Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడితే ఆతిథ్య జట్టు ఆశలు గల్లంతు
- హాట్ ఫేవరెట్గా టీమ్ ఇండియా
- సెమీస్కు గెలుపు దూరంలో కోహ్లిసేన
- బర్మింగ్హామ్లో మెగా పోరు నేడు
ఓ విజయం.. భారత్ను సెమీఫైనల్స్కు చేర్చనుంది.
ఓ ఓటమి.. ఇంగ్లాండ్ను ఇంటికి పంపించనుంది.
ఇంగ్లాండ్, భారత్.. 2019 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లు. అజేయ రికార్డుతో కోహ్లిసేన టైటిల్ దిశగా సాగుతోంది. వరుస ఓటములతో ఇంగ్లాండ్ సెమీస్ రేసులో వెనుకంజలో నిలిచింది. బర్మింగ్హామ్లో కోహ్లిసేన సవాల్కు నిలబడితేనే ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు ప్రపంచకప్ స్వప్నం నిలబడుతుంది. 1999 ఎడ్జ్బాస్టన్ ఫలితాన్ని టీమ్ ఇండియా పునరావృతం చేస్తే, ప్రపంచానికి క్రికెట్ను పరిచయం చేసిన దేశానికి ప్రపంచకప్ స్వప్నం కలగానే మిగలనుంది.
బర్మింగ్హామ్ (ఎడ్జ్బాస్టన్): జూన్ 30, ఎడ్జ్బాస్టన్ సమరం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం జరిగే పోరాటంగానే రెండు వారాల ముందు వరకూ క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ ఈ సమయం, ఇంగ్లాండ్ కథను మార్చేందుకు సరిపోయింది. శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతిలో వరుస ఓటములు ఇంగ్లాండ్ను ప్రమాదంలో పడేశాయి. అగ్రస్థానం సంగతి పక్కనపెడితే, అసలు ప్రపంచకప్ పోటీలో ఉంటామా? లేదా? అనే ఆందోళన ఎక్కువైపోతుంది. గాయాలు ఇంగ్లాండ్తో ఆడుకున్నా.. నేటి మ్యాచ్కు జేసన్ రారు అందుబాటులో ఉండటం ఆతిథ్య జట్టుకు గొప్ప ప్రేరణ. చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో ఇంగ్లాండ్ గొప్ప ప్రదర్శన చేస్తే గానీ, కోహ్లిసేనను దాటి సెమీస్ రేసులో సజీవంగా ఉండలేదు. సెమీఫైనల్స్ బెర్త్కు ఓ విజయం దూరంలో నిలిచిన టీమ్ ఇండియా.. నేడు ఓడినా చివరి రెండు మ్యాచుల్లో ఏదో ఒకటి నెగ్గినా సెమీస్కు చేరుకోగలదు. కానీ ఇంగ్లాండ్కు మరో అవకాశం లేదు. బర్మింగ్హామ్లో గెలిస్తేనే, ఆతిథ్య జట్టు ఆశలు, ఆశయాలు నిలబడతాయి. ఎడ్జ్బాస్టన్ ఓటమి ఇంగ్లాండ్ను తీరని వ్యథకు గురి చేస్తుందనటంలో సందేహం లేదు!.
సెమీస్కు ఇక్కడే చేరాలని.. :
టీమ్ ఇండియా జోరు మీదుంది. ఆరు మ్యాచుల్లో అజేయ రికార్డుతో దూసుకెళ్తుంది. టాప్ ఆర్డర్లో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నారు. టాప్-3 బ్యాట్స్మెన్ 30 ఓవర్ల పాటు నిలిచినా డెత్ ఓవర్లలో విజృంభించగల సత్తా మిడిల్ ఆర్డర్కు ఉంది. వరుసగా నాలుగు అర్ధ సెంచరీలతో కెప్టెన్ కోహ్లి సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. నాణ్యమైన ఇంగ్లాండ్పై విరాట్ మరో భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఎం.ఎస్ ధోని బ్యాటింగ్ శైలిపై విమర్శలు, ప్రశంసలూ వస్తున్నాయి. జట్టు అవసరాల మేరకు మహి ఆడుతున్నాడని కెప్టెన్ కోహ్లి చెప్పేశాడు. నం.4లో ఆడుతున్న విజరు శంకర్ వరుసగా 14, 29, 14 స్కోర్లు సాధించాడు. ఇతర జట్లలో స్మిత్, మోర్గాన్, హఫీజ్, రూట్ ఆడుతున్న స్థానంలో శంకర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. కేదార్ జాదవ్ స్థానంలో రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్పై జాదవ్ ఆడే అవకాశం కనిపిస్తోంది. మిడిల్ ఓవర్లలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు సవాల్ విసరనున్నారు. మహ్మద్ షమి, జశ్ప్రీత్ బుమ్రాతో కలిసి హార్దిక్ పాండ్య పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఇంగ్లాండ్పై పేలవ రికార్డును మహ్మద్ షమి నేడు ఎడ్జ్బాస్టన్లో చెలరేగుతాడేమో చూడాలి.
