Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్ల అనుభవం, 60 ఏండ్ల లోపు వయసు
- 30 టెస్టులు, 50 వన్డేల ఆడి ఉండాలి
- మూడు రూల్స్తో బీసీసీఐ ప్రకటన విడుదల
నవతెలంగాణ-ముంబయి
భారత క్రికెట్కు కొత్త కోచ్లు కావలెను. భారత సీనియర్ మెన్స్ జట్టుకు చీఫ్ కోచ్, సహాయక కోచ్ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 2017లో కోచ్ కోసం చేసిన ప్రకటనలో బీసీసీఏ ఏడు నిబంధనలు పొందుపరిచింది. కానీ వాటిలో చాలా నిబంధనలకు స్పష్టత ఇవ్వలేదు. కానీ ఈ సారి ప్రకటనలో బీసీసీఐ స్పష్టత పాటించింది. కేవలం మూడు ముఖ్యమైన నిబంధనలతో కొత్త కోచింగ్ బృందం కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు జులై 30 లోపు బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి తమ దరఖాస్తులు పంపించాలి. చీఫ్ కోచ్ సహా ముగ్గురు సహాయక కోచ్లు (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) కోచ్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఫిజియోథెరపిస్ట్, కండిషనింగ్ అండ్ ట్రైనింగ్ కోచ్ల స్థానాలను బోర్డు భర్తీ చేయనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కోచింగ్ బృందానికి నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్, ట్రైనర్ శంకర్ బసు వరల్డ్కప్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాత జట్టును వీడారు. ఇంటర్వూలకు ఆ ఇద్దరు తిరిగి హాజరు కావటం లేదు. తమిళనాడు మాజీ కెప్టెన్ ఆనంద్ సుబ్రమణియం ప్రస్తుతం టీమ్ ఇండియా మేనేజర్గా ఉన్నాడు. 2017లో నియమితులైన ఆనంద్, మరో ఏడాది పొడగింపు పొందాడు. జట్టు మేనేజర్ను గతంలో బీసీసీఐ నేరుగా నియమించేంది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఇప్పుడు అన్ని పోస్టులకు పారదర్శకంగా దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలుపెట్టింది.
మూడు నిబంధనలు : భారత సీనియర్ మెన్స్ జట్టుకు కాబోయే చీఫ్ కోచ్, సహాయక కోచ్లపై అర్హతలపై బీసీసీఐ స్పష్టమైన నిబంధనలు పొందుపరిచింది. చీఫ్ కోచ్ రెండేండ్ల అంతర్జాతీయ కోచింగ్ అనుభవం కలిగి ఉండాలి. వయసు 60 ఏండ్లకు మించకూడదు. కెరీర్లో కనీసం 30 టెస్టులు, 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. ఏదేని జాతీయ ఏ జట్టుకు/ అసోసియేట్ జట్టుకు/ ఐపీఎల్ జట్టుతో పనిచేసి ఉంటే కనీసం మూడేండ్ల కోచింగ్ అనుభవం కల్గి ఉండాలి. సహాయక కోచ్ల విషయంలో కెరీర్ అనుభవం 10 టెస్టులు, 25 వన్డేలకు సరిపోతుంది. వయసు 60 ఏండ్లకు పైబడి ఉండకూడదు.
రవిశాస్త్రికి కొనసాగింపు ఉంటుందా? : 2014 ఆగస్టు -2016 జూన్ వరకూ రవిశాస్త్రి టీమ్ ఇండియా డైరెక్టర్గా వ్యవహరించారు. శాస్త్రి టీమ్ డైరెక్టర్గా ధోనీసేన 2015 ప్రపంచకప్ వేటను సెమీఫైనల్లోనే ముగించింది. తాజాగా రవిశాస్త్రి చీఫ్ కోచ్గా కోహ్లిసేన 2019 ప్రపంచకప్ వేటను సెమీఫైనల్లోనే చాలించింది. శాస్త్రి హయాంలో ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు సిరీస్ సాధించటం చెప్పుకోదగిన విజయం. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి అనంతరం, అనిల్ కుంబ్లే చీఫ్ కోచ్గా తప్పుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో సంబంధాలను కుంబ్లే కారణంగా చూపాడు. ఆ తర్వాత రవిశాస్త్రిని క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) చీఫ్కోచ్గా సిఫారసు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రవిశాస్త్రిని తిరిగి చీఫ్ కోచ్గా కొనసాగిస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి రవిశాస్త్రి కోసం పట్టుబడే అవకాశం ఉన్నప్పటికీ.. వరుసగా రెండు మేజర్ ఐసీసీ టోర్నీల్లో విఫలమైన నాయకుడిగా కోహ్లి ఈసారి పాలకుల కమిటీ మద్దతు పొందే అవకాశం కనిపించటం లేదు.
కమిటీలో ఎవరున్నారు? : ఇదిలా ఉండగా, భారత క్రికెట్ చీఫ్ కోచ్ను ఎంపిక చేసే క్రికెట్ సలహా సంఘం (సీఓసీ)లో ఎవరున్నారు? అనే విషయం ఆసక్తి రేపుతోంది. ప్రపంచకప్లో స్టార్స్పోర్ట్స్ తరఫున వ్యాఖ్యాతగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ, మరోవైపు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో క్రికెట్ సలహా సంఘంలో ఉన్నారు. హైదరాబాద్ స్పెషలిస్ట్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పరిస్థితి ఇదే. అతడూ స్టార్స్పోర్ట్స్ తరఫున వ్యాఖ్యాతగా, సీఓసీలో సభ్యుడిగా ఉన్నారు. దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పరిస్థితి ఇదే. ఈ ముగ్గురిపై విరుద్ధ ప్రయోజనాల పిటిషన్లను విచారించిన బీసీసీఐ అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ డికె జైన్ ద్వంద ప్రయోజనాలు కల్గి ఉన్నారని తీర్పు చెప్పారు. బీసీసీఐ నూతన రాజ్యాంగం ' ఒక సమయంలో ఒక వ్యక్తికి ఒకే పదవి' నిబంధన ప్రకారం గంగూలీ, లక్ష్మణ్, సచిన్ విరుద్ధ ప్రయోజ నాలు పొందుతున్నారని, తదుపరి చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి సూచించారు. డికె జైన్ తీర్పును బీసీసీఐ తన లీగల్ సెల్ పరిశీలనకు పంపించింది. దీనిపై బోర్డు ఎటువంటి వైఖరి వెల్లడించలేదు. ఆగస్టు 1 నుంచి వెస్టిండీస్ పర్యటన మొదలు కానుండగా, సెప్టెంబర్ 15న స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభం కానుంది. ఆ సమయానికి కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గంగూలీ, సచిన్, లక్ష్మణ్లతో కూడిన కమిటీనే బోర్డు మళ్లీ నియమిస్తుందా? లేక విరుద్ధ ప్రయోజ నాలు అడ్డురాని అంతర్జాతీయ అనుభవం కలిగిన ఇతర క్రికెటర్లతో నూతన కమిటీ ఏర్పాటు చేస్తుందా? అనే విష యం తేలాల్సి ఉంది. విరుద్ధ ప్రయోజనాలపై వరుసగా తమ పై ఫిర్యాదులు రావటంపై విసుగు చెందిన సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తమను బీసీసీఐ పదవులకు పరిగణనలోకి తీసుకోవద్దని బోర్డుకు తెలిపిన సంగతి తెలిసిందే.