Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచకప్ రేసులో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
నవతెలంగాణ క్రీడా విభాగం
2019 ప్రపంచకప్ సంగ్రామం పతాక పోరుకు చేరుకుంది. పది జట్ల గ్రూప్ దశ పోరాటానికి తెరపడింది. అంచనాల ప్రకారం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఆరంభంలో మెప్పించిన న్యూజిలాండ్ టాప్-4లో చోటు దక్కించుకుంది. గ్రూప్ దశలో ఓ మ్యాచ్లో ఓడినా, పుంజుకునేందుకు అవకాశం లభించింది. ఇక్కడా అలా కుదరదు. మరో అవకాశం ఉండదు. చావోరేవో తేల్చుకోవాల్సిందే. కప్పు కోసం ముందుకు అడుగు పడాల్సిందే!. నాలుగు జట్లలోనూ ఇప్పుడు ఒకే ఆలోచన. రెండే అడుగులు. ప్రపంచకప్ అందుకునేందుకు, విశ్వవిజేతగా నిలిచేందుకు, చరిత్ర సృష్టించేందుకు వేయాల్సింది ఇక రెండు అడుగులే. ఆ జట్టు ఏదో తేలాలంటే ఓ వారం ఆగాల్సిందే.
2019 ప్రపంచకప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. వరల్డ్కప్ వేట పది జట్ల నుంచి నాలుగుకు కుదించబడింది. నాలుగు నుంచి రెండు, రెండు నుంచి ఒకటి నిలిచేందుకు క్రికెట్ అభిమానులు మరో వారం ఓపిక పట్టాల్సిందే. ప్రపంచ క్రికెట్ గమనాన్ని మార్చివేసిన 1983 ప్రపంచకప్ మాదిరి 2019లో అద్బుతాలేమీ చోటుచేసుకోలేదు. 1992 ప్రపంచకప్ వలే (ఇంగ్లాండ్పై పాక్ గెలుపు) అద్భుత ఫలితం వచ్చే అవకాశం కనిపించటం లేదు. 1996 మాదిరి స్టార్వార్స్తో కూడిన ఆస్ట్రేలియాను చిత్తు చేసే శ్రీలంక ఇప్పుడు లేదు. టైటిల్ ఫేవరెట్టుగా నిలిచిన మూడు జట్లు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. మెగా ఈవెంట్లో అగ్ర జట్లే ముందుకు అడుగు వేశాయి. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత్తో న్యూజిలాండ్, ద్వితీయ స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో ఆతిథ్య ఇంగ్లాండ్ పోటీపడుతున్నాయి. తొలి సెమీఫైనల్స్ మాంచెస్టర్లో జులై 9, రెండో సెమీఫైనల్ బర్మింగ్హామ్లో జులై 11న జరుగుతాయి. టైటిల్ పోరు ఆదివారం (జులై 14) జరుగనుంది. సెమీస్కు చేరిన నాలుగు జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మూడోది ముందుంది! : 'ప్రపంచకప్లో బాగా ఆడాలని అనుకున్నాం. కానీ ఇంత గొప్పగా ఆడతామని ఊహించలేదు. జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా' .. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యలివి. నిజమే, భయంకరంగా కనిపించిన ఇంగ్లాండ్ను కాదని భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ నిలకడగా విజయాలు సాధించిన భారత్ మాత్రమే ఎక్కువ విజయాలే కాదు తక్కువ ఓటములు చవిచూసిన జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా సైతం ఏడు విజయాలు సాధించినా, ఆ జట్టు రెండు మ్యాచుల్లో ఓడింది. కానీ భారత్ ఒక్క మ్యాచ్లోనే పరాజయం పాలైంది. 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. జట్టుగా గొప్పగా కనిపిస్తున్న కోహ్లిసేన ప్రపంచకప్ విజయం ముంగిట నిలిచింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఎదుర్కొవటం భారత్కు పెద్ద లెక్క కాదు!. వరల్డ్ నం.1 బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ప్రపంచకప్లో ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ విరాట్ ఒక్క సెంచరీ కొట్టలేదు. అందుకు కారణం, ఓపెనర్లే అని చెప్పాలి. ఆరంభం నుంచీ అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్.. విరాట్ కోహ్లికి అసలు ఓవర్లే మిగల్చటం లేదు. తొలి రెండు మ్యాచుల్లో ఆడిన శిఖర్ ధావన్ సైతం ఓ సెంచరీ, అర్ధ సెంచరీతో క్రీజులో ఎక్కువ సమయమే గడిపాడు. రోహిత్ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. ఇది భారత్కు గొప్ప సానుకూలత. మిడిల్ ఆర్డర్లో పరిస్థితులకు తగినట్టు ఆడగల ఎం.