Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ సెమీస్లోనే ముగిసిన భారత్ కథ
- ఉత్కంఠ సెమీస్లో న్యూజిలాండ్ గెలుపు
- వరుసగా రెండోసారి ఫైనల్లోకి కివీస్
- రవీంద్ర జడేజా, ధోని పోరాటం వృథా
బౌలర్ల మెరుపులతో న్యూజిలాండ్ 239 పరుగులకే పరిమితం. ఫైనల్స్ దారిలో భారత్ చేయాల్సిన స్కోరు 240. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు, భీకర ఫామ్లో ఉన్న టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. లార్డ్స్లో టీమ్ ఇండియా మరో టైటిల్ వేట లాంఛనమే అనిపించింది.
రాత్రంతా చిరుజల్లులు. ఉదయం మేఘావృతమైన వాతావరణం. మాంచెస్టర్లో శీతల పరిస్థితులు. ఇది అచ్చంగా న్యూజిలాండ్ పిచ్ పరిస్థితులను కల్పించింది. పిచ్ అందించిన గొప్ప సహకారంతో న్యూజిలాండ్ పేసర్లు దుమ్మురేపారు. 19 బంతులు. సెమీఫైనల్లో భారత్ అవకాశాలను అమాంతం తగ్గించాయి.
ఆఫ్ స్టంప్ లైన్లో మాట్ హెన్రీ (3/42) వేసిన చక్కటి బంతికి రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. లెగ్ స్టంప్ మీదుగా బౌల్ట్ (2/42) సంధించిన బంతి విరాట్ కోహ్లి (1) ఎల్బీగా అవుటయ్యాడు. మాట్ హెన్రీ గుడ్ లెంగ్త్ బంతికి కెఎల్ రాహుల్ (1) ఊగిసలాటే షాట్తో వికెట్ల వెనకాల దొరికిపోయాడు. 3.1 ఓవర్లలో భారత్ 5/3. ఐదు పరుగులకే టాప్-3, ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ను కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫైనల్స్కు చేరటం అసాధ్యమైంది.
ఈ సమయంలో రవీంద్ర జడేజా (77), ఎం.ఎస్ ధోని (50) ఏడో వికెట్కు 116 పరుగులు జోడించారు. కొండంత ఒత్తిడి, ప్రత్యర్థి బౌలర్ల నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొని ధోని, జడ్డూ జోడీ భారత్కు గొప్ప విజయం అందించినట్టే అనుకున్నాం. కానీ తొలి 19 బంతుల్లో చేసిన మ్యాజిక్ను న్యూజిలాండ్ చివర్లోనూ పునరావృతం చేసింది. ఛేదనలో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ వేటను సెమీఫైనల్లోనే ముగించింది. దక్షిణాఫ్రికాపై విజయంతో 2015లో ఫైనల్లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్.. మాంచెస్టర్లో భారత్ను ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది.
మాంచెస్టర్ (ఇంగ్లాండ్): టీమ్ ఇండియా ప్రపంచకప్ కల చెదిరింది. వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే కప్పు స్వప్నానికి తెరపడింది. వంద కోట్ల అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగారు. అత్యంత ఉత్కంఠ రేపిన రెండు రోజుల సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించింది. 240 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లి (1), రోహిత్ శర్మ (1), కెఎల్ రాహుల్ (1)లు దారుణంగా విఫలమయ్యారు. రవీంద్ర జడేజా (77, 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఎం.ఎస్ ధోని (50, 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఏడో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యం జోడించారు. జడేజా, ధోని మెరుపులతో భారత్ విజయానికి చేరువైంది. చివరి 15 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో న్యూజిలాండ్ బౌలర్లు పుంజుకున్నారు. రవీంద్ర జడేజా (77), ఎం.ఎస్ ధోని (50)లను స్వల్ప వ్యవధిలోనే అవుట్ చేసి, మ్యాచ్ను చేతుల్లోకి తీసుకుంది. 221 పరుగులకు భారత్కు కుప్పకూల్చి ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ వరల్డ్కప్ ఫైనల్లోకి చేరటం ఇది రెండోసారి. ఎనిమిది ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఆడిన న్యూజిలాండ్ వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు చేరటం విశేషం. 2015 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో సెమీస్లో ఓడిన టీమ్ ఇండియా, నాలుగేండ్ల తర్వాత న్యూజిలాండ్కు ఫైనల్స్ బెర్త్ కోల్పోయి ఇంటి బాట పట్టింది.
