Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ చేతిలో ఓటమిపై పాక్ కోచ్ అర్థర్
లండన్ : 2007 ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్ చీఫ్ కోచ్ బాబ్ ఊల్మర్ అకాల మరణం చెందారు. అప్పుడు పాకిస్థాన్ గ్రూప్ దశ నుంచి నిష్క్రమించింది. తాజాగా 2019 ప్రపంచకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్ దారుణ ఓటమి చవిచూసింది. పాకిస్థాన్ పోరాట పటిమ చూపలేదని అభిమానులు విరుచుకు పడ్డారు. ఆటగాళ్లపై, కుటుంబికులపై వ్యక్తిగత దూషణలకూ వెనుకాడలేదు. ఈ సమయంలో అందరూ పాకిస్థాన్ ఆటగాళ్లు మళ్లీ మైదానంలో ఎలా పుంజుకుంటారనే ఆలోచించారు. అందుకు చీఫ్ కోచ్ మికీ ఆర్థర్ వారిని ఎలా సన్నద్ధం చేయనున్నారో అనే ఆసక్తి నెలకొంది. కానీ మికీ ఆర్థర్ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. భారత్ చేతిలో ఓటమి పరిణామాలు ఆత్మహత్మకు ఉసిగొల్పాయని ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' గత ఆదివారం ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కేవలం ఒకే ఒక్క చెత్త ప్రదర్శన కారణంగా ఆ ఆలోచన కలిగింది. అదేంతో వేగంగా జరిగిపోయింది. చూస్తుండగానే మ్యాచ్ను కోల్పోయాం. ఇది ప్రపంచకప్ అందరూ ఇటువైపే చూస్తారు. మీడియా, అభిమానులు, ప్రజలు అంచనాలను బేరీజు వేస్తాయి. ఇటువంటి సమయంలో బతికితే చాలనే భావన కలుగుతుంది' అని మికీ అర్ధర్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా జాతీయుడు, పాక్ కోచ్ మికీ ఆర్థర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రొఫెషనల్ కోచ్గా, జెంటిల్మెన్ గేమ్లో ఓ ఓటమికి ఇటువంటి ఆలోచనలు చేస్తున్న ఆర్థర్ అసలు శిక్షకుడిగా అనర్హుడు అని నెటిజన్లు అంటున్నారు. ఓటమి తర్వాత ఆటగాళ్లలో స్థైర్యం నింపాల్సిన ఆర్థరే, స్వయంగా ఇటువంటి ఆలోచనలు చేస్తే డ్రెస్సింగ్రూమ్ వాతావరణం మరెంత కలుషతంగా ఉందోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్పై చెలరేగితే స్వదేశంలో రాత్రికి రాత్రి హీరో కావచ్చని ఆటగాళ్లలో భావోద్వేగాలు నింపిన అర్థర్.. ఓటమి అనంతరం ఈ వ్యాఖ్యలు చేయటం వింతగా తోస్తున్నాయి.