Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంత్, కార్తీక్, ధోని మెరుస్తారా?
- శ్రీలంకతో భారత్ మ్యాచ్ నేడు
- మ 3 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
లీడ్స్ (ఇంగ్లాండ్)
కోహ్లిసేన అగ్రస్థానంపై కన్నేసింది. లీడ్స్లో శ్రీలంకపై ధనాధన్ విజయంతో టాప్-4లో ముందుండే అవకాశాలను మెరుగు పర్చుకోవాలని చూస్తుంది. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక నేడు విజయంతో గౌరవప్రదంగా వరల్డ్కప్ ప్రయాణాన్ని ముగించాలని భావిస్తోంది.
మిడిల్ ఆర్డర్ అండ లేదు. అయినా నం.1 ఆటతో సెమీఫైనల్లోకి చేరుకుంది. కానీ నాకౌట్ వచ్చేసింది. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక ఇంటికే. మిడిల్ ఆర్డర్ మెరిసేందుకు మరో అవకాశం. మిడిల్లో బ్యాట్స్మెన్ కుదురుకుంటే, నాకౌట్లో కోహ్లిసేనకు తిరుగుండదు.
లీడ్స్లో శ్రీలంకతో భారత్ మ్యాచ్ నేడు.
టీమ్ ఇండియా సెమీఫైనల్స్ చేరుకుంది. శ్రీలంక టాప్-4 ఆశలకు ఎప్పుడో శుభం కార్డు పడింది. గ్రూప్ దశ మ్యాచుల్లో చివరి రోజున జరుగుతున్న ఈ పోరుపై ఎటువంటి ఆసక్తి లేదు. మిడిల్ ఆర్డర్ మెరిసేందుకు టీమ్ ఇండియాకు ఇది మరో అవకాశం. సీనియర్ ఆటగాడు లసిత్ మలింగకు ప్రపంచకప్లో ఇదే చివరి మ్యాచ్. మలింగకు విజయంతో వీడ్కోలు పలకాలని శ్రీలంక భావోద్వేగంతో బరిలోకి దిగుతోంది. మిడిల్ ఆర్డర్ చక్కబడేందుకు కోహ్లిసేన ఆశావహ దృక్పథంతో ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచేందుకు కోహ్లిసేనకు ఇదో అవకాశం. శ్రీలంకపై విజయంతో పాటు దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడితే.. కోహ్లిసేన టాప్-4లో టాప్ లేపనుంది. నేడు భారత్, ఆస్ట్రేలియాలు రెండూ విజయాలు సాధిస్తే ఆసీస్ అగ్రస్థానంలో నిలుస్తుంది. భారత్ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంటుంది. టాప్-2 స్థానాలు సెమీఫైనల్లో ఎవరితో ఎవరు పోటీపడేది తేల్చనున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు న్యూజిలాండ్తో, రెండో స్థానంలో నిలిచిన జట్టు ఇంగ్లాండ్తో తలపడనున్నాయి. సెమీస్లో ఎవరితో ఎవరు? అనేది నేటి మ్యాచ్ ఫలితాలు తేల్చనున్నాయి.