టాప్ లేచింది : 240 పరుగుల ఛేదన ఊదేస్తారు అనుకున్నాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నిలబడితే న్యూజిలాండ్ పోరాటం ఎంత సేపు అనిపించింది. కానీ క్రికెట్లో ఏదైనా జరగొచ్చు, పోరాడితే ఎప్పటికైనా ఫలితం వస్తుందని మాంచెస్టర్ సెమీస్ మరోసారి నిరూపించింది. పిచ్ సహకారం అందిపుచ్చుకున్న కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. టాప్ ఆర్డర్పై పక్కా ప్రణాళికతో వచ్చిన కివీస్, క్రమశిక్షణతో బంతులు విసిరింది. రోహిత్ శర్మకు కట్టుదిట్టమైన లైన్, లెంగ్త్తో బంతి విసిరిన మాట్ హెన్రీ, అదే తరహాలోనూ రాహుల్నూ సాగనంపాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలదొక్కుకుని పరుగులు చేయగల ఆటగాడు విరాట్ కోహ్లి (1) సంగతి ట్రెంట్ బౌల్ట్ చూసుకున్నాడు. ఐదు పరుగులకే ఫామ్లో ఉన్న ముగ్గురు బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయిన కోహ్లిసేన పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. దినేశ్ కార్తీక్ (6) ఎంతో సేపు క్రీజులో నిలువలేదు. పాయింట్లో నీషమ్ చూడచక్కని క్యాచ్తో కార్తీక్ పెవిలియన్కు చేరుకున్నాడు. అప్పటికి భారత్ స్కోరు 24/4.
జడ్డూ, ధోని ఆశలు రేపినా.. : రిషబ్ పంత్ (32, 56 బంతుల్లో 4 ఫోర్లు), హార్దిక్ పాండ్య (32, 62 బంతుల్లో 2 ఫోర్లు) కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. ఈ ఇద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేయటంతో భారత్ గాడిలో పడుతున్నట్టే అనిపించింది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్న మిచెల్ శాంట్నర్ (2/34)పై విరుచుకుపడే ప్రయత్నం వీరిని పెవిలియన్కు చేర్చింది. ఇద్దరూ మిడ్ వికెట్లోనే వికెట్ కోల్పోయారు. 92/6తో భారత్ 150 పరుగులైనా చేయగలదా? అనే ఆందోళన కనిపించింది. ఈ తరుణంలో రవీంద్ర జడేజా (77), ఎం.ఎస్ ధోని (50) స్ఫూర్తిదాయక భాగస్వామ్యం భారత్ను రేసులోకి తీసుకొచ్చింది. 2014 న్యూజిలాండ్ పర్యటనలో ఈ జోడీ ఏడో వికెట్కు 124 పరుగులు జోడించింది. అదే సిరీస్ ఆఖరి మ్యాచ్లో జడ్డూ విజృంభణతో భారత్ మ్యాచ్ను డ్రా చేసుకుంది. మాంచెస్టర్లోనూ ఈ జోడీ ఆ ప్రదర్శన పునరావృతం చేయటంతో విజయం వరించిన సంబురం అభిమానుల్లో కనిపించింది. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టిన జడేజా 39 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఓ ఫోర్, సిక్సర్తో సమయోచిత ఇన్నింగ్స్ ఆడిన ధోని 72 బంతుల్లో 50 పరుగుల మార్క్ చేరుకున్నాడు.
జడేజా, ధోని జోరందుకున్నారు. ఆఖరి 15 బంతుల్లో 33 పరుగులకు సమీకరణం చేరుకుంది. ఇలాంటి మ్యాచులను ముగించటంలో ధోని అనుభవం మరేవరికి లేదు. ఈ దశలో టీమ్ ఇండియా ఫేవరెట్గా నిలిచింది. మరో మూడు ఓవర్లు ఉన్న దశలో ఒకే ఓవర్ మిగిలిన ట్రెంట్ బౌల్ట్కు బంతినిచ్చిన కేన్ విలియమ్సన్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. జడేజా బంతిని గాల్లోకి లేపగా.. విలియమ్సన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కానీ ధోని క్రీజులో ఉన్నాడనే ధైర్యం భారత్లో గెలుపు ఆశలు సీజవంగా నిలిపింది. ఫెర్గుసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచిన ధోని ధనాధన్ అందుకున్నాడు. స్క్వేర్లో బంతిని ఆడిన ధోని ఓ పరుగుతో అర్ధ సెంచరీ పూర్తి చేసి, రెండో పరుగు కోసం వెనక్కి వచ్చాడు. మార్టిన్ గప్టిల్ కండ్లుచెదిరే డైరెక్ట్ త్రో ధోనిని రనౌట్ చేసింది. స్వల్ప తేడాతో మహి రనౌట్ అయ్యాడు. అతడితో పాటే భారత ప్రపంచకప్ ఆశలు వెళ్లిపోయాయి. భువనేశ్వర్ కమార్, యుజ్వెంద్ర చాహల్ సైతం వికెట్లు కోల్పోయా..మరో మూడు బంతులు ఉండగానే న్యూజిలాండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్కు తీరని శోకం మిగిల్చింది.
