Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్
- సెమీస్ ఫలితంపై ఉత్కంఠ
- ఆట సాగినా, ఆగినా.. భారత్కే మొగ్గు
మాంచెస్టర్
ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ సాగేలా కనిపించటం లేదు. వార్మప్ మ్యాచ్లో ఈ రెండు జట్లూ ముఖాముఖి తలపడ్డాయి. కానీ గ్రూప్ దశలో భారత్, కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. నేడు మాంచెస్టర్లో సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోరుకు అదే సమస్య ఎదురైంది. మ్యాచ్ రోజుతో పాటు రిజర్వ్ డే (నేడు) సైతం వర్షం ప్రమాదం పొంచి ఉంది. దీంతో సెమీఫైనల్స్ ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. వర్షం కారణంగా మ్యాచ్ ఇక్కడితో ఆగినా, వరుణుడు కరుణిస్తే ఆట ముందుకు సాగినా టీమ్ ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదెలాగో చూద్దాం.
రిజర్వ్ డే : ప్రపంచకప్లో వర్షం కారణంగా చాలా మ్యాచులు రద్దయ్యాయి. నాలుగు మ్యాచులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. కొన్ని మ్యాచులకు ఆటంకం కలిగింది. ఇంగ్లీష్ వేసవిలో ఈ స్థాయి వర్షాలు ఊహించని పరిణామం. కానీ సెమీఫైనల్లో వరుణుడు మళ్లీ రావటంతో అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. ప్రపంచకప్ గ్రూప్ మ్యాచులకు రిజర్వ్ డే లేదు. కానీ సెమీఫైనల్స్, ఫైనల్స్లకు రిజర్వ్ డే ఉంది. నేడూ వర్షంతో ఆట సాగకపోతే, గ్రూప్ దశలో 7 విజయాలు సాధించిన భారత్ ఫైనల్లోకి ప్రవేశించనుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించిన న్యూజిలాండ్ ఇంటి ముఖం పట్టనుంది. ఒకవేళ ఫైనల్లో వర్షం కారణంగా ఫలితం తేలకుంటే ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి.
డక్వర్త్ లూయిస్ ఇలా..! : న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసింది. మ్యాచ్లో నిర్దిష్ట సమయం అనంతరం ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ఓవర్ను కుదిస్తారు. ఈ లెక్కన నేడు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా పున ప్రారంభమైతే డక్వర్త్ లూయిస్ పద్దతి అమల్లోకి వస్తుంది. ఒకవేళ మ్యాచ్ మంగళవారమే తిరిగి ప్రారంభమై ఉంటే డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ లక్ష్యం ఇలా ఉండేది. 46 ఓవర్ల ఛేదనలో 237, 40 ఓవర్ల ఛేదనలో 223, 35 ఓవర్ల ఛేదనలో 209, 30 ఓవర్లలో ఛేదనలో 192, 25 ఓవర్ల ఛేదనలో 172 పరుగులా ఉండేది. ఒకవేళ డెడ్లైన్ సమయం రాత్రి 10.40 (భారత కాలమానం ప్రకారం)లకు మ్యాచ్ మొదలై ఉంటే భారత్ 120 బంతుల్లో 148 పరుగులు చేయాల్సి ఉండేది. సవరించిన లక్ష్య ఛేదనలో మళ్లీ వర్షం ఆటంకం కలిగించినా.. మ్యాచ్ నేడు అక్కడ్నుంచే మొదలయ్యేది.
కివీస్కూ చాన్స్ : పవర్ప్లేలో న్యూజిలాండ్ రన్రేట్ 3.29. ఇన్నింగ్స్ చివర్లో ఆ జట్టు రన్రేట్ 4.57. ఏ దశలోనూ కివీస్ రన్రేట్ 5 దాటలేదు. ఇది భారత బౌలర్ల గొప్ప ప్రదర్శన మాత్రమే కాదు, పిచ్ నుంచి మంచి సహకారం లభించటం. సాధారణ పరిస్థితుల్లో పిచ్ నుంచి సీమర్లకు సహకారం లభిస్తే, వర్షం కురిసిన పరిస్థితుల్లో సీమర్లకు పిచ్ స్వర్గధామం. ఛేదనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎం.ఎస్ ధోని అండ భారత్కు ఉన్నా.. కివీస్ శిబిరంలో ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, కొలిన్ డీ గ్రాండ్హౌమె వంటి పదునైన పేసర్లు ఉన్నారు. మాంచెస్టర్లో వర్షం కురిసిన పరిస్థితులు కివీస్ పిచ్లను పోలీ ఉంటుంది. ఇది న్యూజిలాండ్కు గొప్ప సానుకూలత. పరుగులు రాబట్టడం అంత సులువు కాని పరిస్థితుల్లో కోహ్లిసేన సైతం ఎంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి. లేదంటే న్యూజిలాండ్ పేసర్లు భారత్ను షాక్ ఇచ్చేందుకు వెనుకాడరు!.