Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 మీ పరుగులో స్వర్ణం
- విస్మయకు కాంస్య పతకం
న్యూఢిల్లీ : ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత యువ సంచలనం హిమ దాస్ పరుగుకు మరో పసిడి పాదాక్రాంతమైంది. వెన్నునొప్పితో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న హిమ దాస్ ఈ ఏడాది బరిలోకి దిగిన తొలిసారే పసిడి పతకంతో మెరిసింది. పొజ్నన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ (పొలాండ్)లో మహిళల 200 మీటర్ల పరుగులో హిమ దాస్ అగ్రస్థానంలో నిలిచింది. 23.65 సెకండ్లలో 200 మీటర్ల పరుగును పూర్తి చేసిన హిమ దాస్ ఈ ఏడాది ఈ విభాగంలో తొలి పతకం అందుకుంది. దక్షిణాఫ్రికా స్ప్రింటర్ తమీజా థామ్సన్ 23.71 సెకండ్లతో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత స్పింట్రర్ వి.కె విస్మయ 23.75 సెకండ్లలో రేసు పూర్తి చేసి కాంస్య పతకం అందుకుంది. 200 మీటర్ల పరుగులో హిమ దాస్ అత్యుత్తమ రికార్డు 23.10 సెకండ్లు. ఆసియా చాంపియన్ తజిందర్ పాల్ సింగ్ 19.62 మీటర్ల దూరంతో షాట్పుట్లో కాంస్యం అందుకున్నాడు. మెన్స్ 200 మీటర్ల పరుగులో మహ్మద్ అనాస్ 20.75 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచాడు. కెఎస్ జీవన్ 47.25 సెకండ్లలో 400 మీటర్ల పరుగు పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పసిడి పరుగు తీసిన హిమ దాస్కు భారత క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు, అసొం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ శుభాకాంక్షలు తెలిపారు.