ఎస్ ధోని, విధ్వంసకర ప్రదర్శన చేయగల రిషబ్ పంత్ ఉన్నారు. లోయర్ ఆర్డర్లో హార్దిక్ పాండ్య బౌలర్లకు భయం పుట్టించగలడు. పేస్ విభాగంలో బుమ్రా, భువి, షమిలతో భారత్ తిరుగులేని శక్తిగా నిలిచింది. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ చివరి మ్యాచుల్లో ఇబ్బంది పడినా.. మాంచెస్టర్లో మెరిసే అవకాశం ఎక్కువ.
అందేనా ఒకటి : టైటిల్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లాండ్ గ్రూప్ దశలో ఆశ్చర్యపరిచింది. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్రే ్టలియా చేతిలో ఓటమిపాలై, సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కానీ జానీ బెయిర్స్టో వరుస సెంచరీలతో ఇంగ్లాండ్ను రేసులోకి తీసుకొచ్చాడు. ఆరంభ మ్యాచుల్లో జో రూట్, బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ను నిలబెట్టగా.. చివర్లో జానీ బెయిర్స్టో, జేసన్ రారులు ఆదుకున్నారు. చాంపియన్ జట్టుకు ఉండాల్సిన లక్షణం ఇదే. జట్టులో ఏ ఇద్దరు ఆటగాళ్ల పైన అతిగా ఆధారపడినా, ఫలితం చేదుగానే ఉంటుందని చరిత్ర నిరూపించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, జోశ్ బట్లర్లు నాకౌట్లో చెలరేగితే ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్ను ముద్దాడటం లాంఛనమే అని భావించాలి. జోఫ్రా ఆర్చర్, ఫ్లంకెట్, క్రిస్ వోక్స్, మార్క్వుడ్ సహా ఆదిల్ రషీద్తో ఇంగ్లాండ్ బౌలింగ్ గౌరవప్రదంగా కనిపిస్తోంది. సెమీస్లో ఎదుర్కొవాల్సిన ఆస్ట్రేలియాపై గ్రూప్ దశలో ఇంగ్లాండ్ ఓడింది. జులై 11న బర్మింగ్హామ్లో కంగారూలపై ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి.
రేసు గుర్రం : చింత సచ్చినా, పులుపు చావలేదు' అన్నట్టు దూకుడు తగ్గినా, ఆసీస్ విజయాల్లో మార్పు లేదు. ప్రత్యర్థిని మానసికంగా ఓడించి, మాటల దాడితో హింసించి, మైదానంలో ఎదురుదాడి చేయటంలో ఆస్ట్రేలియా శైలి క్రికెట్ ఓ ఒరవడి సృష్టించింది. కేప్టౌన్ బాల్ టాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియాలో ఆ దూకుడు, వేడి ఎగిరిపోయాయి. కానీ విజయం సాధించే మార్గాన్ని మాత్రం ఆసీస్ వదిలి పెట్టలేదు. డ్యాషింగ్ ఓపెనర్ డెవిడ్ వార్నర్, కెప్టెన్ అరోన్ ఫించ్ ఇద్దరూ పరుగుల వరద పారిస్తున్నారు. 638 పరుగులతో వార్నర్ దూసుకెళ్తుండగా, అరోన్ ఫించ్ 507 పరుగులు సాధించాడు. ఉస్మాన్ ఖవాజ, స్టీవ్ స్మిత్ నిలకడగా రాణించారు. ఆల్రౌండర్ మాక్స్వెల్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీ కీలక సందర్భాల్లో జట్టును ఆదుకోవటం నేర్చుకున్నారు. స్టార్ సీమర్ మిచెల్ స్టార్క్ 26 వికెట్లతో జోరు మీదున్నాడు. గ్రూప్ దశలో ఆరంభంలో భారత్, చివర్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. మెరుగ్గా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. మిడిల్ ఆర్డర్, మిడిల్ చతికిల పడినా.. లోయర్ ఆర్డర్ ఆదుకోగలదు. అందుకే ఆస్ట్రేలియా రేసులో ఉండగా.. ఎప్పుడూ ఫేవరెట్గానే చెప్పుకోవాలి. 2015లో సొంతగడ్డపై ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా ఇంగ్లాండ్ నేలపై సాధించాలని చూస్తోంది.
