Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్స్ ఓటమిపై రవిశాస్త్రి
- నం.4 తయారీ భవిష్యత్ అని వ్యాఖ్య
ప్రపంచకప్లో ఫేవరెట్గా ఆడుతున్న టీమ్ ఇండియా అన్నింటా అద్భుతంగా కనిపిస్తోంది. టాప్లో తిరుగులేదు, బంతితో ఎదురులేదు. మిడిల్ ఆర్డర్లో నం.4 బ్యాట్స్మన్ ఒక్కటే లోపంగా కనిపిస్తోంది. ప్రపంచకప్లో భారత్ను ఇది తీవ్రంగా దెబ్బకొట్టవచ్చు. 2019 ప్రపంచకప్ జట్టు ఎంపికకు ముందు, తర్వాత క్రికెట్ విశ్లేషకుల మాట ఇది. నం.4లో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ విలువను లెక్కచేయని చీఫ్ కోచ్ రవిశాస్త్రి, సెమీఫైనల్స్ ఓటమి తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరాజయం ఎదురైన తర్వాత చింతిస్తున్నారు!.
నవతెలంగాణ-ముంబయి
' ఎంతో నిరుత్సాహనికి గురయ్యాం. కఠినమైన మ్యాచ్. క్రికెట్ అంటే ఇంతే' మాంచెస్టర్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన తర్వాత భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పందన ఇది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచి, సెమీఫైనల్లో ఫేవరెట్గా బరిలోకి దిగినా.. రెండు రోజుల సెమీస్లో పరాజయమే ఎదురైంది. వర్షం రాకతో సీమర్లకు అనుకూలంగా మారిన మాంచెస్టర్ పిచ్పై రోహిత్ శర్మ (1), కెఎల్ రాహుల్ (1), విరాట్ కోహ్లి (1) దారుణంగా విఫలమైనా, భారత ఓటమికి టాప్ ఆర్డర్ను ఎవ్వరూ నిందించటం లేదు. ఎందుకంటే, గ్రూప్ దశలోనే కాదు గత నాలుగేండ్లుగాత భారత టాప్ ఆర్డర్ నిర్విరామంగా పరుగులు పిండుకుంది. అద్భుత విజయాలు అందించింది. టాప్-3 బ్యాట్స్మన్ తర్వాత రావాల్సిన నం.4 స్థానంలో నాణ్యమైన ఆటగాడు లేకపోవటంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ' ఆలస్యంగానే తెలుసుకున్నాం!, నిజమే మిడిల్ ఆర్డర్లో భారత్కు సమర్థమైన స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అవసరం. కానీ ఇప్పుడు నం.4లో నాణ్యమైన ఆటగాడి అన్వేషణ భవిష్యత్. టీమ్ ఇండియాకు ఎల్లప్పుడూ సమస్యలు సృష్టించిన స్థానం అది. కానీ మేం సరైన ఆటగాడిని దొరకబట్టలేదు. కెఎల్ రాహుల్ ఉన్నా, శిఖర్ ధావన్ గాయపడ్డాడు. విజరు శంకర్ ఉన్నాడని అనుకునేలోపే, అతడూ గాయపడ్డాడు. గాయాలు మా నియంత్రణలో లేవు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
అగర్వాల్ను ఆడించే సమయం లేదు : విజరు శంకర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ను తుది జట్టులోకి తీసుకుని, ప్రయోగం చేసేంత సమయం లేకుండా పోయిందని రవిశాస్త్రి అన్నాడు. ' రాహుల్ను నం.4లో ఆడించి, అగర్వాల్ను ఓపెనర్గా తీసుకురావటంపై జట్టు ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఇది మరీ క్లిష్టం. అప్పుడప్పుడే మయాంక్ జట్టుతో చేరాడు. అంత సమయం కూడా లేదు. న్యూజిలాండ్తో మ్యాచ్ సెమీఫైనల్స్కు ముందు సమరం అయి ఉంటే, ఆ పని చేసేందుకు సాహాసించలేవాళ్లం. అతడు అప్పుడే జట్టులోకి వచ్చాడు. రాహుల్ వరుసగా అర్థ సెంచరీ, సెంచరీ కొట్టాడు. మాకు మరో మ్యాచ్ ఉంటే, కచ్చితంగా ఆ పని చేసేవాళ్లం' అని శాస్త్రి తెలిపాడు.
