Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు వెస్టిండీస్తో భారత్ పోరు
- ఎం.ఎస్ ధోని బ్యాటింగ్పై ఫోకస్
- ఓడితే కరీబియన్లకు ఇంటి దారే
36 ఏండ్ల క్రితం. ఇంగ్లాండ్ గడ్డపై వెస్టిండీస్ను ఓడించి ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించింది టీమ్ ఇండియా. 1983 లార్డ్స్ ఫైనల్స్ భారత్ను అగ్రపథాన నడిపించగా, అదే ఫైనల్స్ వెస్టిండీస్ను తిరోగమనంలో పడేసింది. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు ఆసక్తికరంగా మారగా.. మాంచెస్టర్ విజయం కోహ్లిసేనను సెమీస్కు చేరువ చేయనుంది. ఇక్కడ ఓడితే కరీబియన్ల ప్రపంచకప్ ప్రస్థానం లాంఛనంగా ముగియనుంది. మిడిల్ ఆర్డర్ ప్రదర్శన కోహ్లిసేనను వేధిస్తోంది. నాణ్యమైన సీమర్లతో కూడిన విండీస్పై ధోని సారథ్యంలోని మిడిల్ ఏ విధంగా రాణిస్తుందనే ఆసక్తి నెలకొంది. మాంచెస్టర్లో నేడు విండీస్, భారత్
ప్రపంచకప్లో అజేయ రికార్డుతో కొనసాగుతున్న కోహ్లిసేన నేడు వెస్టిండీస్ రూపంలో కఠిన సవాల్కు సిద్ధమైంది. ఇంగ్లాండ్ వరుస విజయాలతో ఇంకా ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసులో మిగిలిన వెస్టిండీస్, నేడు విజయంపై కన్నేసి బరిలోకి దిగనుంది. ఆరు మ్యాచుల్లో ఒక విజయం సాధించిన వెస్టిండీస్ తన చివరి మూడు మ్యాచుల్లోనూ నెగ్గితే 12 పాయింట్లతో సెమీస్కు చేరనుంది. ఐదు మ్యాచుల్లో ఏడు పాయింట్లు సాధించిన టీమ్ ఇండియా, నేడు విజయంతో సెమీస్ స్థానం లాంఛనం చేసుకోనుంది. సెమీస్ రేసులో ఇరు జట్లకూ ఇది కీలక మ్యాచ్. విజయం కోసం విండీస్, భారత్ సర్వ శక్తూలు ఒడ్డనున్నాయి.
ధోని ఏం చేస్తాడో? : అఫ్గనిస్థాన్ మ్యాచ్లో జిడ్డు బ్యాటింగ్తో విమర్శలు మూటగట్టుకున్నాడు ఎం.ఎస్ ధోని. మహి సారథ్యంలోని మిడిల్ ఆర్డర్ అఫ్గాన్పై చేతులెత్తేసింది. నం.4లో విజరు శంకర్ ఆకట్టుకోలేదు. కేదార్ జాదవ్ అర్ధ సెంచరీతో మెరిసినా.. డెత్ ఓవర్లలో అవసరాలకు తగినట్టు అతడి దూకుడు లేదు. ప్రపంచకప్లో వెస్టిండీస్ సీమర్లు పవర్ప్లేలో టాప్ ఆర్డర్ను ఇబ్బందికి గురిచేశారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లపై ఇది చూశాం. భారత్తో మ్యాచ్లోనూ అదే పునరావృతం అయితే, మన మిడిల్ ఆర్డర్ మెరిసేందుకు సిద్ధంగా ఉన్నదా? ప్రశ్నార్థకం. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి రాణిస్తేనే భారత్ భారీ స్కోరు చేయగల్గుతోంది. నాకౌట్ సమరాల్లో ఇది కుదరదు. విండీస్ మ్యాచ్ భారత మిడిల్ ఆర్డర్కు పరీక్ష. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నేడు ఆడే అవకాశం కనిపిస్తోంది. విండీస్లో ఎడం చేతి వాటం బ్యాట్స్మెన్ దృష్ట్యా చాహల్ స్థానంలో జడేజా తుది జట్టులోకి రానున్నాడు. భువనేశ్వర్ కుమార్ నెట్స్లో బౌలింగ్ చేశాడు. అయినా, ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి లభించనుంది. మహ్మద్ షమి విండీస్పై బుమ్రాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. చైనామన్ కుల్దీప్ యాదవ్ వికెట్ల వేటలో నిరూపించుకోవాల్సి ఉంది!.