న్యూజిలాండ్ ఎంత వరకు? : ప్రపంచకప్లో న్యూజిలాండ్ నిలకడగా అమోఘం. 1992 నుంచి ఆ జట్టు ఏకంగా ఆరు సార్లు సమీఫైనల్స్కు చేరుకుంది. ఓవరాల్గా ఇది న్యూజిలాండ్కు ఎనిమిదో సెమీఫైనల్స్. 2015లో రన్నరప్తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్.. ఈసారి ఏకంగా కప్పుపై కన్నేసింది. ఆరంభ మ్యాచుల్లో వరుస విజయాలు న్యూజిలాండ్ను అగ్రపథాన నిలిపాయి. కానీ గ్రూప్ దశలో చివరి మ్యాచుల్లో న్యూజిలాండ్ వరుస ఓటములు చవిచూసింది. ఏకంగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. నెట్ రన్రేట్ నమ్ముకుని సెమీఫైనల్స్కు చేరుకుంది. సెమీస్లో భారత్తో కివీస్ తలపడాల్సి ఉంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్ల ముఖాముఖి పోరు వర్షార్పణం అయ్యింది. వార్మప్లో కోహ్లిసేనను ఓడించినా, ఒత్తిడి ప్రధాన పాత్ర పోషించే సెమీఫైనల్లో టీమ్ ఇండియాను దాటడం అంత సులువు కాదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ విఫలమైన చోట కివీస్ చేతులెత్తేస్తోంది. ఈ బలహీనతను అధిగమించాలి. లేదంటే భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టగలదు. మార్టిన్ గప్టిల్, కొలిన్ మన్రో, టామ్ లాథమ్ ఫామ్లో లేరు. పేసర్లు ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ జోడీ సక్సెస్ సాధించింది. మిచెల్ శాంట్నర్, ఇశ్ సోధి, కొలిన్ డీ గ్రాండ్హౌమె, జిమ్మీ నీషమ్లతో కూడిన ఆల్రౌండర్లు న్యూజిలాండ్కు అదనపు బలం.
యాధృచ్చికమే అయినా, ప్రపంచకప్ సెమీఫైనల్స్కు చేరుకున్న నాలుగు జట్లలో మూడు ధన బలం కలిగినవే. ప్రపంచ క్రికెట్లో అతి పెద్ద బోర్డులు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఐసీసీ ఆదాయంలోనూ వీరిదే సింహాభాగం వాటా. బీసీసీఐ అందనంత ఎత్తులో ఉండగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ సైతం ఓ మోస్తరు ధన బలం కలిగిన క్రికెట్ బోర్డే. ఆధునిక క్రికెట్లో ప్రపంచకప్ దక్కించుకునేందుకు ధనిక బోర్డులు తలపడనుండటం ఆసక్తికరం. ప్రపంచకప్లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో వెనుకబడినవి కావటం గమనార్హం. ఈ ఆరు దేశాల బోర్డులు ఆదాయం కోసం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ల కోసం ఎదురుచూస్తాయి. ధన బలంతో విజేతగా నిలువలేం కానీ, కాసుల అండ లేనిదే ప్రపంచ స్థాయిలో పోటీపడలేమని ఆధునిక క్రీడల్లో చూస్తున్నదే.