మహిని ముగింపులో వాడాలనుకున్నాం : 20/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న వేళ అనవసర షాట్లకు వెళ్లకుండా, నిగ్రహంతో ఆడే అనుభవం ఉన్న ఎం.ఎస్ ధోని క్రీజులోకి వస్తాడని ఆశిస్తే, హార్దిక్ పాండ్యను పంపారు. 5/3 సమయంలోనూ ధోనిని కాదని కార్తీక్ను ముందుగా పంపించారు. ధోని బ్యాటింగ్ స్థానంపై సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ విమర్శలు చేశారు. దీనిపై శాస్త్రి తనదైన సమాధానం చెప్పాడు. ' అది పూర్తిగా జట్టు నిర్ణయం. అందరూ దానికే కట్టుబట్టారు. అది చాలా సాధారణ నిర్ణయం కూడా!. చివరగా మీరు కోరుకునేది... ధోని ముందుగా బ్యాటింగ్ వచ్చి అవుట్ కావటమా? అదే జరిగితే ఛేదన ఎప్పుడో చచ్చిపోయేది. ధోని అనుభవం మాకు చివర్లో అవసరం అనుకున్నాం. ధోని ఆల్టైమ్ అత్యుత్తమ ఫినిషర్. ఒకవేళ అతడిని ముగింపులో ఉపయోగించకుంటే, అది దారుణమైన చర్య అవుతుంది. జట్టు మొత్తం దానిపై స్పష్టతతో ఉంది. ముందుగా వచ్చిన రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు. ట్రెంట్ బౌల్ట్ను సైతం చక్కగా ఎదుర్కొన్నాడు కదా?!. ఒకవేళ పంత్ నాటౌట్గా నిలిచి ఉంటే.. అని చెప్పవచ్చు. కానీ ఇది క్రికెట్. అతడు వేగంగా ఎదుగుతున్నాడు. వీలైనంత త్వరగా నేర్చుకుంటాడు. ఆ విషయం అతడికి తెలుసు. కానీ ఆ స్థితిలో జట్టు చూపిన తెగువ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ పోరాట పటిమ అమోఘం. రవీంద్ర జడేజా సహజసిద్ధ ప్రతిభావంతుడు. అతడి కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. రానున్న రెండేండ్లలో జడేజా మరో స్థాయికి చేరుకుంటాడు' అని శాస్త్రి అన్నాడు.
ఛేదనలో ధోని ఆత్మ నిగ్రహం అమోఘం. మహి మేగ్నిఫిషియెంట్. ఆ సమయంలో నిగ్రహం అసమానం. ఒకవేళ ధోని రనౌట్ కాకుండా ఉండివుంటే, కచ్చితంగా అతడి ఆలోచనలను అమలు చేసేవాడు. ఆ ఓవర్లో ఎన్ని పరుగులు చేయాలి, ఏ బంతికి కొట్టాలి.. చివరి ఓవర్లో నీషమ్ కోసం ఎన్ని పరుగులు ఉంచుకోవాలనే సమీకరణాలను ధోని బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఛేదనను పూర్తి చేయాలనే తపన ధోనిలో కనిపించింది. డ్రెస్సింగ్రూమ్లో అతడి మొహంలో ఆ బాధ ప్రస్ఫుటంగా కనిపించింది అని శాస్త్రి తెలిపాడు.
ఇక్కడ్నుంచి తలపైకెత్తుకునే వెళ్లండి. గ్రూప్ దశలో ప్రదర్శన పట్ల గర్వపడండి. ఓ 30 నిమిషాల ఆట గత రెండేండ్లలో భారత్ అత్యుత్తమ జట్టు అనే రికార్డును తుడిచిపెట్టలేదు. ఆ విషయం మీకు తెలుసు. ఓ టోర్నమెంట్, ఓ సిరీస్, అందులో ఓ 30 నిమిషాల ఆట ఎన్నటికీ నిర్ణయించలేదు. మీ ఆటతో గౌరవం సంపాదించుకున్నారు. మీరు అందరి హృదయం పగిలిందని తెలుసు, నిరుత్సాహానికి గురయ్యారని తెలుసు. చివరగా, గత రెండేండ్లలో మీరు సాధించిన విజయాల పట్ల గర్వపడండి'
- ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్రూమ్లో ఆటగాళ్లతో రవిశాస్త్రి మాటలు.