడిల్ ఆర్డర్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకం. ధోని తన శైలి బ్యాటింగ్, వ్యూహం కొనసాగించవచ్చు. అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆ ఫార్ములాతోనే ఎన్నో విజయాలు అందించాడు. కానీ ఆ సమయంలో మరో ఎండ్లో వేగంగా పరుగులు చేయగల మరో బ్యాట్స్మన్ అండ అతడికి అవసరం. లేదంటే, సౌతాంప్టన్ ఫలితం పునరావృతం కావటం ఖాయం. ధోనీని ఫీనిషర్గా కొనసాగించాలా? బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించాలా? అనేది జట్టు మేనేజ్మెంట్ తేల్చుకోవాలి. అఫ్గనిస్థాన్తో ఇన్నింగ్స్ భారత్కు మంచి పాఠం కావాలి. ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భారత్ దీనికి పరిష్కారం కనుగొనాలి. అన్ని మ్యాచుల్లో టాప్-3 బ్యాట్స్మెన్ మెరవటం, మిడిల్ ఆర్డర్కు అసలు సమయమే చిక్కకపోవటం సైతం ఓ కారణం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్రీజులో విలువైన సమయం గడిపే అవకాశం, గత నాలుగేండ్లలో చాలా తక్కువ సందర్బాల్లోనే లభించింది. అన్నింటికి మించి, హార్దిక్ పాండ్య విధ్వంసక సామర్థ్యం భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఆశించటం ఎల్లప్పుడే సమ్మతమే. ప్రపంచకప్కు ముందు భారత్కు ఓ బలమైన బలహీనత ఉంది. సౌతాంప్టన్లో అఫ్గనిస్థాన్ ఆ బలహీనతను సమర్థవంతంగా ఎత్తిచూపింది. మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా కండ్లుచెదిరే స్పెల్ లేకుంటే.. అఫ్గనిస్థాన్ సౌతాంప్టన్లో చరిత్ర సృష్టించేదే!.
కొంత నిరుత్సాహానికి గురయ్యాను. కాస్త మెరుగ్గా ఆడాల్సింది. జాదవ్, ధోని భాగస్వామ్యం సంతృప్తికరం కాదు. మరీ నెమ్మదిగా ఆడారు. 34 ఓవర్ల స్పిన్ బౌలింగ్లో 119 పరుగులు చేశాం. ఇక్కడ భారత్ సౌకర్యవంతంగా కనిపిం చలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో అసలు సానుకూల దృక్పథమే లోపిం చింది. ఓవర్కు 2-3 డాట్ బాల్స్. విరాట్ అవుటైన తర్వాత, 45వ ఓవర్ వరకూ చాలినన్ని పరుగులు చేయలేదు. మిడిల్ ఆర్డర్పై ఒత్తిడికి ఓ కారణం ఉంది సరే, కానీ సౌతాంప్టన్లో మరింత మెరుగైన దృక్పథంతో పరుగులు చేయాల్సింది'
- సచిన్ టెండూల్కర్