Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరంభ మ్యాచ్లో 25-31తో ఓటమి
- బోణీ కొట్టిన యు ముంబా
- తొడకొట్టిన బెంగళూర్ బుల్స్
ఆరు సీజన్లుగా ఎదురుచూస్తున్న పీకెఎల్ టైటిల్ స్వప్నాన్ని ఏడో సీజన్లో సాకారం చేసుకుందామనుకుంది తెలుగు టైటాన్స్. అరంగేట్ర సీజన్లోనే అద్భుతాలు చేసిన బాహుబలి 'సిద్దార్థ్ దేశారు'ను కోట్లు పెట్టి తెచ్చుకుంది. ఇంత చేసినా, ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్కు భంగపాటు తప్పలేదు. స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశారు వైఫల్యం తీవ్ర ప్రభావం చూపించింది. రెండో సీజన్ చాంపియన్ యు ముంబా తొలి మ్యాచ్లో సాధికారిక విజయం సొంతం చేసుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్లో ఇరు జట్ల కెప్టెన్లు విదేశీయులు (ఇరాన్) కావటం ఇదే ప్రథమం. తెలుగు కెప్టెన్ అబోజర్, ముంబా సారథి ఫజెల్ ఇరాన్ ఆటగాళ్లు.
నవతెలంగాణ-హైదరాబాద్
ఆరు సీజన్లలో టైటిల్ ఫేవరెట్గా ప్రయాణం మొదలు. ఆరంభ మ్యాచుల్లో అదిరే ప్రదర్శన. ఇదీ పీకెఎల్లో తెలుగు టైటాన్స్ గత చరిత్ర. ఈ సీజన్లో సిద్దార్థ్ దేశారుపై కోటి ఆశలు పెట్టుకున్న తెలుగు టైటాన్స్.. అతడి వైఫల్యంతో బొక్కబోర్లా పడింది. ప్రొ కబడ్డీ లీగ్ 7 సీజన్ ఆరంభ మ్యాచ్లో యు ముంబా చేతిలో 25-31తో ఆరు పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. మరో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూర్ బుల్స్ బోణీ కొట్టింది. మూడు సార్లు విజేత పట్నా పైరేట్స్పై 34-32తో విజయం సాధించింది.
టైటాన్స్ ఢీలా.. : ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ టైటిల్ వేట ఆశించిన రీతిలో ఆరంభం కాలేదు. అరంగేట్ర సీజన్లోనే 200 పైచిలుకు పాయింట్లతో సంచలనం సృష్టించిన రైడర్ సిద్దార్థ్ దేశారు ఆట ప్రథమార్థంలో తీవ్ర నిరాశపరిచాడు. తొలి 20 నిమిషాల్లో 8 సార్లు కూతకెళ్లిన సిద్దార్థ్ ఓ బోనస్ పాయింట్ మినహా టచ్ పాయింట్ సాధించలేకపోయాడు. నాలుగుసార్లు ముంబయి డిఫెండర్లు సిద్దార్థ్ను పట్టేశారు. దీంతో టైటాన్స్ వెనుకంజలో కొనసాగింది. విరామ సమయానికి 10-17తో టైటాన్స్ ఏడు పాయింట్ల వెనుకంజలో కొనసాగింది. ద్వితీయార్థంలోనూ టైటాన్స్ పుంజుకోవటంలో విఫలమైంది. సిద్దార్థ్ రైడింగ్లో మరో మూడు పాయింట్లుతో మెరిసినా ఫలితం లేకపోయింది. టైటాన్స్ తరఫున రజ్నీష్ ఏడు రైడ్ పాయింట్లు సాధించగా, డిఫెండర్ రాకేశ్ గౌడ రెండు ట్యాకిల్స్ చేశాడు. కెప్టెన్ అబోజర్ సైతం రెండు ట్యాకిల్స్తో మెరిశాడు. సిద్దార్థ్ ఐదు పాయింట్లు సాధించాడు. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ 10 రైడ్ పాయింట్లు సాధించాడు. డిఫెండర్ సందీప్ నర్వాల్ నాలుగు ట్యాకిల్స్తో అదరగొట్టాడు. సిద్దార్థ్ దేశారును సందీప్ ట్యాకిల్ చేసిన తీరు మ్యాచ్లో హైలైట్.
బోణీ కొట్టిన బెంగళూర్ : డిఫెండింగ్ చాంపియన్ బెంగళూర్ బుల్స్ బోణీ కొట్టింది. పర్దీప్ నర్వాల్ సారథ్యంలోని పట్నా ప్రథమార్థంలో ఆధిక్యంలో నిలిచినా.. రోహిత్ కుమార్ బుల్స్ను కూల్గా నడిపించాడు. విరామ సమయానికి 13-17తో బెంగళూర్ వెనుకబడింది. ఈ సమయంలో బుల్స్ డిఫెండర్లు అద్భుతం చేశారు. వరుస పెట్టిన సూపర్ ట్యాకిల్స్తో పైరేట్స్తో పాయింట్ల అంతరాన్ని గణనీయంగా కుదించారు. బుల్స్ రైడర్ పవన్ షెరావత్ 9 పాయింట్లు, రోహిత్ కుమార్ నాలుగు పాయింట్లు సాధించారు. డిఫెండర్ అమిత్ ఐదు ట్యాకిల్స్లో మెరిశాడు. పట్నా కెప్టెన్ పర్దీప్ పది రైడ్ పాయింట్లతో మెరిసినా జట్టును గెలిపించుకోలేదు. పీకెఎల్ చరిత్రలోనే తొలిసారి గచ్చిబౌలి స్టేడియం పూర్తిగా నిండిపోయింది. అన్ని స్టాండ్లు అభిమానుల సందడితో కొత్త అనుభూతిని దక్కించుకున్నాయి!.