విండీస్కు చావోరేవో : న్యూజిలాండ్పై బ్రాత్వేట్ అద్భుత పోరాటం వృథా అయ్యింది. కానీ వెస్టిండీస్ సెమీస్ ఆశలు పూర్తిగా ఆవిరి కాలేదు. రానున్న మూడు మ్యాచుల్లో నెగ్గితే విండీస్ నేరుగా సెమీస్కు చేరనుంది. విధ్వంసక ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ లేకపోవటం గట్టి ఎదురు దెబ్బ. ఓపెనర్ లెవిస్ స్థానంలో సునీల్ జట్టులోకి రానున్నాడు. వెటరన్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ బాధ్యతగా ఆడుతున్నాడు. భారత్పైనా అదే కొనసాగిస్తే కోహ్లిసేనకు కష్టం. యువ ఆటగాళ్లు షిమ్రోన్ హెట్మయర్, షారు హౌప్ నిలకడగా ఆడుతున్నారు. కార్లోస్ బ్రాత్వేట్ భీకర ఫామ్ అందుకోవటం గొప్ప సానుకూలత. కెప్టెన్ జేసన్ హౌల్డర్ బంతితో, బ్యాట్తో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. షెల్డన్ కాట్రెల్, ఒసేస్ థామస్తో కలిసి కీమర్ రోచ్ సీమర్గా జట్టులోకి రానున్నాడు. ఆరంభ ఓవర్లలో విండీస్ సీమర్లను ఎదుర్కొవటం అంత సులభం కాదు. నేడు ఓడితే, సెమీస్ ఆశలు ఆవిరి కానున్నాయి. దీంతో విండీస్ అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు వెనుకాడబోదు.
పిచ్ రిపోర్టు : భారత్ ఇక్కడ పాకిస్థాన్పై ఏకపక్ష విజయం సాధించింది. జూన్ 16న ఇక్కడ వర్షం అంతరాయం ఏర్పడింది. కానీ కరీబియన్లతో పోరుకు వరుణుడు రావటం లేదు. మాంచెస్టర్ పిచ్ ఎప్పట్లాగే ఫ్లాట్గా ఉండనుంది. పరుగుల వరదకు అవకాశం ఉన్న వికెట్ ఇది. గణాంకాల పరంగా ఇక్కడ స్పిన్నర్లతో పోల్చితే సీమర్లే వికెట్ల వేటలో ముందున్నారు. ఛేదనకు ఇరు జట్లు మొగ్గు చూపవచ్చు!.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, విజరు శంకర్, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, చాహల్/రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ : క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్/ సునీల్ ఆంబ్రిస్, షారు హౌప్, నికోల్స్ పూరన్, షిమ్రోన్ హెట్మయర్, కార్లోస్ బ్రాత్వేట్, జేసన్ హౌల్డర్, అష్లె నర్సె, కీమర్ రోచ్, షెల్డన్ కాట్రెల్, ఒసేన్ థామస్.
భారత్పై ఆడి వీడతా! : 2019 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని గతంలో సంకేతాలిచ్చిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ మనసు మార్చుకున్నాడు. ఆగస్టులో టీమ్ ఇండియాతో సిరీస్ తర్వాత వీడ్కోలు తీసుకుంటానని తాజాగా పేర్కొన్నాడు. విండీస్ మేనేజర్ సైతం భారత్తో సిరీస్ గేల్కు ఆఖరు కానుందని చెప్పాడు. ' అప్పుడే ముగియలేదు. మరికొన్ని మ్యాచులు ఆడగలను. బహుశా మరో సిరీస్ కావచ్చు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. భారత్పై ఓ టెస్టు ఆడతాను, ఆ తర్వాత వన్డేల్లోనూ పాల్గొంటాను. టీ20ల్లో ఆడను. ప్రపంచకప్ తర్వాత ఇదే నా ప్రణాళిక' అని క్రిస్ గేల్ అన్నాడు.