Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ 7
ఆరంభ పోరులో టైటాన్స్, ముంబా ఢీ
క్రికెట్ ప్రపంచకప్ ముగిసింది. సుమారు రెండు మాసాల పాటు ఉర్రూతలూగించిన వరల్డ్కప్ సమరం ఇక ముగిసిన అధ్యాయం. ఫోర్, సిక్సర్, వికెట్ అరుపుల నుంచి కబడ్డీ కబడ్డీ కూతకు వచ్చేద్దాం!. భారత క్రీడాభిమానుల దృష్టి ఇప్పుడు కబడ్డీ వైపు మళ్లుతోంది. అంచనాలు లేకుండా మొదలైన ప్రొ కబడ్డీ, ఏడో సీజన్కు భారీ అంచనాలతో సిద్ధమవుతోంది. ఏడో సీజన్లో టైటిల్ కోసం 12 జట్లు పోటీపడుతున్నాయి. హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఆరంభ మ్యాచ్తో షురూ కానున్న కబడ్డీ కూత.. అక్టోబర్ 19న నోయిడాలో టైటిల్ పోరుతో ముగియనుంది. సుదీర్ఘంగా సాగనున్న ప్రొ కబడ్డీ 7 సీజన్ 137 మ్యాచులను అలరించనుంది.
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7కు రంగం సిద్ధమైంది.12 జట్లు, 137 మ్యాచులు.. ఒక టైటల్. సీజన్ 7 మరింత ఆకర్షణీయంగా మన ముందుకొస్తుంది. గత సీజన్లలో పాటించిన జోనల్ విధానం పోటీ ఈసారి ఉండదు. ఐపీఎల్ తరహా డబుల్ రౌండ్ రాబిన్ పోటీలు, ప్లే ఆఫ్స్తో కబడ్డీ కూత దూసుకొస్తుంది. టైటిల్ కోసం అన్ని జట్లు సరికొత్త అస్త్రాలతో సిద్ధమైనా.. తమిళ తలైవాస్, గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్, పట్నా పైరేట్స్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న టోర్నీలో దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, పుణెరి పల్టన్స్లు అండర్డాగ్స్గా ఆడబోతున్నాయి. రెండో సీజన్ చాంపియన్ యు ముంబాతో ఆతిథ్య తెలుగు టైటాన్స్ సీజన్ ఆరంభ మ్యాచ్లో తలపడనుంది. మరో మ్యాచ్లో మూడు సార్లు విజేత పట్నా పైరేట్స్తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూర్ బుల్స్ ఢకొీట్టనుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తొలి వారం మ్యాచులు జరుగనున్నాయి.
సీజన్ 7కు జట్ల సన్నద్ధత విషయానికొస్తే ముందుగా తెలుగు టైటాన్స్ గురించి చెప్పుకోవాలి. ఆరంభ సీజన్లోనే 200 రైడ్ పాయింట్లతో సంచలనం సృష్టించిన సిద్దార్థ్ దేశారును సొంతం చేసుకున్న తెలుగు టైటాన్స్ మరోసారి టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరిని వదులుకున్నా.. సిద్దార్థ్ దేశారు బాహుబలి ప్రదర్శన తొలి టైటిల్ అందిస్తుందని టైటాన్స్ బలంగా నమ్ముతోంది. వేలంలో రూ. 1.45 కోట్ల రికార్డు ధరకు దేశారును తెలుగు టైటాన్స్ దక్కించుకుంది. భుజం గాయం నుంచి కోలుకున్న దేశారు నేడు యు ముంబాతో మ్యాచ్కు ప్రధాన ఆకర్షణ!.
డిఫెండింగ్ చాంపియన్ బెంగళూర్ బుల్స్ ఇద్దరు కీలక ఆటగాళ్లును నిలుపుకుంది. కెప్టెన్ రోహిత్ కుమార్, పవన్ కుమార్ షెర్వాత్లు బుల్స్ ప్రధాన బలం. ఈ ఇద్దరూ గత సీజన్లో ఏకంగా 433 రైడ్ పాయింట్లు సాధించారు. జట్టు పాయింట్లలో ఇది 79 శాతం. డిఫెండర్ మహేందర సింగ్తో కలిసి రోహిత్, పవన్ మేజిక్ బెంగళూర్ను మరోసారి ఫేవరేట్ల జాబితాలో నిలుపుతోంది. పట్నా పైరేట్స్ తర్వాత టైటిల్ నిలుపుకున్న రెండో జట్టుగా నిలిచేందుకు బుల్స్ సిద్ధమవుతోంది.
పీకెఎల్ చరిత్రలోనే టైటిల్ నిలుపుకున్న ఏకైక జట్టు పట్నా పైరేట్స్. వరుసగా మూడు సీజన్లలో విజేతగా నిలువటంలో డబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ది కీలక పాత్ర. పీకెఎల్ ఆరు సీజన్లలో తొలిసారి పట్నా ప్లే ఆఫ్స్కు చేరలేదు. గత సీజన్లో గుజరాత్ చేతిలో ఓడిన పట్నా ప్లే ఆఫ్స్కు దూరమైంది. పర్దీప్ నర్వాల్ ప్రదర్శనపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న పట్నా.. అతడు మెరిస్తే నాల్గో టైటిల్ అందుకోవటం కష్టమేమీ కాదని విశ్వసిస్తోంది.
