Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్కు భారత్ ఫోబియా
- ఆదివారం అత్యంత కీలక మ్యాచ్
1999 ప్రపంచకప్లో మాంచెస్టర్ సమరంలో మహ్మద్ అజారుద్దీన్ సేన పాకిస్థాన్ను చిత్తు చేసింది. 2019 ప్రపంచకప్లో కోహ్లిసేన మాంచెస్టర్లోనే పాకిస్థాన్పై భారీ విజయంతో చరిత్ర పునరావృతం చేసింది. ఇప్పుడు తాజాగా ఆతిథ్య ఇంగ్లాండ్కు కోహ్లిసేన ఫోబియా పట్టుకుంది. 1999 ప్రపంచకప్లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆశలను ఆవిరి చేసింది భారతే. గ్రూప్ దశ చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. అప్పటి వరకూ సూపర్ సిక్స్ రేసులో ముందున్న ఇంగ్లాండ్.. టీమ్ ఇండియా దెబ్బకు ఇంటి బాట పట్టింది. 2019లోనూ టైటిల్ ఫేవరెట్గా అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. మూడు ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఏడు మ్యాచుల్లో 8 పాయింట్లతో కొనసాగుతోంది. చివరి రెండు మ్యాచుల్లో విజయాలు.. ఇంగ్లాండ్కు నేరుగా సెమీస్ ప్రవేశం కల్పిస్తాయి. ఆదివారం బర్మింగ్హామ్ పోరులో కోహ్లిసేన పంచ్ విసిరితే, మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ ప్రపంచకప్ కథ ముగియనుంది. ఇంగ్లాండ్ అభిమానులను ఇది మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
మానసికంగా ఓడిపోయారు! : భారీ అంచనాలతో ప్రపంచకప్ వేట మొదలెట్టిన ఇంగ్లాండ్.. ఒత్తిడిని జయించలేదు. ప్రపంచకప్కు ముందు భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించి అంచనాలు ఆకాశాన్ని తాకేందుకు మోర్గాన్సేన అవకాశం కల్పించింది. కానీ ప్రపంచకప్లో చిన్న పాటి ఛేదనల్లోనూ చిత్తుగా ఓడింది. శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతిలో వరుస ఓటములు ఇంగ్లాండ్ను మానసికంగా కృంగదీశాయి. ఇంగ్లీష్ ఆటగాళ్ల ప్రవర్తనలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడటంలో సిద్ధహస్దులైన జానీ బెయిర్స్టో, జోశ్ బట్లర్, జేసన్ రారు ప్రపంచకప్లో నిలకడగా మెరువలేదు!. మిడిల్ ఆర్డర్లో జో రూట్ ఒక్కడే నిలబడ్డాడు. అతడికి బెన్ స్టోక్స్ ఆఖర్లో తోడవుతున్నాడు. ఇయాన్ మోర్గాన్ అఫ్గాన్పై భారీ శతకం మినహా చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. చివరి రెండు మ్యాచుల్లో వరుసగా భారత్, న్యూజిలాండ్లను ఎదుర్కొవాల్సి రావటం ఆతిథ్య జట్టుకు మరింత ఇబ్బందికరం. బర్మింగ్హామ్లో భారత్ చేతిలో ఓడితే.. మరోసారి ఆతిథ్య జట్టుగా ఇంగ్లాండ్కు భంగపాటు తప్పదు. కాగితంపై కోహ్లిసేనను దీటుగా ఎదుర్కొగల ఇంగ్లాండ్.. మైదానంలో ఒత్తిడిని జయిస్తేనే అసలు పోటీ ఇవ్వగలదు.
అప్పుడు దాదాగిరీ : 1999 ప్రపంచకప్, బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో భారత్ కీలక పోరు. ఇంగ్లాండ్ అప్పటికే మూడు విజయాలు సాధించింది. జింబాబ్వే మూడు విజయాలతో కొనసాగుతోంది. భారత్ రెండే విజయాలతో సూపర్ సిక్స్ అవకాశాలను తక్కువ చేసుకుంది. సౌరవ్ గంగూలీ ఓపెనర్గా 59 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగుల ఇన్నింగ్స్ బాది గట్టి పునాది వేశాడు. నాల్గో స్థానంలో రాహుల్ ద్రవిడ్ (53) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. 116 బంతులాడిన ద్రవిడ్ ఆరు ఫోర్లతో ఫిఫ్టీ సాధించాడు. డెత్ ఓవర్లలో అజరు జడేజా (39) 30 బంతుల్లో ఐదు ఫోర్లు బాదగా తొలుత భారత్ 232/8 పరుగులు చేసింది. ఛేదనలో భారత బౌలర్లు ఇంగ్లాండ్ను వణికించారు. దెబాసిస్ మెహంతి (ఒడిశా) పవర్ ప్లేలో నిప్పులు చెరగగా.. జవగళ్ శ్రీనాథ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లేలు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. మెహంతి రెండు వికెట్లు కూల్చగా.. శ్రీనాథ్ (2/25), గంగూలీ (3/27), కుంబ్లే (2/30) అద్భుత ప్రదర్శన చేశారు. దాదా ఆల్రౌండ్ ప్రదర్శనతో విజృంభించగా భారత్ 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారీ విజయంతో నెట్ రన్రేట్ మెరుగుపర్చుకున్న అజారుద్దీన్ సేన.. జింబాబ్వే, ఇంగ్లాండ్లను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికాతో కలిసి సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. 1999 ఆతిథ్య జట్టుగా భంగపడిన ఇంగ్లాండ్.. 20 ఏండ్ల తర్వాత తొలిసారి మళ్లీ ప్రపంచకప్కు ఆతిథ్య ఇస్తోంది. ఇప్పుడూ సెమీస్ రేసులో భారతే అడ్డుగా నిలిచింది. ఫలితం 1999 పునరావృతమా? 2019లో ఇంగ్లాండ్ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? ఆసక్తికరం.
- నవతెలంగాణ క్రీడా విభాగం