Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్వీటర్లో ఫోటోతో పంచ్
న్యూఢిల్లీ : మాంచెస్టర్లో వెస్టిండీస్తో మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వివాదాస్పద అవుట్ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా రోహిత్ శర్మ సైతం ట్వీటర్ వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కాడు. కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతి ఇన్ స్వింగ్తో రోహిత్ బ్యాట్ను ఛేదిస్తూ దూసుకొచ్చింది. బంతి రోహిత్ ప్యాడ్ తగలగా.. విండీస్ వికెట్ కీపర్ హౌప్ గట్టిగా అప్పీల్ చేశాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్కు నిరాకరించాడు. విండీస్ కెప్టెన్ జేసన్ సమీక్ష కోరాడు. రిప్లేలో స్నీకో మీటర్పై ఎడ్జ్ కనిపించినా.. అది బంతి ప్యాడ్కు తగిలని శబ్దం. ఆ సమయంలో బంతికి, బ్యాట్కు స్పష్టమైన దూరం కనిపిస్తోంది. ఇది కూడా కనిపించటం లేదా? అంటూ అర్థం వచ్చే సంజ్ఞలతో రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. 23 బంతుల్లో 18 పరుగులు చేసిన రోహిత్ శర్మ అసంతృప్తి వెళ్లగక్కుతూనే క్రీజు వదిలిన సంగతి తెలిసిందే. టీవీ అంపైర్ చేసిన తప్పిదంపై ఐసీసీ నుంచి ఎటువంటి వివరణ లేదు. భారత కెప్టెన్, కోచ్ ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లారా? లేదా అనేది తెలియరాలేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్ సందిగ్ధంలో పొరపాటు చేసినా మానవ సహజమని, సాంకేతికత పరిజ్ఞానంతో టీవీ అంపైర్గా ఉంటూ స్పష్టంగా చూడకుండా నిర్లక్ష్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం క్షమార్హం కాదని అభిమానులు మండిపడుతున్నారు.