ఫోకస్ మిడిల్ ఆర్డర్ : విజయ్ శంకర్ గాయంతో వార్మప్లో ఆడిన కెఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. ప్రపంచకప్లో నం.4 స్థానం ఆక్రమించాడు. ధావన్ గాయంతో రాహుల్ ఓపెనర్గా మారాడు. నం.4లో రెండు మ్యాచులు విజరు, అతడు గాయపడిన తర్వాత రెండు మ్యాచుల్లో రిషబ్ పంత్ ఆడారు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్పై 48 పరుగుల ఇన్నింగ్స్తో దూకుడుగా ఆడాడు. పంత్ శైలి పట్ల జట్టు సంతృప్తికరంగా ఉంది. కానీ నాల్గో స్థానంలో అతడు మెగా స్కోరు చేయాలని మేనేజ్మెంట్ ఆలోచన. మరి శ్రీలంకపై రిషబ్ ఏం చేస్తాడో చూడాలి. కేదార్ జాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ నేడూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ముగింపులో జాదవ్ నెమ్మదైన ఇన్నింగ్స్ మెప్పించలేదు. కార్తీక్ ముగింపులో మెరుగ్గా రాణిస్తానని చెప్పేందుకు అతడికి నేడు మరో అవకాశం. కార్తీక్ నేడు విఫలమైతే కీలక సెమీస్లో జాదవ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఎం.ఎస్ ధోనిపై విమర్శలు తగ్గటం లేదు. తొలుత బ్యాటింగ్ చేసినా, ఛేదనలోనైనా అతడు దూకుడుగా ఆడటం లేదు. అవసరమైన వేళ ధోని దూకుడు ప్రదర్శిస్తాడని అభిమానులు, మేనేజ్మెంట్ ఆశిస్తోంది. శ్రీలంకపై మహి మెరిస్తే భారత మిడిల్ ఆర్డర్ సమ్యసలకు పరిష్కారం లభించినట్టే. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భీకర ఫామ్లో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ క్రీజులో నిలిస్తే భారత్ భారీ స్కోరు చేయటం ఖాయం. పేసర్లు బుమ్రా, భువి, షమిలలో ఒకరికి నేడు విశ్రాంతి లభించవచ్చు. సెమీఫైనల్స్కు ముందు ఇది పనిచేసే అవకాశం ఉంది. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ మళ్లీ జట్టుకట్టనున్నారు. హార్దిక్ పాండ్య ఆల్రౌండర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేయటమే కాదు బ్యాట్తో ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు.
మలింగ కోసం.. : బలహీన జట్టుగా శ్రీలంక ప్రపంచకప్లో అడుగుపెట్టింది. కానీ జట్టుగా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు శ్రీలంక. అందుకే టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండ్పై విజయం సాధించగల్గింది. వెస్టిండీస్పై మాథ్యూస్ చెప్పుకోదగిన స్పెల్తో గుర్తుండిపోయే విజయం సొంతం చేసుకుంది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో భారత్పై గెలుపొందిన శ్రీలంక, నేడు అదే స్ఫూర్తితో ఆడేందుకు సిద్ధమవుతోంది. సీనియర్ ఆటగాడు, దిగ్గజ పేసర్ లసిత్ మలింగకు ఇదే చివరి ప్రపంచకప్ మ్యాచ్. బహుశా, వరల్డ్కప్ తర్వాత అతడు జాతీయ జట్టుకు వీడ్కోలు పలికే అవకాశం లేకపోలేదు. మలింగకు ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు, శ్రీలంక భావోద్వేగంతో బరిలోకి దిగుతోంది. టాప్ ఆర్డర్లో ఆవిష్క ఫెర్నాండో శతక ఇన్నింగ్స్కు మాజీల నుంచి ప్రశంసలు దక్కాయి. కరుణరత్నె, పెరీరా, మాథ్యూస్, సిరివర్ధన సైతం మెరిస్తే నేడు కోహ్లిసేనకు గట్టి పోటీ ఇవ్వవచ్చు. బంతితో గొప్పగా రాణించిన మలింగ, నేడు భారత్పై యార్కర్ల ప్రతాపం చూపించేందుకు సిద్ధపడుతున్నాడు.
పిచ్ రిపోర్టు : లీడ్స్ 300 ప్లస్ పరుగుల స్కోర్లు తరచుగా నమోదవుతున్నాయి. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభిస్తోంది. స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ మళ్లీ జంటగా ఆడేందుకు అవకాశం ఉంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకు మొగ్గుచూపవచ్చు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ఎం.ఎస్ ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్/మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా.
శ్రీలంక : దిముత్ కరుణరత్నె, కుశల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశల్ మెండిస్, ఎంజెలో మాథ్యూస్, లహిరు తిరిమానె, ధనంజయ డిసిల్వ, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, కశున్ రజిత, జెఫ్రీ వాండర్సే.