Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్లో స్థానం దక్కకపోవడంతోనే?
హైదరాబాద్: తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకూ గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ విషయాని బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బీసీసీఐకు తెలిపాడు. బీసీసీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచకప్ జరుగుతున్న సమయంలోనే అంబటి రాయుడు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటించడం భారత క్రికెట్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాయుడి అనూహ్య నిర్ణయంతో క్రికెట్ వర్గాలు, అభిమానులు విస్మయం చెందాయి. 33 ఏండ్ల రాయుడు ఆటకు అప్పుడే గుడ్బై చెప్పేయడం బాధాకరమని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాగా, బీసీసీఐకి రాసిన లేఖలో రాయుడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలియజేశాడు. కోహ్లి ఎల్లప్పుడూ తనపై విశ్వాసం ఉంచాడని వెల్లడించాడు. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, హైదరాబాద్ సహా రాష్ట్ర క్రికెట్ సంఘాలు, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, తల్లిదండ్రులు, అభిమానులకు రాయుడు ధన్యవాదాలు తెలియజేశాడు.
నాలుగో స్థానానికి అంబటి రాయుడు సరైన ఆటగాడని కెప్టెన్ కోహ్లి ప్రశంసించినా, 'రాయుడుకు నేను టాప్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే అతను పేసర్లు, స్పిన్నర్లనూ సమర్థంగా ఎదుర్కోగలడు' అని ధోని కితాబు ఇచ్చినా.. రాయుడుకు చివరికి నిరాశే మిగిలింది. ఎంతో ప్రతిభ ఉన్న క్రికెటర్గా గుర్తింపు పొంది, కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులతో తన ప్రయాణాన్ని కొనసాగించిన రాయుడు చివరికి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకుండానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
16 ఏండ్లకే..
గుంటూరులో పుట్టిన రాయుడు 16 ఏండ్లకే ఫస్ట్క్లాస్ క్రికెట్ను ప్రారంభించాడు. 2002లో హైదరాబాద్ తరఫున ఆడాడు. 2002-03 రంజీ ట్రోఫీలో 698 పరుగులతో అత్యధిక పరుగుల సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. ఈ ట్రోఫీలో ఒకే మ్యాచ్లో 210, 159 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. రంజీలో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడిగానూ రికార్డులకెక్కాడు. తర్వాత ఏడాది వెస్టిండీస్, ఇంగ్లాండ్ సిరీస్లకు 'ఇండియా-ఏ' జట్టులో ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో 87 సగటుతో రాణించడంతో 'టీమిండియా భవిష్యత్తు ఆటగాడి'గా వార్తలు వచ్చాయి. తర్వాత ఏడాది అండర్-19 భారత్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. 2012లో ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్కు రాయుడుని ఎంపిక చేశారు. మనోజ్ తివారీకి గాయం అవ్వడంతో అతనికి అవకాశం వచ్చినా కానీ అతనికి తుది జట్టులో స్థానం దక్కలేదు. 2013లో ధోనీకి గాయమవ్వడంతో వెస్టిండీస్ సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ ఈసారి కూడా అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి ఇవ్వడంతో జింబాబ్వేతో సిరీస్కు ఎంపికయ్యాడు. 2013 జులై 24న భారత్ తరఫున జింబాబ్వేపై తొలి వన్డే ఆడాడు.అంతర్జాతీయ కెరీర్లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు. అలాగే ఐపిఎల్లో 147 మ్యాచ్ల్లో 3,300 పరుగులు రాయుడు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 97 మ్యాచుల్లో 156 ఇన్నింగ్స్లో 6,151 పరుగులు రాబట్టాడు. ఈ ఫార్మాట్లో రాయుడు వ్యక్తిగత అత్యధిక స్కోరు 210 పరుగులు. లిస్ట్-ఏలో 160 మ్యాచులాడి 5,103 పరుగులు చేశాడు. . 2013 జులై 24న జింబాబ్వేతో వన్డేల్ల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. చివరగా ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఆడాడు. 2014లో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20నే అతడికి ఆఖరిది. ఈ ఏడాది మార్చిలో ముంబయి ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చివరిసారిగా ఆడాడు. కాగా, ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఎంపికైన రాయుడు పరిమిత ఓవర్లపై మరింత శ్రద్ధ పెట్టడం కోసమం ఫస్ట్ క్లాస్క్రికెట్కు కూడా గుడ్బై చెప్పాడు.
ఐస్ లాండ్ క్రికెట్ ఆహ్వానం..
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడికి తమ దేశానికి వచ్చేయమంటూ ఐస్లాండ్ నుంచి ఆహ్వానం అందింది. 'రాయుడు 3డీ గ్లాసెస్ను ఇప్పుడైనా పక్కనబెట్టు. మామూలు అద్దాలతో డాక్యుమెంట్లను చదువు. వచ్చి మాతో చేరు. రాయుడంటే మాకెంతో ఇష్టం' అని ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఐస్లాండ్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.
'త్రీ డీ' కండ్లద్దాలే కారణామా..
ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కపోవడంతోనే రాయుడు ఈ అనూహ్యా నిర్ణయం తీసుకుని ఉంటాడని అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్లో జట్టు ఎంపిక సమయంలో రాయుడు వివాదం తలెత్తింది. రాయుడు కంటే విజరు శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇవ్వడంపై రాయుడు వ్యంగ్యంగా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రసాద్ మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్) అన్నందుకు ప్రపంచకప్ చూసేందుకు త్రీడి కండ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని రాయుడు ట్విట్టర్లో వ్యాఖ్యానించడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. టీమిండియా ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బైలో ఉన్నప్పటికీ రాయుడికి అవకాశం రాకపోవడానికి ఈ వ్యాఖ్యలే కారణమని అర్థమవుతుంది. స్థానం కోల్పోయిన బాధలో ఉన్నాడు.. పాపం కాబట్టి చర్య తీసుకోవడం లేదు అని బీసీసీఐ పెద్దలు కొందరు అప్పట్లో వ్యాఖ్యానించినా, రాయుడు వ్యాఖ్యలను వారు తీవ్రంగానే తీసుకున్నారని ఇప్పటి పరిణామలు బట్టి స్పష్టం అర్థమవుతుంది. తమనే ప్రశ్నించిన రాయుడుకు మళ్లీ అవకాశం ఇవ్వరాదనే సంకేతం తాజా ఎంపికలో కనిపించిందనడంలో సందేహం లేదు. ధావన్ గాయపడ్డ రిషిబ్ పంత్కు, ఏకంగా రాయడుకు బదులు జట్టులో స్థానం సంపాదించుకున్న విజరు శంకర్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించినప్పుడు కూడా రాయుడుకు పిలుపు ఇవ్వకుండా మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. రెండో సారీ అవకాశం రాలేదన్న నిరాశతో రాయుడు ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. స్టాండ్బైగా ఉన్నప్పటికీ ప్రపంచకప్నకు ఎంపిక చేయకపోవడంతోనే రాయుడు తీవ్రమైన ఈ నిర్ణయానికి వచ్చినట్లు అంతా భావిస్తున్నారు.