Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని స్నేహితుడు అరుణ్ పాండే
న్యూఢిల్లీ : 2019 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ ప్రదర్శన, సెమీస్ నిష్క్రమణపై చర్చ కంటే.. మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై ఎక్కువగా చర్చ సాగుతోంది. ధోని వీడ్కోలుపై పూటకో మాట, రోజుకో పుకారు పట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలో ధోని స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే స్పందించాడు. ఇప్పటికిప్పుడు వీడ్కోలు ఆలోచన ధోని మదిలో లేదని తేల్చి చెప్పాడు. వెస్టిండీస్ పర్యటనకు ఈ నెల 20న భారత జట్లను ఎంపిక చేయనున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు ధోనితో బీసీసీఐ అధికారులు మాట్లాడి, అతడి అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ' ప్రస్తుతానికి ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన ధోనికి లేదు. ధోని వంటి గొప్ప క్రికెటర్ భవిష్యత్పై నిత్యం ఊహాగానాలు చెలరేగటం దురదృష్టకరం' అని అరుణ్ పాండే పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో సెమీఫైనల్లో రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్కు ధోని 116 పరుగులు జోడించాడు. సెమీస్లో అర్థ సెంచరీ అనంతరం మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో ధోని రనౌట్ అయ్యాడు. అక్కడితో భారత్ వరల్డ్కప్ వేటకు తెరపడిన సంగతి తెలిసిందే.