కేన్, టేలర్ విలువైన పరుగులు : వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ మంగళవారం ఆట నిలిచే సమయానికి 211/5తో నిలిచిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా స్పందిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) విలువైన పరుగులు న్యూజిలాండ్ను రేసులో నిలిపాయి. పవర్ ప్లేలో న్యూజిలాండ్ 27 పరుగులే చేసినా, విలియమ్సన్, టేలర్ రిస్క్ తీసుకోలేదు. వికెట్ను అర్థం చేసుకుని, క్రీజులో నిలిచారు. భారీ షాట్లు ఆడాలనే ఆత్రుత చూపించలేదు. సహనంతో క్రీజులో నిలిచి అర్ధ సెంచరీలతో న్యూజిలాండ్ను పోరాడగలిగే స్థితిలో నిలిపారు. బుధవారం ఆట ఆరంభమైన తర్వాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో చివరి 23 బంతులకు 28 పరుగులు జోడించింది. 239/8తో మంచి స్థితిలో నిలిచింది. భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, పాండ్య, జడేజా, చాహల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 158 బంతులకు అసలు పరుగులే చేయలేదు. డాట్ బాల్స్తో భారత బౌలర్లు ఒత్తిడి పెంచటంలో సఫలమయ్యారు!.
అత్యుత్తమ ప్రదర్శన చేయగలమని విరామ సమయంలో చర్చించుకున్నాం. అది చేసి చూపించాం. బంతితో గొప్పగా ప్రారంభించాం, భారత్పై విపరీతమైన ఒత్తిడి సృష్టించాం. వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్పై ఆడుతున్నప్పుడు మా సామర్థ్యంపై ఎన్నో ప్రశ్నలు. ఒత్తిడి పెంచితే, పరుగులు చేయటం కష్టమని మాకు తెలుసు. పిచ్ నుంచి సహకారం లభించింది. మమ్మల్ని మేం విశ్వసించాం. ఆరంభంలో వికెట్లు పడగొట్టాం. హార్దిక్, ధోని, జడేజా వరల్డ్క్లాస్ ఫీనిషర్లు. వారి సామర్థ్యం తెలుసు. ఆ ఇన్నింగ్స్లు ప్రమాదంలో పడేయకముందే నిలువరించగలిగాం. భారత్పై విజయంతో లార్డ్స్ ఫైనల్లోకి ప్రవేశించటం ప్రత్యేకంగా ఉంది. న్యూజిలాండ్ మద్దతుదాలకు ధన్యవాదాలు. ఆదివారం టైటిల్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం'
- మాట్ హెన్రీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : మార్టిన్ గప్టిల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 1, హెన్రీ నికోల్స్ (బి) రవీంద్ర జడేజా 28, కేన్ విలియమ్సన్ (సి) రవీంద్ర జడేజా (బి) చాహల్ 67, రాస్ టేలర్ రనౌట్ (జడేజా) 74, జేమ్స్ నీషమ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్య 12, కొలిన్ డీ గ్రాండ్హౌమె (సి) ధోని (బి) భువనేశ్వర్ కుమార్ 16, టామ్ లాథమ్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 3, మిచెల్ శాంట్నర్ నాటౌట్ 9, మాట్ హెన్రీ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 1, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 3, ఎక్స్ట్రాలు : 18, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 239.
వికెట్ల పతనం : 1-1, 2-69, 3-134, 4-162, 5-200, 6-225, 7-225, 8-232.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 10-1-43-3, జశ్ప్రీత్ బుమ్రా 10-1-39-1, హార్దిక్ పాండ్య 10-0-55-1, రవీంద్ర జడేజా 10-0-34-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-63-1.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) లాథమ్ (బి) మాట్ హెన్రీ 1, రోహిత్ శర్మ (సి) లాథమ్ (బి) మాట్ హెన్రీ 1, విరాట్ కోహ్లి (ఎల్బీ) ట్రెంట్ బౌల్ట్ 1, రిషబ్ పంత్ (సి) గ్రాండ్హౌమ్ (బి) శాంట్నర్ 32, దినేశ్ కార్తీక్ (సి) నీషమ్ (బి) మాట్ హెన్రీ 6, హార్దిక్ పాండ్య (సి) విలియమ్సన్ (బి) శాంట్నర్ 32, ఎం.ఎస్ ధోని రనౌట్ (గప్టిల్) 50, రవీంద్ర జడేజా (సి) విలియమ్సన్ (బి) ట్రెంట్ బౌల్ట్ 77, భువనేశ్వర్ కుమార్ (సి) లాకీ ఫెర్గుసన్ 0, యుజ్వెంద్ర చాహల్ (సి) లాథమ్ (బి) నీషమ్ 5, జశ్ప్రీత్ బుమ్రా నాటౌట్ 0, ఎక్స్ట్రాలు : 16, మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 221.
వికెట్ల పతనం : 1-4, 2-5, 3-5, 4-24, 5-71, 6-92, 7-208, 8-216, 9-217, 10-221.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 10-2-42-2, మాట్ హెన్రీ 10-1-37-3, లాకీ ఫెర్గుసన్ 10-0-43-1, కొలిన్ డీ గ్రాండ్హౌమ్ 2-0-13-0, జేమ్స్ నీషమ్ 7.3-0-49-1, మిచెల్ శాంట్నర్ 10-2-34-2.