Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టు కూర్పుపై అభిమానుల విమర్శ
మాంచెస్టర్ : నాలుగు మ్యాచులు, 14 వికెట్లు. 2019 ప్రపంచకప్లో అత్యుత్తమ స్ట్రయిక్రేట్ కలిగిన బౌలర్. అఫ్గాన్పై 4/40, వెస్టిండీస్పై 4/49, ఇంగ్లాండ్పై 5/69తో సత్తా చాటిన సీమర్ మహ్మద్ షమి. వికెట్ల వేటలో దూసుకెళ్తోన్న మహ్మద్ షమి న్యూజిలాండ్తో సెమీఫైనల్లో కీలక పాత్ర పోషిస్తాడనే అందరూ అంచనా వేశారు. కానీ టాస్కు వచ్చిన విరాట్ కోహ్లి తుది జట్టు ప్రకటనతో అభిమానులకు షాకిచ్చాడు. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు సౌరవ్ గంగూలీ, ఆకాశ్ చొప్రా సైతం జట్టు మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్వీట్టర్ వేదికగా కోహ్లి నిర్ణయాన్ని ప్రశ్నించాడు. ' కుల్దీప్ను కాదని చాహల్ను ఎంచుకోవటం అర్ధం చేసుకోగలం. కానీ షమిని విస్మరించటం సరైనది కాదు. ఈ కూర్పుతో భారత్కు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంటుంది' అని ఆకాశ్ చొప్రా అన్నాడు. గంగూలీ మాదిరిగానే నేనూ ఆశ్చర్యానికి గురయ్యాను. షమి వికెట్ల వేటలో ముందుంటున్నాడు. డెత్ ఓవర్లలో పరుగులు పెద్ద విషయం కాదు. జడేజా రాకతో భారత్ 8వ స్థానం వరకూ బ్యాటింగ్ చేయగలదు. న్యూజిలాండ్పై మెరుగైన రికార్డు కలిగిన కుల్దీప్ను వదిలేయటం పెద్ద నిర్ణయం' అని హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. క్రికెట్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా జట్టు మేనేజ్మెంట్ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. వికెట్లు పడగొడుతున్న షమిని కాదని భువనేశ్వర్ కుమార్ను ఏ కొలమానం ఆధారంగా ఎంచుకున్నారని ప్రశ్నించారు.