ప్రొ కబడ్డీ లీగ్లోకి అడుగుపెట్టిన తొలి రెండు సీజన్లలో ఫైనల్స్కు చేరిన జట్టు గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్. భారత కబడ్డీ జట్టులోని ఏ స్టార్ క్రీడాకారుడు గుజరాత్ జట్టులో లేడు. అయినా, కోచ్ మన్ప్రీత్ సింగ్ అద్భుతమైన నైపుణ్యం గుజరాత్ను ఫేవరెట్గా నిలుపుతోంది. ఆటగాడిగా పట్నాకు తొలి టైటిల్ అందించటంలో ముఖ్య భూమిక వహించిన మన్ప్రీత్.. కోచ్గా మూడోసారి టైటిల్పై గురి పెట్టాడు. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా గుజరాత్ నిలకడగా రాణిస్తుండటం గొప్ప విషయం.
ఈ ఏడాది లీగ్లో గొప్పగా కనిపిస్తోన్న జట్లలో తమిళ తలైవాస్ ముందుంది. వరుసగా రెండు సీజన్లలో నిరాశపరిచిన తలైవాస్.. ఈసారి వేలంలో బలమైన ఆటగాళ్లను తీసుకుంది. రైడ్ మిషన్ రాహుల్ చౌదరి రాకతో తలైవాస్ స్వరూపం మారిపోయింది. కెప్టెన్ అజరు ఠాకూర్పై రాహుల్ ఒత్తిడి తగ్గించగలడు. కీలక సమయాల్లో అలవోకగా పాయింట్లు తీసుకురాగలడు. మంజిత్ చిల్లార్, రణ్సింగ్లు వీరికి తోడయ్యారు. స్టార్ ఆటగాళ్లతో కూడిన తలైవాస్ ఈ సీజన్ టైటిల్ రేసులో ముందుంది!.
తలైవాస్తో పాటు సీజన్ 5లో మొదలైన యూపీ యోధ ప్రస్థానం ఆసక్తికరం. గత రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్కు చేరిన యోధను ఈ సీజన్లో నితీశ్ కుమార్ నడిపించనున్నాడు. స్టార్ రైడర్ మోను గోయత్, రిషాంక్ దేవాడిగ, శ్రీకాంత్ జాదవ్లతో యోధ మరోసారి బలమైన జట్టుగా కనిపిస్తోంది.
జట్టు మొత్తాన్ని వేలంలోకి వదిలేసినా, స్టార్ రైడర్ నితిన్ తోమర్, డిఫెండర్ గిరీశ్ ఎర్నాక్లను ఫైనల్ బిడ్ మ్యాచ్ కార్డుతో పుణెరి పల్టన్ తిరిగి తెచ్చుకుంది. మంజీత్, సుర్జీత్లు పుణెను మరింత బలోపేతం చేస్తున్నారు. రెండో సీజన్లో యు ముంబాను విజేతగా నిలిపిన కూల్ ప్లేయర్, అనూప్ కుమార్ కోచ్గా తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నాడు.
బెంగళూర్ బుల్స్కు టైటిల్ అందించిన బీసీ రమేశ్ను కోచ్గా తెచ్చుకున్న బెంగాల్ వారియర్స్ సీజన్లో అదృష్టం పరీక్షించుకోనుంది. ఇరాన్ ఆల్రౌండర్ మహ్మద్ ఎస్మాయెల్ కోసం రూ. 77 లక్షలు వెచ్చించిన బెంగాల్ అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. యు ముంబాకు నాయకత్వం వహిస్తున్న ఇరానీ ఆటగాడు ఫజల్ అత్రచలి ఈ సీజన్లో ఆ జట్టుకు ట్రంప్ కార్డు. టాకిల్స్లో కండ్లుచెదిరే ప్రదర్శన చేసే ఫజల్ ముంబాకు రెండో టైటిల్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఆరంభ సీజన్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్, మరోసారి ఫైనల్స్కు చేరినా విజయం సాధించలేదు. నాల్గో సీజన్లో ప్లే ఆఫ్స్తో సరిపెట్టుకుంది. గత సీజన్లలో జైపూర్ ప్రదర్శన పేలవం. జాతీయ జట్టు కోచ్ శ్రీనివాస్ రెడ్డి రాకతో పాంథర్స్ రాత మారుతుందేమో చూడాలి. డిఫెండర్లతో కూడిన దబంగ్ ఢిల్లీ అండర్ డాగ్గా బరిలోకి దిగుతోంది. మేరాజ్ షేక్, నితీశ్ కుమార్, రవిందర్ పహాల్, చంద్రన్ రంజిత్లు ఉన్నప్పటికీ టైటిల్ రేసులో దబంగ్ లేదనే చెప్పాలి!.