ఇంగ్లాండ్కు చావోరేవో :
ఏడు మ్యాచుల్లో మూడు ఓటములు ఇంగ్లాండ్ను క్లిష్ట పరిస్థితుల్లో నిలిపింది. ప్రమాదకర జట్టుగా కనిపించిన ఇంగ్లాండ్ ప్రపంచకప్లో పేలవంగా ఆడింది. స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ అంచనాలను అందుకునే ప్రదర్శన చేస్తున్నాడు. విధ్వంసక ఓపెనర్ జేసన్ రాయ్ గాయంతో దూరం కావటం ఇంగ్లాండ్కు ఎదురు దెబ్బ. కానీ నేడు అతడు అందుబాటులోకి రానుండటం, ఇంగ్లాండ్ గెలుపు అవకాశాలను రెట్టింపు చేస్తుంది. జానీ బెయిర్స్టోతో కలిసి రాయ్ చెలరేగితే ఇంగ్లాండ్ మునుపటి ఫామ్ అందుకోగలదు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, జోశ్ బట్లర్ అర్ధ సెంచరీలతో మెరిసిన వేళ ఇంగ్లాండ్ ఎక్కువ విజయాలు సాధించింది. కానీ ఈ ఇద్దరూ నిరాశ పరుస్తున్నారు. ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో మోర్గాన్, బట్లర్ విజృంభించాలని జట్టు కోరుకుంటుంది. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ భీకర ఫామ్లో ఉన్నాడు. వికెట్ సులభంగా ఇచ్చేందుకు స్టోక్స్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. డెత్ ఓవర్లలో బట్లర్తో కలిసి స్టోక్స్ విధ్వంసం సృష్టిస్తే నష్టం భారీగా ఉంటుంది. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నేడు ఉదయం అతడి ఫిట్నెస్పై ఇంగ్లాండ్ ప్రకటన చేయనుంది. మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. క్రిస్ వోక్స్, మార్క్వుడ్లు ఆర్చర్/ప్లంకెట్తో కలిసి పేస్ విభాగాన్ని భర్తీ చేయనున్నారు.
పిచ్ రిపోర్టు :
భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్కు కొత్త పిచ్ను సిద్ధం చేశారు. అంచనాలకు భిన్నంగా, ప్రపంచకప్లో బౌలర్లకు అనుకూలించే పిచ్లు రూపొందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ స్కోర్ల ఆధునిక క్రికెట్లో పాత తరం తరహా ఊరించే లక్ష్యాలను ఛేదించటంలో జట్లు ఆపసోపాలు పడుతున్నాయి. ఎడ్జ్బాస్టన్ పిచ్ ఫ్లాట్గా కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది. ఛేదనలో మూడు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్, పరిస్థితులతో సంబంధం లేకుండా తొలుత బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడుతుంది!. 1999 ప్రపంచకప్లో భారత్, ఇంగ్లాండ్లు గ్రూప్ మ్యాచ్లో ఇక్కడ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 63 పరుగుల విజయంతో అజారుద్దీన్ సేన నాకౌట్లోకి దూసుకెళ్లగా, ఇంగ్లాండ్ కథ అక్కడితో ముగిసింది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, విజరు శంకర్, కేదార్ జాదవ్, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోశ్ బట్లర్, క్రిస్ వోక్స్, మోయిన్ అలీ/టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్/లియాం ఫ్లంకెట్, ఆదిల్ రషీద్, మార్క్వుడ్.
హాయ్.. హాయ్.. ఎడ్జ్బాస్టన్లో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. వర్షం ప్రమాదం ఏమాత్రం లేదు. నేటి మ్యాచ్కు భారత అభిమానులే ఎక్కువగా హాజరు కానున్నారు. ఇంగ్లాండ్ సొంతగడ్డపై ఆడుతున్నా, అభిమానుల మద్దతుతో కోహ్లిసేనకే సొంత మైదానం భావన!.
పాకిస్థాన్పై విజరు శంకర్ మంచి ప్రదర్శన చేశాడు. అఫ్గనిస్థాన్ మ్యాచ్లో ఆ పిచ్పై అతడు సౌకర్యవంతంగా కనిపించాడు. షాట్ ఎంపికపై అతడిపై మాట్లాడాం. వెస్టిండీస్పైనా కీమర్ రోచ్ అద్భుతమైన బంతికే శంకర్ వికెట్ కోల్పోయాడు. విజరు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. 30 నుంచి 60 పరుగులు చేయడానికి కాస్త అదృష్టం సైతం కలిసి రావాలి. సూపర్ ఇన్నింగ్స్కు ఓ అడుగు దూరంలో ఉన్నాడు. భువనేశ్వర్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడు ఫిట్నెస్ సాధించిన తర్వాత భువి, షమిలలో ఒకరిని ఎంచుకోవటం తలనొప్పి. జట్టు ప్రయోజనాలకు కోసం అందరూ ఎంపికను అర్ధం చేసుకోగలరు.
- భారత కెప్టెన్ విరాట్ కోహ్లి